Dubai black money investments : ఖద్దర్ చొక్కా వేసినట్టు మాత్రాన రాజకీయ నాయకులు పులు కడిగిన ముత్యాల కారు. ముత్యాల మాదిరిగా కనిపించే గురువింద గింజలు మన రాజకీయ నాయకులు. ప్రతి దాంట్లో అవినీతి.. అక్రమాలు.. దౌర్జన్యాలు చేస్తూ భారీగా సంపాదిస్తుంటారు మన నాయకులు. సంపాదించిన అక్రమ సంపాదన మొత్తం ఇతర మార్గాల ద్వారా విదేశాలకు తరలిస్తుంటారు.
సినిమాలో చూపించిన మాదిరిగా గతంలో మన దేశం నుండి రాజకీయ నాయకులు నల్ల డబ్బులు మొత్తం స్విజర్లాండ్, ఇతర పన్ను రహిత దేశాలకు తరలించేవారు. అక్కడ భారీగా లాకర్లలో సొమ్మును నిలువ చేసేవారు. ఆ తర్వాత స్విజర్లాండ్.. పన్ను రహిత దేశాలు అంత సేఫ్ కాదని భావించి.. మరో మార్గాన్ని ఎంచుకున్నారు. అలా మన రాజకీయ నాయకులు ఎంచుకున్న మరో మార్గమే దుబాయ్.
దుబాయ్ అనేది ఎడారి ప్రాంతం కావచ్చు. కానీ అక్కడ లేనిదంటూ ఉండదు. ప్రపంచంలోనే అతిపెద్ద రియల్ ఎస్టేట్ మార్కెట్ దుబాయ్ లో ఉంటుంది. ఇక్కడ ఇసుక కూడా బంగారానికి మించి రేటు పలుకుతుందంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. బూర్జ్ ఖలీఫా.. ఆకాశాన్ని తాకే భవంతులు అక్కడ చాలానే ఉన్నాయి. ఓ నివేదిక ప్రకారం బూర్జ్ ఖలీఫా లో మన తెలుగు రాష్ట్రాల చెందిన అనేకమంది నాయకులకు ప్లాట్లు ఉన్నాయి. అక్కడ ఒక ప్లాట్ ధర కోట్లలో ఉంటుంది. దీని ప్రకారం మన నాయకులు ఏ స్థాయిలో నల్ల డబ్బును దుబాయ్ లో పెట్టుబడిగా పెట్టారో అర్థం చేసుకోవచ్చు.
ఇక తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో జరిగిన మాదకద్రవ్యాల పార్టీ.. దుబాయ్ లో ఉన్న అక్రమ ఆస్తుల గురించే ఏర్పాటు చేశారని తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కొంతమంది నాయకులు తమ అక్రమ సంపాదనను దుబాయ్ తరలించారని.. అక్కడ ఒక వ్యక్తి ఆస్తులను పర్యవేక్షిస్తున్నారని.. అయితే అతడు అనుమానాస్పద స్థితిలో చనిపోవడంతో.. ఆ ఆస్తుల గురించి పంచాయతీ సాగిందని తెలుస్తోంది. ఆ పంచాయతీలో ఆస్తుల వివరాలను సెటిల్ చేసుకోవడం కోసం మాదక ద్రవ్యాల పార్టీ ఏర్పాటు చేశారని సమాచారం.
ఈ పార్టీ గురించి పోలీసులకు సమాచారం తెలియడంతో వారు దాడులు నిర్వహించారని.. ఇందులో కొంతమంది వ్యక్తులను అరెస్ట్ చేశారని.. ఇంకా కొంతమంది వ్యక్తులు పరారీలో ఉన్నారని తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ ఒకప్పుడు ఉత్తర భారత దేశానికి చెందిన రాజకీయ నాయకులు అక్రమ సంపాదనను విదేశాలకు తరలించేవారు. కానీ ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన నాయకులు నల్ల డబ్బులు భారీగా పోగు చేసుకుంటున్నారు. అంతేకాదు దుబాయ్ లాంటి ప్రాంతానికి తరలించి రెట్టింపు సంపాదన సంపాదిస్తున్నారు. అరుదైన సందర్భాలలో నాయకుల బినామీలు ఇదిగో ఇలా బయటపడుతున్నారు. అయితే తాండూరు మాజీ ఎమ్మెల్యే ఫామ్ హౌస్ లో జరిగిన మాదక ద్రవ్యాల పార్టీ వ్యవహారంలో ప్రభుత్వం లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో ఉన్న పెద్ద వ్యక్తులను అదుపులోకి తీసుకుంటారని సమాచారం.