AP Elections 2024: తప్పు జనసేనది.. మూల్యం కూటమికి

ఎలక్షన్ కమిషన్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఈసీ వెబ్సైట్లో ఫ్రీ సింబల్స్ జాబితాను విడుదల చేసింది. అందులో గాజు గ్లాసు గుర్తు స్పష్టంగా కనిపిస్తోంది. జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తును రిజర్వ్ చేయడం ఖాయం.

Written By: Dharma, Updated On : April 30, 2024 1:12 pm

AP Elections 2024

Follow us on

AP Elections 2024: ఎన్నికలు అన్నాక వ్యూహాలు ఉంటాయి. ప్రతి వ్యూహాలు ఉంటాయి. నేరుగా ప్రజల మద్దతు కాదు. మరెన్నో అంశాలు ఎన్నికల్లో గెలుపోటములను ప్రభావితం చేస్తాయి. వాటిని పరిగణలోకి తీసుకోకపోతే ఆ రాజకీయ పార్టీలు మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇప్పుడు జనసేన తప్పిదంతో.. కూటమి మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. రాజకీయం అంటేనే కుట్రలు, కుతంత్రాలు ఉంటాయి. తాము గెలవాలంటే కచ్చితంగా ప్రత్యర్థి ఓడిపోవాలి. దానికి ఒక్క ప్రజల మద్దతే కాదు. ఓట్లను అడ్డగోలుగా చీల్చాలి. తప్పుడు ప్రచారాలు చేయాలి. ఇటువంటి వాటిని ఎదుర్కొని నిలబడే వారే గెలుపును అందుకోగలరు. అయితే పరిస్థితి చేయి దాటాక గగ్గోలు పెడితే లాభం ఉండదు.ఇప్పుడు ఏపీలో జనసేన చేస్తున్నది ఇదే. గాజు గ్లాస్ గుర్తు విషయంలో చేజేతులా మీదకు తెచ్చుకున్నది జనసేన.

ఎలక్షన్ కమిషన్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఈసీ వెబ్సైట్లో ఫ్రీ సింబల్స్ జాబితాను విడుదల చేసింది. అందులో గాజు గ్లాసు గుర్తు స్పష్టంగా కనిపిస్తోంది. జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తును రిజర్వ్ చేయడం ఖాయం. కానీ గుర్తింపు లేదు ఆ పార్టీకి. అందుకే కామన్ సింబల్ కేటాయించలేదు. అయితే రాజకీయ పార్టీల ప్రత్యేక వినతులకు ఈసీ స్పందిస్తుంది. కానీ ఎందుకో జనసేన వినతిని ఈసీ పరిగణలోకి తీసుకోలేదు.అయితే ఈ విషయంలో కూటమి పార్టీలు సైతం ఉదాసీనంగా వ్యవహరించడం మాత్రం తగదు. గుర్తులు కేటాయించే వరకు ఫ్రీ సింబల్స్ లో గ్లాస్ ఉందని తెలిసి కూడా.. ఈసీ వద్దకు వెళ్లి తమ అభ్యంతరాలు వ్యక్తం చేయలేకపోయారు. అది వైసీపీకి కలిసి వచ్చింది. కూటమి రెబల్స్ తో పాటు వైసిపి డమ్మీ అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తు దక్కింది.

గుర్తుల విషయంలో రాజకీయ పార్టీలు అప్రమత్తంగా ఉండాలి.ఫ్యాన్ గుర్తును పోలి ఉండేలా గుర్తు ఏదైనా ఉంటే వైసీపీ నుంచి అభ్యంతరం వ్యక్తం కావడం ఖాయం. సైకిల్ గుర్తును పోలి ఉండేలా ఏదైనా గుర్తింపు ఉంటే దాన్ని ఇండిపెండెంట్ లకు కేటాయించవద్దని టిడిపి కోరుతుంది. కానీ జనసేన విషయానికి వచ్చేసరికి మాత్రం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు కూటమి నేతలు గగ్గోలు పెట్టడం తప్ప ఏమి చేయలేకపోయారు. ఫ్రీ సింబల్స్ కేటగిరీలు గాజు గ్లాసు గుర్తు ఉంది కాబట్టి తాము కేటాయించినట్లు ఎన్నికల అధికారులు చెబుతున్నారు. అయితే అదే సమయంలో గాజు గ్లాసు గుర్తుతో తమకు పెద్దగా నష్టం ఉండదని కూటమి అభ్యర్థులు లైట్ తీసుకుంటే ఇబ్బందికర పరిణామాలు తప్పవు. మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తు దక్కించుకున్న పార్టీలు వేల ఓట్లు దక్కించుకున్నాయి. వారికి తమ కుటుంబ సభ్యులు తప్ప ఎవరూ ఓటు వేయరు అన్న రీతిలో ఉండేది అక్కడ పరిస్థితి. కానీ గాజు గ్లాస్ గుర్తు దక్కించుకోవడంతో వేల ఓట్లు సాధించారు. తమకు తామే ఆశ్చర్యానికి గురయ్యారు. ఇప్పుడు అదే పరిస్థితి ఏపీలో ఉంటుంది. వందల మెజారిటీ ఉన్నచోట్ల వైసిపికి ప్రయోజనం చేకూర్చనుంది. అయితే గాజు గ్లాసు గుర్తు విషయంలో జనసేన ఉదాసీనత కూటమికి ఇబ్బందికరంగా మారింది.