AP MLC Elections 2026: ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ఈనెల 28 తో గవర్నర్ కోటా కింద రెండు ఎమ్మెల్సీ పదవులు ఖాళీగా ఉన్నాయి. వాటి భర్తీకి సంబంధించి ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. కచ్చితంగా కూటమి పార్టీలకి ఆ రెండు పదవులు దక్కుతాయి. ఎందుకంటే అధికార పార్టీ సిఫారసుల మేరకు గవర్నర్ నియామకాలు చేస్తారు. అయితే ఇంతవరకు ఈ ఎమ్మెల్సీల ఎంపిక విషయం బయటకు రావడం లేదు. ఎవరికి ఖరారు చేస్తారో తెలియడం లేదు. కనీసం కసరత్తు జరుగుతున్నట్లు కూడా బయటకు వెల్లడించడం లేదు. ఆశావహులు చూస్తే పదిమందికి పైగా ఉన్నారు. అయితే ఈసారి కూటమిలో ఆ రెండు పదవులను తెలుగుదేశం పార్టీ తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఆ పార్టీలో ఆశావహులు ఎక్కువగా ఉండడంతో ఈసారి తమకు విడిచి పెట్టాలని చంద్రబాబు మిగతా రెండు పార్టీలకు సూచించినట్లు తెలుస్తోంది. అదే జరిగితే ఆ రెండు పదవులు టిడిపి ఖాతాలో పడడం ఖాయం.
* వైసిపి హయాంలో ఆ ఇద్దరు..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో గవర్నర్ కోటాలో నియమితులయ్యారు జాకియా ఖానం, పండుల రవీంద్రబాబు. ఇందులో ఖానం శాసనమండలిలో డిప్యూటీ చైర్ పర్సన్ గా ఉన్నారు. కొద్ది రోజుల కిందట వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. కానీ శాసనమండలి చైర్మన్ మోసేన్ రాజు పిలిచి మాట్లాడడంతో.. తన రాజీనామాను వెనక్కి తీసుకున్నారు. ఇప్పుడు ఆమె పదవి విరమణ చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె బిజెపిలో ఉన్నారు. పండుల రవీంద్ర బాబు రాజీనామాతో రెండు పదవులు ఖాళీగా ఉన్నాయి. దీంతో ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది ఎన్నికల సంఘం. వీటి ఎంపికకు సంబంధించి షెడ్యూల్ వెల్లడించే ఛాన్స్ కనిపిస్తోంది. కానీ ఇంతవరకు కూటమి తరుపున ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక జరగలేదు. రేపటితో వారిద్దరి పదవీకాలం ముగిస్తుంది.
* ఆశావహులు అధికం..
ఈ రెండు పదవుల కోసం తెలుగుదేశం పార్టీలో పదిమందికి పైగా నేతలు ఎదురుచూస్తున్నారు. ప్రధానంగా వర్ల రామయ్యకు ఈసారి ఛాన్స్ ఉంటుందని ప్రచారం సాగుతోంది. దానికి కారణం లేకపోలేదు. పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా బలమైన వాయిస్ వినిపించారు రామయ్య. దళిత సామాజిక వర్గానికి చెందిన వర్ల రామయ్యకు రాజ్యసభ పదవి ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. వివిధ సమీకరణలో భాగంగా ఆ అవకాశం దక్కలేదు. అందుకే ఈసారి ఎమ్మెల్సీ పదవి ఇస్తారని తెలుస్తోంది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన రామయ్యకు పదవి ఇవ్వడం ద్వారా ఆ వర్గంలో పట్టు సాధించాలన్నది చంద్రబాబు ఆలోచన.
* తెరపైకి చాలామంది పేర్లు..
మరో పదవి కోసం పార్టీలో చాలామంది పేర్లు వినిపిస్తున్నాయి. ప్రధానంగా రాయలసీమ జిల్లాలకు చెందిన నేతల పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే మరోవైపు పిఠాపురం వర్మ, వంగవీటి రాధాకృష్ణ, మహాసేన రాజేష్, కొమ్మాలపాటి శ్రీధర్, బుద్ధ వెంకన్న వంటి నాయకుల పేర్లు కూడా వినిపిస్తూ వస్తున్నాయి. కానీ ఇంతవరకు కూటమి నుంచి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి సందడి ప్రారంభం కాలేదు. కనీసం పేర్లు లీకులు కావడం లేదు. రేపటితో వారిద్దరూ మాజీలు కానుండడం.. ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన మరుక్షణం అభ్యర్థుల ఎంపిక పూర్తి చేసే పరిస్థితి కనిపిస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..






