Babu has come: బాబు వచ్చాడు.. తిరుమల దర్శనాలకు చెక్ పెట్టాడు.. గింజుకుంటున్న తెలంగాణ ఎమ్మెల్యేలు

ఏపీలో కూటమి సర్కార్ ఏర్పడ్డప్పటి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులోనూ.. తిరుమల, తిరుపతి దేవస్థానం విషయంలో చాలా ముందు చూపుతో ముందుకు సాగుతున్నారు. భక్తులకు ఎక్కడా అసౌకర్యాలు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భక్తుల నుంచి ఎలాంటి మాట రాకుండా చూడాలని ఇప్పటికే టీటీడీ అధికారులనూ ఆదేశించారు.

Written By: Srinivas, Updated On : October 22, 2024 4:34 pm

TTD

Follow us on

Babu has come: ఏపీలో కూటమి సర్కార్ ఏర్పడ్డప్పటి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులోనూ.. తిరుమల, తిరుపతి దేవస్థానం విషయంలో చాలా ముందు చూపుతో ముందుకు సాగుతున్నారు. భక్తులకు ఎక్కడా అసౌకర్యాలు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భక్తుల నుంచి ఎలాంటి మాట రాకుండా చూడాలని ఇప్పటికే టీటీడీ అధికారులనూ ఆదేశించారు. తాను ఎంతగానో నమ్మే శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు ప్రశాంత వాతావరణంలో దర్శనాలు చేసుకునేలా చర్యలు చేపట్టారు. అందులోనూ ప్రధానంగా లడ్డూ, దర్శనాల సమయంపై ప్రత్యేక దృష్టి సారించారు. అందుకే కొన్ని కొన్ని సందర్భాల్లో భక్తుల కోసం ఏకంగా వీఐపీ దర్శనాలకూ బ్రేక్ వేస్తున్నారు. గత వైసీపీ సర్కార్‌కు ఇప్పటికి తిరుమలపై ఎన్నో మార్పులు జరిగాయి. ముఖ్యంగా గత ప్రభుత్వం నిలిపివేసిన అన్నదానాలు, ఆహారంలో నాణ్యత, లడ్డూల తయారీలో అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

అయితే.. వీఐపీలకు కొండపై ప్రధాన్యత ఇవ్వకపోవడంపై కొందరు ప్రజాప్రతినిధుల నుంచి వ్యతిరేకత ఎదురైంది. అందులోనూ తెలంగాణకు చెందిన ప్రజాప్రతినిధులు తమకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల కాంగ్రెస్‌కు చెందిన ఓ ఎమ్మెల్సీ, ఓ ఎమ్మెల్యే అక్కడి ప్రభుత్వం, టీటీడీ అధికారుల తీరుపై మండిపడ్డారు. ప్రోటోకాల్ ప్రకారం తమకు గౌరవ మర్యాదలు ఇవ్వలేదని పేర్కొన్నారు. తమ సిఫారసు లేఖలు ప్రాముఖ్యంలోకి తీసుకోవాలని, దర్శన టికెట్లు, గదులు ఇవ్వాలని అంటున్నారు. లేదంటే తాము కూడా సీరియస్‌గా ఆలోచించాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు.. ఏపీలో ఎమ్మెల్యేలు భద్రాచలం, యాదాద్రి వచ్చినప్పుడు ప్రోటోకాల్ దర్శనాలు కల్పిస్తున్నామని చెప్పారు. కానీ.. టీటీడీలో మాత్రం తాము ఇచ్చిన సిఫారసు లేఖలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని అంటున్నారు.

గత ప్రభుత్వం హయాంలో తెలంగాణకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సిఫారు లేఖలతో వీఐపీ దర్శనాలు కల్పించేవారు. ఆ టికెట్ల మీద రూములు కేటాయించేవారు. అయితే.. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక వాటికి చెక్ పెట్టింది. ఎందుకంటే గతంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సిఫారసుల లేఖల పేరిట పెద్ద ఎత్తున టికెట్లు కేటాయించుకుని అమ్ముకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దాంతో ఇప్పుడు కేవలం వీఐపీలకే మాత్రమే ప్రాధాన్యత కల్పిస్తున్నారు. వారు ఇస్తున్న సిఫారసు లేఖలను మాత్రం లెక్కల్లోకి తీసుకోవడం లేదు. అందులోనూ.. తెలంగాణ ప్రజాప్రతినిధులు ఇస్తున్న లేఖలను మొత్తమే పరిగణనలోకి తీసుకోవడం లేదు. వీఐపీ హోదాలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు దర్శనాలకు వస్తే వారికి మాత్రం వీఐపీ దర్శనాలు కల్పిస్తున్నారు. ఎక్కడా లోటుపాట్లు జరగకుండా టీటీడీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఏపీ ప్రజాప్రతినిధులు మాదిరిగానే ట్రీట్ చేస్తున్నారు. అయితే..ఆ మాత్రం తమకు సరిపోదని తెలంగాణ ఎమ్మెల్యేలు అంటున్నారు. అంతకు మించిన గౌరవం కోరుకుంటున్నారని వారి వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది. అయితే.. ప్రస్తుతానికి ఇంకా టీటీడీ పాలకవర్గం లేదు. కొత్త చైర్మన్, కొత్త పాలకమండలి ఏర్పాటైతే దీనిపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తున్నది. తెలంగాణ నుంచి కూడా ఒకరిద్దరికి అవకాశం కల్పించవచ్చు అన్న ప్రచారం వినిపిస్తోంది