US China vs Pakistan: భారత్, పాకిస్తాన్ విషయంలో ప్రపంచంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. భారత్ పరస్పర సహకారంతోపాటు దేశ ప్రయోజనాల కోసం అనేక దేశాలతో సంత్సంబంధాలు కొనసాగిస్తోంది. ఇక పాకిస్తాన్ మాత్రం స్వార్థ ప్రయోజనాల కోసమే అమెరికాను, చైనాను వాడుకుంటోంది. అమెరికా, చైనా మధ్య ఉన్న వైరాన్ని తమ ప్రయోజనాలకు వాడుకుంటోంది. అమెరికాకు చైనాను.. చైనాకు అమెరికాను బూచిగా చూపుతూ ఇరు దేశాల నుంచి లబ్ధి పొందుతోంది. అయితే ఈ విషయాన్ని ఇటీవల రెండే దేశాలూ పాకిస్తాన్ నక్కజిత్తులను గుర్తించాయి. దీంతో రెండు దేశాలు పాకిస్తాన్కు వ్యతిరేకంగా మారాయి.
Also Read: ఒబామాను ట్రంప్ అరెస్ట్ చేయించబోతున్నారా?
అమెరికా–పాకిస్తాన్ సంబంధాల్లో ఒడిదొడుకులు..
అమెరికా–పాకిస్తాన్ సంబంధాలు చరిత్రాత్మకంగా లావాదేవీ స్వభావం కలిగి ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ యుద్ధ సమయంలో (2001–2021), పాకిస్తాన్ అమెరికాకు కీలక భాగస్వామిగా ఉండేది. అమెరికా సైనిక సహాయం, ఆర్థిక సహకారం అందించింది, కానీ ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా ఉపసంహరణ (2021) తర్వాత పాకిస్తాన్ యొక్క వ్యూహాత్మక ప్రాముఖ్యత తగ్గింది. ఈ నేపథ్యంలో, కొన్ని కారణాలు అమెరికా వైఖరిలో మార్పును సూచిస్తున్నాయి. పాకిస్తాన్ చైనాతో బలమైన సైనిక, ఆర్థిక సంబంధాలు అమెరికాకు ఆందోళన కలిగిస్తున్నాయి. అమెరికా–చైనా మధ్య పెరుగుతున్న భౌగోళిక రాజకీయ పోటీలో, పాకిస్తాన్ చైనాకు సన్నిహితంగా ఉండటం అమెరికా ప్రయోజనాలకు విరుద్ధంగా ఉంది. అమెరికా భారత్ను చైనాకు వ్యతిరేకంగా ఒక వ్యూహాత్మక భాగస్వామిగా చూస్తోంది. ఈ క్రమంలో, భారత్–పాకిస్తాన్ శత్రుత్వం కారణంగా అమెరికా పాకిస్తాన్తో దూరం పాటిస్తోంది. ఆపరేషన్ సిందూర్కు మద్దతు ఇవ్వడం, ది రెసిస్టెన్స్ ఫోర్స్ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించడం ఇందుకు ఉదాహరణ. అమెరికా ఎప్పటి నుంచో పాకిస్తాన్ను తాలిబన్, హక్కానీ నెట్వర్క్ వంటి ఉగ్రవాద సంస్థలకు సురక్షిత ఆశ్రయం కల్పిస్తున్నట్లు ఆరోపిస్తోంది. ఈ ఆరోపణలు ద్వైపాక్షిక సంబంధాలను మరింత దెబ్బతీశాయి. పాకిస్తాన్ యొక్క ఆర్థిక సంక్షోభం, రాజకీయ అస్థిరతలు అమెరికాకు పాకిస్తాన్ను ఒక నమ్మదగిన భాగస్వామిగా చూడడంలో అడ్డంకులుగా మారాయి.
చైనా కూడా దూరం పెడుతోంది..
ఇక చైనా కూడా పాకిస్తాన్ను దూరం పెడుతోంది. చైనా, పాకిస్తాన్ల మధ్య దశాబ్దాలుగా ‘ఆల్–వెదర్‘ స్ట్రాటజిక్ భాగస్వామ్యం ఉన్నప్పటికీ, ఇటీవలి కొన్ని సంఘటనలు ఈ సంబంధాల్లో ఒత్తిడిని సూచిస్తున్నాయి. పాకిస్తాన్లో, ముఖ్యంగా బలూచిస్తాన్లో, చైనా ఇంజనీర్లు, కార్మికులపై ఉగ్రవాద దాడులు పెరిగాయి. ఈ దాడులు ప్రాజెక్టులపై ప్రభావం చూపుతున్నాయి. పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం కారణంగా, చైనాకు చెల్లించాల్సిన రుణాలు (ముఖ్యంగా విద్యుత్ రంగంలో 15 బిలియన్ డాలర్లకు పైగా) చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. పాకిస్తాన్ రుణాలను రీప్రొఫైల్ చేయాలని కోరినప్పటికీ, చైనా దీనిపై కఠిన వైఖరి తీసుకుంది. అమెరికా ఒత్తిడి కారణంగా పాకిస్తాన్ గ్వాదర్ పోర్టులో చైనా నావికాదళానికి అనుమతి నిరాకరించిందని తెలుస్తోంది. ఇది చైనా–పాకిస్తాన్ సంబంధాల్లో ఒత్తిడిని పెంచింది. పాకిస్తాన్ అమెరికాతో సంబంధాలను మెరుగుపరచడానికి ప్రయత్నిస్తోందన్న ఊహాగానాలు చైనాకు ఆందోళన కలిగిస్తున్నాయి. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీమ్ మునీర్ అమెరికా సందర్శన, డొనాల్డ్ ట్రంప్తో జరిగిన సమావేశం ఈ దిశగా సూచనలుగా భావించబడుతున్నాయి.
Also Read: పాక్ కు షాక్.. భారత్ కు మద్దతుగా చైనా.. కీలక పరిణామం
భౌగోళిక, రాజకీయ పోటీ..
అమెరికా, చైనా వైఖరిలో మార్పులకు ముఖ్య కారణం భౌగోళిక రాజకీయ పోటీ. అమెరికా–చైనా మధ్య పెరుగుతున్న శత్రుత్వం, భారత్తో అమెరికా సన్నిహిత సంబంధాలు, చైనా–పాకిస్తాన్ భాగస్వామ్యం ఈ సందర్భంలో కీలకంగా మారాయి. అమెరికా చైనాను ‘వ్యూహాత్మక పోటీదారు‘గా గుర్తించింది. ఈ నేపథ్యంలో, చైనాకు సన్నిహితంగా ఉన్న పాకిస్తాన్పై అమెరికా అనుమానంతో ఉంది. ఇదే సమయంలో అమెరికా భారత్ను ఇండో–పసిఫిక్ వ్యూహంలో కీలక భాగస్వామిగా చూస్తోంది. ఈ క్రమంలో, పాకిస్తాన్తో సంబంధాలు దెబ్బతిన్నాయి. పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం, రుణ భారం అమెరికా, చైనా రెండింటికీ ఆందోళన కలిగిస్తోంది.