Visakha MLC Election : బలమున్న చోట జగన్ ను దెబ్బతీయాలని చూస్తున్న చంద్రబాబు.. సాధ్యమేనా?

సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చి రెండు నెలలు అవుతోంది. ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించి 50 రోజులు దాటుతోంది. ఇప్పుడు మరో ఎన్నికలు తెరపైకి వచ్చాయి. తాడోపేడో తేల్చుకునేందుకు అధికార, విపక్షాలు సిద్ధపడ్డాయి.

Written By: Dharma, Updated On : August 9, 2024 2:04 pm
Follow us on

Visakha MLC Election : ఇప్పుడు అందరి దృష్టి విశాఖపట్నం పడింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరగనుంది. నోటిఫికేషన్ జారీ కావడంతో వైసిపి తన అభ్యర్థిగా మాజీమంత్రి బొత్స పేరును ఖరారు చేసింది. ఇప్పటికే జగన్ రెండు రోజులపాటు విశాఖ ప్రజా ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. వారికి దిశ నిర్దేశం చేశారు. అనంతరం బెంగళూరు శిబిరానికి తరలించారు. మరోవైపు కూటమి అభ్యర్థిగా పీలా గోవింద సత్యనారాయణ పేరు దాదాపు ఖరారు అయింది. కానీ మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జి సైతం తన ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ ఇద్దరిలో ఒకరి పేరు ఖాయం. ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఈరోజు చంద్రబాబు రివ్యూ చేస్తారు. పార్టీ శ్రేణుల అభిప్రాయాలను తీసుకోనున్నారు. వారి అభిప్రాయాల మేరకు అభ్యర్థిని ఎంపిక చేయనున్నారు. విశాఖ స్థాయి సంఘ ఎన్నికల్లో టిడిపి కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికపై ఆ ప్రభావం పడనుంది. వైసిపి ఆందోళన చెందుతుండగా.. టిడిపి కూటమిలో మాత్రం కొంత ధైర్యం కనిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికలు జరిగి రెండు నెలలు కాకమునుపే.. ఎన్నికలు జరుగుతుండడంతో వైసీపీ శ్రేణులునిరాశతో ఉన్నాయి. ఎలాగైనా ఈ స్థానాన్ని గెలుచుకోవాలన్న కసి కనిపిస్తోంది. చివరి వరకు స్థానిక ప్రజాప్రతినిధులు నిలబడతారా? లేదా? అన్న అనుమానాలు మాత్రం కలుగుతున్నాయి. ఈ తరుణంలో ఈరోజు చంద్రబాబు టిడిపి శ్రేణులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నారు. దీంతో అభ్యర్థి పేరు ఖరారు చేయనున్నారు.

* వైసీపీకి స్పష్టమైన బలం
స్థానిక సంస్థలకు సంబంధించి వైసీపీకి స్పష్టమైన బలం ఉంది. దాదాపు 600కు పైగా స్థానిక ప్రజాప్రతినిధులు వైసీపీకి ఉన్నారు. కూటమికి కేవలం 200 మాత్రమే బలం ఉంది. అందుకే బలమైన అభ్యర్థి అవుతారని బొత్స పేరును ప్రకటించారు జగన్. ప్రజా ప్రతినిధులు ప్రలోభాలకు గురి కాకుండా బొత్స లాబీయింగ్ చేసి అడ్డుకట్ట వేయగలరని భావిస్తున్నారు. ఇప్పటికే పార్టీ ప్రజా ప్రతినిధులతో సమావేశమైన జగన్.. వారిని బెంగళూరు క్యాంపుకు తరలించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో వైసీపీ ప్రజాప్రతినిధులు టిడిపి కూటమిలో చేరిక కొనసాగుతోంది. చంద్రబాబు రివ్యూ సందర్భంగా ఒక 15 మంది స్థానిక ప్రజాప్రతినిధులు టిడిపిలో చేరే పరిస్థితి కనిపిస్తోంది.

* ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జగన్
ఎట్టి పరిస్థితుల్లో విశాఖ ఎమ్మెల్సీ స్థానాన్ని వదులుకోకూడదని జగన్ భావిస్తున్నారు. తమ పార్టీకి బలం ఉందని చెప్పుకొస్తున్నారు. ఆ బలాన్ని తిప్పి కొట్టాలని చంద్రబాబు భావిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ బలవంతంగా గెలిచిందని టిడిపి నేతలు గుర్తు చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఇప్పటికే టిడిపికి 300 వరకుసంఖ్యా బలం ఉందని.. తమ వైపు తిప్పుకుంటే సునాయాసంగా విజయం సాధిస్తామని తెలుగుదేశం పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. విశాఖ స్థాయి సంఘ ఎన్నికల్లో పదికి పది సీట్లు సాధించింది టిడిపి కూటమి. ఇప్పుడు అదే స్ఫూర్తితో ముందుకు సాగుతోంది. జగన్ బలాన్ని బలంగా తిప్పి కొట్టి.. మరోసారి దెబ్బ తీయాలని భావిస్తోంది.

* వెంటాడుతున్న భయం
ఉమ్మడి విశాఖ జిల్లాలో 15 అసెంబ్లీ స్థానాలకు గాను 13 చోట్ల వైసీపీ ఓడిపోయింది.అరకు, పాడేరులో మాత్రమే గెలిచింది. అయితే ఆ రెండు చోట్ల టిడిపి కూటమికి క్షేత్రస్థాయి బలం ఉంది స్థానిక ప్రజా ప్రతినిధుల మద్దతు ఉంది. అందుకే వైసీపీ శ్రేణుల్లో ఒక రకమైన భయం కనిపిస్తోంది. అయితే బెంగళూరు క్యాంపునకు ఎంతమంది వెళ్లారు? వారందరూ చివరి వరకు నిలబడతారా? లేకుంటే డ్రాప్ అవుతారా? వారి కుటుంబ సభ్యులకు టిడిపి టచ్ లోకి వెళ్లిందా? అన్న అనుమానాలు వెంటాడుతున్నాయి. ఈరోజు టిడిపి అభ్యర్థి ఖరారు అయితే ఎన్నికలు మరింత కాక రేపే అవకాశం ఉంది.