Telangana municipal election results: తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. అధికార పార్టీ దూకుడు కొనసాగిస్తోంది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం కాంగ్రెస్ పార్టీ మెజారిటీకి మించిన స్థానాలను సొంతం చేసుకుంది. తద్వారా ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీదనే నమ్మకం ఉంచారని నిరూపించుకుంది.
తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగితే.. అందులో చాలావరకు స్థానాలను కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ ప్రారంభం నుంచి దూకుడు కొనసాగించింది. ప్రత్యర్థి పార్టీలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా సత్తా చూపించింది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. అధికారంలో ఉన్నప్పటికీ చాలా వరకు స్థానాలలో కాంగ్రెస్ పార్టీ పీఠాన్ని అందుకోలేకపోయింది. అటు గులాబీ పార్టీకి కూడా అవకాశం లేకుండా పోయింది. మధ్యలో కమలం పార్టీ కూడా అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోయింది.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో పలుచోట్ల హంగ్ పరిస్థితి ఏర్పడింది. కేసముద్రం, దేవరకొండ, దేవరకద్ర, అలంపూర్, కోహిర్, అమరచింత, ఆసిఫాబాద్, ఖ్యాతనపల్లి, జనగామ మున్సిపాలిటీలలో హంగ్ ఏర్పడింది.
హంగ్ ఏర్పడిన నేపథ్యంలో క్యాంపు రాజకీయాలకు పార్టీలు శ్రీకారం చుట్టాయి. గులాబీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ పోటాపోటీగా శిబిర రాజకీయాలు మొదలుపెట్టాయి. దీంతో మున్సిపల్ పీఠం దక్కేది ఎవరికనే ఆసక్తి మొదలైంది. పీఠాన్ని దక్కించుకోవడానికి రెండు పార్టీలు పోటాపోటీగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో గెలిచిన వారి పంట పండే అవకాశం ఉంది. ఎందుకంటే శిబిర రాజకీయాలు మొదలైన తర్వాత గెలిచిన అభ్యర్థులు గొంతెమ్మ కోరికలు కోరుతారు. వాటిని నెరవేర్చడానికి పార్టీలు ఏమాత్రం వెనుకాడవు. అయితే ఆ మున్సిపాలిటీలను తన ఖాతాలో వేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. అధికారంలో ఉండడంతో చాలామంది అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీకి జై కొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. అయితే గులాబీ పార్టీ తమ అభ్యర్థులు దారితప్పకుండా జాగ్రత్త పడుతోంది. అన్నిటికంటే ముఖ్యంగా అభ్యర్థులను ఇప్పటికే తమ ఆధీనంలోకి తీసుకుంది.
ఈ స్థానాలను గులాబీ పార్టీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో.. పరిస్థితి ఉత్కంఠ గా మారింది. స్వయంగా ఈ మున్సిపాలిటీలలో పరిస్థితిని మాజీ మంత్రి కేటీఆర్ పర్యవేక్షిస్తున్న నేపథ్యంలో.. ఏదైనా జరగవచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఒకవేళ పై స్థానాలలో గులాబీ పార్టీ గనుక సత్తా చూపిస్తే అప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరమైన వాతావరణ తప్పదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.