TDP won in Madhira: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం( Telugu Desam) పార్టీ పోటీ చేయలేదు. స్థానికంగా బలం ఉన్నచోట సొంతంగానే ఆ పార్టీ నేతలు బరిలో దిగారు. అనూహ్యంగా ఖమ్మం జిల్లా మధిరలో టిడిపి అభ్యర్థి విజయం సాధించడం విశేషం. అయితే స్థానికంగా నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో అక్కడ టిడిపి అభ్యర్థికి ప్రజలు పట్టం కట్టారు. అది డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సొంత నియోజకవర్గం. అటువంటి చోట టిడిపి అభ్యర్థి గెలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. కానీ అక్కడ కాంగ్రెస్ మద్దతుతో టిడిపి గెలుపొందిందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. వాస్తవానికి తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో టిడిపి అధికారికంగా పోటీ చేయలేదు. ఫలితాల ప్రకటనలో మాత్రం టిడిపి అభ్యర్థి విజయం సాధించారని తెలియడం తో ఉత్కంఠ నెలకొంది. ఖమ్మం జిల్లాలో టిడిపి హవా ఇంకా కొనసాగుతోందని స్పష్టమైంది. వాస్తవానికి తెలంగాణలో గ్రేటర్ హైదరాబాద్ తో పాటు ఖమ్మం జిల్లాలోనే టిడిపికి బలం ఉండేది. 2014లో జరిగిన ఎన్నికల్లో ఈ రెండు చోట్ల టిడిపి విజయం సాధించింది. అప్పట్లో మెజారిటీ స్థానాలు గ్రేటర్ హైదరాబాద్ తో పాటు ఖమ్మం జిల్లాలోనే వచ్చాయి..
ఆది నుంచి పట్టు..
ఖమ్మం జిల్లాలో( Khammam District) 2014 ఎన్నికల్లో సైతం మెజారిటీ సీట్లను కైవసం చేసుకుంది తెలుగుదేశం పార్టీ. కానీ 2018 ఎన్నికలకు వచ్చేసరికి మాత్రం సీన్ మారింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అసలు పోటీ చేయలేదు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు చంద్రబాబు ఎన్నో రకాల ప్రయత్నాలు చేశారు. కాసాని జ్ఞానేశ్వర్ కు నాయకత్వ బాధ్యతలు కట్టబెట్టారు. ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికల సమరానికి శంఖం పూరించేందుకు ఖమ్మం జిల్లాను ఎంచుకున్నారు. ఆ జిల్లాలో తెలుగుదేశం పార్టీ భారీ సమావేశం కూడా నిర్వహించింది. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏపీలో చంద్రబాబు అరెస్టయ్యారు. ఆ సమయంలో ఎన్నికలకు వెళ్లడం అంటే సాహసంతో కూడిన పని. అందుకే చంద్రబాబు ఆ ఎన్నికలను బహిష్కరించారు.
సంస్థాగతంగా బలం..
2024 లో ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చింది. దీంతో తెలంగాణలో సైతం తెలుగుదేశం పార్టీ యాక్టివ్ అవుతుందని అంతా భావించారు. కానీ ఎందుకో చంద్రబాబు పెద్దగా ఆసక్తి చూపలేదు. టిడిపి తెలంగాణ అధ్యక్ష పదవి కూడా భర్తీ చేయలేదు. అయితే దీని వెనుక వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడ తెలంగాణ సెంటిమెంట్ పోయి.. కాంగ్రెస్ పార్టీతో పాటు బిజెపి పుంజుకోవాలని.. గులాబీ పార్టీ బలహీన పడిన తర్వాతే టిడిపిని యాక్టివ్ చేస్తారని ఒక విశ్లేషణ ఉంది. అయితే మున్సిపల్ ఎన్నికల్లో కనీసం అధికారికంగా పోటీ చేయలేదు టిడిపి. కానీ ఖమ్మం జిల్లా మధిరలో మాత్రం ఒక వార్డు స్థానాన్ని కైవసం చేసుకుంది. ఖమ్మం జిల్లాలో టిడిపి సంస్థగతంగా బలంగా ఉండడానికి కారణం అక్కడ కమ్మ సామాజిక వర్గ ప్రాబల్యం అధికం. మొన్నటి ఎన్నికల్లో కమ్మ సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీకి మద్దతు దారుగా నిలిచింది. మొన్నటి పంచాయతీ ఎన్నికల్లో సైతం ఓ 15 సీట్లలో టిడిపి విజయం సాధించింది. ఇప్పుడు అధికారికంగా పోటీలో లేకుండానే మధిరలో టిడిపి అభ్యర్థి గెలవడం విశేషం.