ECIL : పప్పులో నుంచి పాము.. నలుగురు ఈసీఐఎల్ ఉద్యోగులకు ప్రాణాపాయం

హైదరాబాద్ లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంస్థలో శుక్రవారం మధ్యాహ్నం ఉద్యోగులు క్యాంటీన్ లో భోజనం చేస్తుండగా.. పప్పులో చిన్నపాటి పాము బయటపడింది. ఈసీఐల్ క్యాంటీన్లో ఈ తరహా ఘటనలు పెరిగిపోతున్నాయి ఆహార పదార్థాలలో ఎలుకలు, జిల్ల పురుగులు, సిగరెట్లు, బీడీలు సహజమని అక్కడ పనిచేసే ఉద్యోగులు చెబుతున్నారు.

Written By: Dharma, Updated On : July 22, 2023 4:43 pm
Follow us on

ECIL : సాధారణంగా ఆహార పదార్థాల్లో చిన్నపాటి పురుగులు కనిపించడం సహజం. ఏకంగా పాము కనిపిస్తే తప్పకుండా అందులో కుట్ర కోణం దాగి ఉండాలి. హైదరాబాద్ లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంస్థలో ఇటువంటి ఘటనే ఒకటి వెలుగుచూసింది. శుక్రవారం మధ్యాహ్నం ఉద్యోగులు క్యాంటీన్ లో భోజనం చేస్తుండగా.. పప్పులో చిన్నపాటి పాము బయటపడింది. అప్పటికే కొంతమంది ఉద్యోగులు ఆ ఆహారాన్ని తిన్నారు. నలుగురు వాంతులు, విరోచనాలతో అస్వస్థతకు గురయ్యారు. వెనువెంటనే వారిని తోటి ఉద్యోగులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

అయితే ఇలా ఆహారంలో పురుగులు, ఇతర వస్తువులు వెలుగుచూడడం కొత్త కాదు. గతంలో కూడా ఇటువంటి ఘటనలు చాలా జరిగాయి. కానీ ఇటీవల  ఈసీఐల్ క్యాంటీన్లో ఈ తరహా ఘటనలు పెరిగిపోతున్నాయి ఆహార పదార్థాలలో ఎలుకలు, జిల్ల పురుగులు, సిగరెట్లు, బీడీలు సహజమని అక్కడ పనిచేసే ఉద్యోగులు చెబుతున్నారు. అయితే పప్పులో పామును గుర్తించిన మిగతా సిబ్బంది కూడా షాక్ లో ఉండిపోయారు. ఈసీఐఎల్ లాంటి పెద్ద సంస్థ క్యాంటీన్ లో పాము ఎక్కడి నుండి వచ్చిందనే ఆందోళనలో ఉన్నారు అందరూ. పప్పులో పాము ప్రత్యక్షం కావడంపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి.

అస్వస్థతకు గురైన నలుగురు ఉద్యోగులు తేరుకున్నట్టు తెలుస్తోంది. వేలాది మంది పనిచేసే సంస్థలో ఆరోగ్యభద్రతకు పెద్దపీట వేయకపోవడం విమర్శలకు తావిస్తోంది.  ఆహార పదార్థాల పట్ల నిర్లక్ష్యం వహించిన వారిని వెంటనే సస్పెండ్ చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. కంపెనీ యాజమాన్యంపై కూడా ఫుడ్ ఇన్స్పెక్టర్లు కేసు నమోదు చేయాలని కోరుతున్నారు. అంత పెద్ద క్యాంటీన్ లోకి పాములు ఎలా వస్తాయని.. ఇందులో కుట్ర కోణం దాగి ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనేక సందేహాలు నెలకొని ఉన్నాయని..వాటిని నివృత్తి చేయాల్సిన అవసరం యాజమాన్యంపై ఉందని ఉద్యోగులు చెబుతున్నారు.