AP DSC Notification Ugadi 2026: ఏపీలో( Andhra Pradesh) నిరుద్యోగులకు గుడ్ న్యూస్. మరో డీఎస్సీ నోటిఫికేషన్ కు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. ఈ మేరకు ఉపాధ్యాయ నియామక ప్రక్రియకు సంబంధించి నోటిఫికేషన్ జారీ కానుంది. ఏటా డీఎస్సీ ఉంటుందని మంత్రి నారా లోకేష్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా కూడా ఆయన కీలక ప్రకటన చేశారు. త్వరలోనే డీఎస్సీ ప్రకటన ఉంటుందని చెప్పుకొచ్చారు. దీంతో ఉగాదినాడు నోటిఫికేషన్ ఉంటుందని అందరూ అంచనా వేస్తున్నారు. తెలుగువారి ప్రతీక ఉగాది. అందుకే ఆరోజు డీఎస్సీ ప్రకటనకు ఏపీ ప్రభుత్వం సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే నిరుద్యోగులకు పండగే.
* ఆ హామీ మేరకు..
తాము అధికారంలోకి వస్తే డీఎస్సీ ( DSc) నియామక ప్రక్రియ చేపడతామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. అందుకు తగ్గట్టుగానే 16,000 కు పైగా ఉపాధ్యాయ నియామక పోస్టుల కు నోటిఫికేషన్ ఇచ్చారు. సకాలంలో ఈ ప్రక్రియను పూర్తిచేసి ఉపాధ్యాయులను నియమించారు. అయితే వాటిని నియామకం పూర్తయిన తర్వాత మరో డీఎస్సీ ప్రకటిస్తామని మంత్రి లోకేష్ చెప్పుకొచ్చారు. వెంటనే కార్యాచరణ మొదలుపెట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న ఉపాధ్యాయుల ఖాళీలను గుర్తించారు. ఖాళీలకు సంబంధించి ఆన్లైన్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ వచ్చారు. ఈ లెక్కన 3600 ఉపాధ్యాయ పోస్టులతో డీఎస్సీ ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
* జాబ్ క్యాలెండర్ సైతం..
ఇంకోవైపు ఉగాదినాడు జాబ్ క్యాలెండర్( job calendar) ప్రకటన వస్తుందని కూడా ప్రచారం నడుస్తోంది. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగ నియామకాల కు సంబంధించిన వివరాలను.. వాటి భర్తీకి సంబంధించిన షెడ్యూల్.. జాబ్ క్యాలెండర్లో ప్రకటించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడుతున్నట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో దాదాపు 90000 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. రెవెన్యూ, పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్య శాఖలో భారీగా ఖాళీలు ఉన్నట్లు గుర్తించారని ప్రచారం నడుస్తోంది. అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేసి.. దాని ప్రాప్తికి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తామని చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. అందుకే డీఎస్సీ నోటిఫికేషన్ తో పాటు జాబ్ క్యాలెండర్ విడుదలకు సన్నాహాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. గతంలో జగన్మోహన్ రెడ్డి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామని ప్రకటించి ఇవ్వలేదు. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ప్రకటన ఇచ్చి చిత్తశుద్ధి చాటుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు. ఉగాది రోజున నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెబుతుందన్నమాట కూటమి ప్రభుత్వం.
