Homeట్రెండింగ్ న్యూస్DigiYatra: విమానాల్లో ప్రయాణిస్తున్నారా? ఐతే డిజి యాత్ర గురించి తెలుసుకోవాల్సిందే?

DigiYatra: విమానాల్లో ప్రయాణిస్తున్నారా? ఐతే డిజి యాత్ర గురించి తెలుసుకోవాల్సిందే?

DigiYatra: ఒకప్పుడు ఆర్థిక స్తోమత బాగా ఉన్నవాళ్ళే విదేశాలకు వెళ్లేవారు. అక్కడ చదువుకునేవాళ్ళు. ఆ తర్వాత అక్కడే స్థిరపడేవారు. ఆర్థిక స్థిరత్వం చాలా మందిలో పెరగడం.. బ్యాంకులు రుణాలు ఇవ్వడం.. అనేక సౌలభ్యాలు చెంతకే రావడంతో ఇప్పుడు విదేశాలకు వెళ్లే వారి సంఖ్య పెరిగిపోతుంది. చదువు నిమిత్తం, ఉద్యోగాల నిమిత్తం, విహారయాత్రల నిమిత్తం విదేశాలకు చాలామంది వెళ్తున్నారు. విదేశాలకు వెళ్లాలంటే విమాన ప్రయాణం తప్పనిసరి. విమాన ప్రయాణం అనేది బస్సు ప్రయాణం లాంటిది కాదు. విమానాశ్రయ ప్రవేశ ద్వారం మంచి మొదలు పెడితే భద్రత సిబ్బంది పరిశీలన వరకు ప్రతిదీ ఓ పెద్ద తతంగం.. ఇలాంటి క్రమంలో భారత ప్రభుత్వం కేంద్ర పౌర విమాన శాఖ ఆధ్వర్యంలో “డిజి యాత్ర”ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనివల్ల విమానాశ్రయంలో సమయం వృధా చేసుకోకుండా.. గంటల తరబడి ఎదురుచూపుకు చెక్ పెడుతూ డిజి యాత్రను ప్రవేశపెట్టింది.

ఈ డిజి యాత్ర వల్ల టెర్మినల్ లోని సెక్యూరిటీ చెక్, బోర్డింగ్ పాయింట్ల వద్ద ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ప్రయాణికులు వారి ఫోన్ నుంచి బోర్డింగ్ పాస్ స్కాన్ చేసి నేరుగా విమానాశ్రయంలోకి ప్రవేశించవచ్చు. ఈ తరహా సేవలు న్యూఢిల్లీ, బెంగళూరు, వారణాసి విమానాశ్రయాల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది మార్చి నుంచి విజయవాడ, హైదరాబాద్, కోల్ కతా, పూణె విమానాశ్రయాలు అందుబాటులోకి వస్తాయి. ఇప్పటికే విజయవాడ విమానాశ్రయంలో డిజి యాత్ర కోసం నాలుగు కియోస్క్ లు ఏర్పాటు చేశారు. వాటి ట్రయల్ రన్ కూడా పూర్తయింది.

డిజి యాత్ర యాప్ ను స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ప్లే స్టోర్ లేదా ఐ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్ లో పేరు, ఫోన్ నెంబర్, ఈ మెయిల్, చిరునామా, ఫోటో, ఆధార్ ఆధారిత ధ్రువీకరణ పత్రం అప్లోడ్ చేసి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలి. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రయాణికుడి పేరుతో డిజి యాత్ర ఐడి నమోదవుతుంది. విమాన టికెట్ బుకింగ్ సమయంలో డిజి యాత్ర ఐడి తప్పనిసరిగా నమోదు చేయాలి. ప్రయాణానికి సంబంధించి బోర్డింగ్ పాస్ కూడా యాప్ లో స్కాన్ చేయాలి. దీంతో ప్రయాణికుడి వివరాలు విమానాశ్రయానికి చేరుతాయి.

ప్రయాణికులు విమానాశ్రయానికి వెళ్ళిన తర్వాత టెర్మినల్ బయట ఈ_ గేటు వద్ద డీజీ యాత్ర యాప్ ఉపయోగించాలి. బోర్డింగ్ పాస్ బార్ కోడ్ స్కాన్ చేయాలి. ఫేషియల్ రికగ్నైజేషన్ చేయించుకోవాలి. దీంతో విమానాశ్రయం నుంచి ప్రయాణికుల వ్యక్తిగత వివరాలు సంబంధిత ఎయిర్ లైన్స్ అన్ లైన్ లో సరి చూసుకుంటుంది. దీనివల్ల ప్రయాణికులు ఎక్కడా ఎదురుచూడాల్సిన అవసరం ఉండదు. పడిగాపులు కాయాల్సిన అవసరం అంతకన్నా ఉండదు. సెక్యూరిటీ చెకింగ్ వద్ద గుర్తింపు కార్డు చూపించకుండానే వెళ్ళిపోవచ్చు. బోర్డింగ్ పాయింట్ వద్ద ఎదురు చూడకుండానే నేరుగా విమానాశ్రయం టెర్మినల్ లోకి ప్రవేశించవచ్చు.

కొన్ని విమానాశ్రయాల్లో డిజి యాత్ర బయోమెట్రిక్ బోర్డింగ్ సిస్టం ట్రయల్ రన్ దశలో ఉంది. విమానాశ్రయాల అధికారులు ప్రయాణికులకు అవగాహన కల్పించేందుకు ప్రచారాలు చేస్తున్నారు. డిజి యాత్రను ఉపయోగించుకునేలా విమానాశ్రయాల పరిధిలో స్కానర్లు కూడా ఏర్పాటు చేశారు. మార్చి నుంచి పూర్తిస్థాయిలో డిజి యాత్రను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు పౌర విమానయాన శాఖ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular