ఓటుకు నోటు.. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో రూ.50లక్షలు ఇస్తూ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ ను ప్రలోభ పెడుతూ అప్పటి టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిపోయాడు. టీడీపీ పోటీదారు వేం నరేందర్ రెడ్డి గెలిపించేందుకు చేసిన ఈ ప్రయత్నాలను తెలంగాణ సర్కార్ వీడియోలతో సహా బయటపెట్టడం నాడు సంచలనమైంది. ఈ కేసులో ప్రధాన సూత్రధారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడని ఆరోపణలున్నాయి.
తాజాగా ఓటుకు నోటు కేసులో ఏసీబీ కోర్టు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డికి గట్టి షాక్ ఇచ్చింది. ఈ కేసులో ఏసీబీ పరిధిలోకి రాదంటూ ఆయన దాఖలు చేసిన పిటీషన్ పై విచారించిన కోర్టు దాన్ని కొట్టివేసింది.
ఓటుకు నోటు కేసు ఎన్నికల కమిషన్ పరిధిలోకి వస్తుందని.. ఏసీబీకి సంబంధం లేదని పేర్కొంటూ రేవంత్ రెడ్డి గతంలో ఏసీబీ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై గురువారం ఏసీబీ కోర్టు విచారణ జరిపింది.ఏసీబీ కోర్టు తాజాగా రేవంత్ రెడ్డి పిటీషన్ ను కొట్టివేసింది. ఓటుకు నోటు కేసు అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి వస్తుందని స్పష్టంగా తెలియజేస్తూ రేవంత్ రెడ్డి పిటీషన్ ను కోర్టు తిరస్కరించింది.
ఈ కేసులో అభియోగాల నమోదు కోసం విచారణను ఫిబ్రవరి 8కి కోర్టు వాయిదా వేసింది. నిందితులందరూ ఫిబ్రవరి 8న ఖచ్చితంగా కోర్టుకు హాజరు కావాలని ఏసీబీ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.