Chhattisgarh: ఎటుపోతోందీ యువతరం.. పుట్టిన రోజు పేరిట పాఠశాలలోనే మందు కొట్టిన విద్యార్థినులు!

భావి భారతాన్ని తలుచుకుంటే మనకు గర్వంగా అనిపిస్తుంది. యువశక్తి గల భారత దేశం వేగంగా అభివృద్ధి చెందుతుందని, ప్రపంచ దేశాలకు మన యువ శక్తే ఆధారం అవుతుందని ప్రపంచ దేశాలు కూడా చెబుతున్నాయి. అయితే కొన్ని సంఘటనలు జరిగినప్పుడు యువతరం భవితవ్యంపై భయమేస్తుంది.

Written By: Raj Shekar, Updated On : September 11, 2024 2:54 pm

Chhattisgarh

Follow us on

Chhattisgarh: భారత దేశం యువ శక్తి గల దేశం. మన యువతే మన దేశానికి శక్తి. మన యువతపై ఆధారపడే ప్రపంచంలో అనేక దేశాలు అభివృద్ధి చెందుతున్నాయి. అమెరికా అభివృద్ధిలో భారతీయులే కీలక పాత్ర పోషిస్తున్నారు. లండన్, ఆస్ట్రేలియా, రష్యా, కెనడా, ఇలా ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు కీలక పదవుల్లో ఉన్నారు. అన్నిరంగాల్లో రాణిస్తున్నారు. ఇందుకు నాణ్యమైన చదువులు, క్రమశిక్షణ గల జీవితమే కారణం. కానీ రాబోయే యువతరం పరిస్థితి చూస్తుంటే కొన్నిసార్లు భయమేస్తుంది. ఇప్పుడు మద్యం, గంజాయి, డ్రగ్స్‌ మత్తు యువతను నిర్వీర్యం చేస్తోంది. మత్తుకు బానిసవుతున్న యువత.. తమ టాలెంట్‌ను నిరూపించుకోలేకపోతున్నారు. నాసిరకం చదువులతో ఎటూ కాకుండా పోతున్నారు. ఇప్పటికే లక్షల మంది నైపుణ్యం లేని చదువులతో ఉద్యోగాలు రాక రోడ్లపై తిరుగుతున్నారు. ఇక ఇప్పుడు పాఠశాల స్థాయి నుంచే యువత మత్తుకు అలవాటు పడుతోంది. ఇప్పటికే అనేక మంది విద్యార్థులు పట్టుపడ్డారు. తాజాగా ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో జరిగిన ఘటనే ఇందుకు ఉదాహరణ. ఇందులో విద్యార్థినులు ఉండడం ఆందోళనకు గురిచేస్తోంది.

ఏం జరిగిందంటే..
ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బిలాస్‌పూర్‌ జిల్లా భట్‌ చౌరా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో అమ్మాయిలు తరగతి గదిలో బీరు తాగారు. ఈ సమయంలో సెల్ఫీ కూడా తీసుకున్నారు. వీడియో తీసుకున్నారు. ఇప్పుడు ఈ వీడియో, ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. క్రమంగా విషయం విద్యాశాఖ ఉన్నతాధికారులకు తెలిసింది. దీనిపై విచారణ చేయాలని త్రిసభ్య కమిటీని డీఈవో టీఆర్‌ సాహు ఏర్పాటు చేశారు.

కఠిన చర్యలు..
పాఠశాలలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. విచారణ కమిటీ సంబంధిత విద్యార్థులు, ఉపాధ్యాయులు నుంచి సమాచారం తీసుకొని దర్యాప్తు చేస్తుంది. ఖాళీ బీరు బాటిళ్లతో సరదాగా ఆడుకున్నామని, కానీ తాగలేదని విద్యార్థినులు కమిటీకి తెలియజేశారు. విద్యార్థుల తల్లిదండ్రులకు నోటీసులు పంపించామని, వివరణ కూడా కోరుతామని డీఈవో తెలిపారు.