Balineni Srinivas Reddy: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి( balineni Srinivas Reddy ) పవన్ కళ్యాణ్ తో సమావేశం అయ్యారు. తన కుమారుడు ప్రణీత్ రెడ్డిని వెంట తీసుకెళ్లి మరి పవన్ కళ్యాణ్ తో గంటన్నర పాటు చర్చలు జరిపారు. దీంతో పొలిటికల్ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. జనసేనలో బాలినేని కి అంత ప్రాధాన్యం లేదని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇలా సమావేశం కావడం మాత్రం హాట్ టాపిక్ అవుతోంది. అదికూడా జగన్మోహన్ రెడ్డి ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం పై సమీక్ష జరిపి అభ్యర్థి పై ఒక క్లారిటీ ఇచ్చారు. ఆ మరుసటి రోజు బాలినేని తన కుమారుడిని తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ ను కలవడం మాత్రం ప్రాధాన్యత సంతరించుకుంది. మరో నాలుగు రోజుల్లో మళ్ళీ కలుద్దాం అంటూ పవన్ కళ్యాణ్ బాలినేని తో చెప్పడం కూడా కొత్త చర్చకు దారి తీస్తోంది.
Also Read: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రీమియర్ షోస్ రివ్యూ…మామూలు రచ్చ కాదుగా..?
* సుదీర్ఘ నేపథ్యం..
బాలినేని సీనియర్ మోస్ట్ లీడర్. ప్రకాశం( Prakasam ) జిల్లా రాజకీయాలను ప్రభావితం చేసిన నాయకుడు. ఒంగోలు అసెంబ్లీ స్థానం నుంచి ఏడుసార్లు పోటీ చేశారు. ఐదు సార్లు ఎన్నికయ్యారు. రెండుసార్లు మాత్రమే ఓటమి చవిచూశారు. 2024లో ఓడిపోయేసరికి జనసేనలో చేరారు. అయితే ఇంతవరకు ఆయనకు ఎటువంటి పదవి లేదు. ఆపై జనసేనలో కూడా తగినంత ప్రాధాన్యం ఇవ్వడం లేదు. దీంతో ఆయన వైయస్సార్ కాంగ్రెస్ గూటికి చేరిపోతారని పొలిటికల్ వర్గాల్లో చర్చ నడిచింది. అయితే జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కీలక సూచనలు చేశారు. దీంతో బాలినేని రూట్ మార్చినట్లు తెలుస్తోంది.
* క్లారిటీ ఇచ్చిన జగన్..
ఇటీవల వైయస్ జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం విషయంలో సమీక్ష జరిపారు. బాలినేని తిరిగి వైసిపి వైపు చూస్తున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో జగన్ ఈ సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. చుండూరి రవి నాయకత్వంలో వెళ్లాలని వైసీపీ శ్రేణులకు సూచించడం ద్వారా జగన్మోహన్ రెడ్డి బాలినేని శ్రీనివాస్ రెడ్డికి డోర్స్ క్లోజ్ చేసినట్లు స్పష్టమవుతోంది. అయితే జగన్ సమీక్ష జరిపిన ఆ తరువాత రోజు తన కుమారుడిని తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ ను పరిచయం చేశారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో తన కుమారుడితో పోటీ చేయించాలని తన ఆకాంక్షను బయటపెట్టారు. తాను జనసేన పార్టీలో కోరుకుంటున్న స్థానం విషయంలో కూడా పవన్ కళ్యాణ్ ముందు బయటపడ్డారట బాలినేని శ్రీనివాస్ రెడ్డి. అయితే దీనిపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ మరో నాలుగు రోజులు ఆగాలని.. ఆ తర్వాత కలుద్దాం అంటూ చెప్పినట్లు సమాచారం. దీంతో బాలినేని శ్రీనివాస్ రెడ్డికి జనసేనలో కీలక పదవి దక్కబోతుందన్నది పొలిటికల్ వర్గాల్లో టాక్. మరి ఏం జరుగుతుందో చూడాలి.
