AP Talliki Vandanam Amount: ఏపీలో( Andhra Pradesh) కూటమి ప్రభుత్వం ఏడాదిపాలన పూర్తిచేసుకోనుంది. అందుకే సూపర్ సిక్స్ పథకాల్లో ప్రధానమైనదిగా భావిస్తున్న తల్లికి వందనం పథకాన్ని అమలు చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా 67,27,164 మంది విద్యార్థుల తల్లుల ఖాతాలో ఈరోజు రూ.8745 కోట్లు జమ చేయనున్నారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఈ పథకం వర్తింపజేయనున్నారు. అయితే రూ.15 వేలు చొప్పున సాయం అందిస్తామని ప్రభుత్వం చెప్పిన సంగతి తెలిసిందే. కానీ తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో మాత్రం కేవలం రూ.13 వేలు మాత్రమే ఇస్తామని ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. అయితే వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం సైతం రూ.13 వేల చొప్పున మాత్రమే ఇచ్చింది. 2000 రూపాయలు పాఠశాల, మరుగుదొడ్ల నిర్వహణ కింద కోత విధించింది. అయితే కూటమి ప్రభుత్వం ఇంట్లో ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమందికి రూ. 13000 అందించేందుకు సిద్ధపడుతుండడం మాత్రం నిజంగా సాహసమే.
తొలి ఏడాదే 15 వేలు..
2019లో వైయస్సార్ కాంగ్రెస్ ( YSR Congress ) అధికారంలోకి వచ్చింది. నవరత్నాల్లో భాగంగా అమ్మ ఒడిని అమలు చేసింది. ప్రతి విద్యార్థి తల్లుల ఖాతాల్లో తొలి ఏడాది 15వేల రూపాయల చొప్పున జమ చేసింది. కానీ ఆ తరువాత ఏడాది పాఠశాల, మరుగుదొడ్ల నిర్వహణ పేరిట రెండు వేల రూపాయలను కోత విధిస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం తల్లికి వందనం అమలు చేయడానికి సిద్ధపడింది. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15000 రూపాయల చొప్పున అందిస్తామని చెప్పింది. కానీ ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం మాదిరిగా ఆ రెండు వేల రూపాయలకు కోత విధిస్తుండడం విశేషం.
Also Read: Thalliki vandanam Scheme Guidelines : తల్లికి వందనం అర్హతలు, మార్గదర్శకాలపై ఉత్కంఠ!
అవే మార్గదర్శకాలు..
మరోవైపు అప్పట్లో అమ్మ ఒడి మార్గదర్శకాలు తో చాలామంది పథకానికి దూరమయ్యారు. అప్పట్లో వాటిని కూటమి పార్టీలు వ్యతిరేకించాయి. ఇప్పుడు అవే మార్గదర్శకాలను కూటమి ప్రభుత్వం( Alliance government ) కొనసాగిస్తుండడం విశేషం. పట్టణ ప్రాంతాల్లో రూ.12 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.10 వేలు లోపు ఆదాయం ఉన్నవాళ్లే ఈ పథకానికి అర్హులు. కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరి పేరు రేషన్ కార్డులో కచ్చితంగా ఉండాలి. మాగాణి మూడు ఎకరాల్లోపు, మెత్త భూమి 10 ఎకరాల్లోపు.. రెండు కలిపి పది ఎకరాల్లోపు ఉన్నవాళ్లే అర్హులు. నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు. ట్రాక్టర్, ట్యాక్సీ, ఆటోకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. అలాగే నెలకు విద్యుత్ వాడకం 300 యూనిట్లు మించకూడదు. పట్టణాలు, నగరాల్లో 1000 చదరపు అడుగులకు మించి ఆస్తి ఉండకూడదు.
ఉద్యోగుల పిల్లలు అనర్హులు..
మరోవైపు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల( Government employees) పిల్లలు ఈ పథకానికి అనర్హులు. పింఛన్ తీసుకునే రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించిన వారసులు కూడా అనర్హులు. పట్టణ ప్రాంతాల్లో 12000, గ్రామీణ ప్రాంతాల్లో 10,000 లోపు ఆదాయం ఉన్న పారిశుద్ధ్య కార్మికులకు మినహాయింపు ఇచ్చారు. ఇన్కమ్ టాక్స్ ఫైల్ చేసే వారికి ఈ పథకం వర్తించదు. అయితే గతంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈ నిబంధనలే ఉండేవి. కానీ ఇప్పుడు కూడా అదే నిబంధనలు అమలు చేస్తుండడం విశేషం.