Telangana municipal election results: తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాలలో కాంగ్రెస్ పార్టీ దూకుడు కొనసాగిస్తోంది. భారీగా స్థానాలను తన ఖాతాలో వేసుకుంటున్నది. దీంతో ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సంబరాలు జరుపుకుంటున్నారు. అనేక స్థానాల్లో విజయం సాధించడంతో గాంధీభవన్ వద్ద సందడి వాతావరణం నెలకొంది.
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చూపించడానికి ప్రధాన కారణం రేవంత్ రెడ్డి దూకుడు. రేవంత్ రెడ్డి దాదాపుగా అన్ని జిల్లాలోని ప్రధాన కేంద్రాలలో బహిరంగ సభలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో గెలవాల్సిన అనివార్యతను వెల్లడించారు. తద్వారా తెలంగాణ ప్రజలు మరోసారి కాంగ్రెస్ పార్టీ వైపు దృష్టి సారించే విధంగా చేశారు.
రేవంత్ రెడ్డి పాచిక వల్ల కాంగ్రెస్ పార్టీ భారీగా స్థానాలను సాధించినప్పటికీ.. ఒక మున్సిపాలిటీ విషయంలో మాత్రం రేవంత్ రెడ్డి స్థాయి సరిపోలేదు. ఆ మున్సిపాలిటీ పేరు సిరిసిల్ల. భారత రాష్ట్ర సమితి కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ క్రమంలో ఇక్కడ ఎలాగైనా కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని రేవంత్ రెడ్డి ప్రయత్నించారు. చివరి వరకు అన్ని రకాలుగా వ్యూహాలు అమలు చేశారు. ప్రణాళికలను పకడ్బందీగా రూపొందించారు.
సిరిసిల్ల ఓటర్లు మాత్రం కాంగ్రెస్ పార్టీకి కాకుండా.. గులాబీ పార్టీకి జై కొట్టారు. ఇక్కడ 39 వార్డులకు 27 వార్డులను బిఆర్ఎస్ పార్టీ సొంతం చేసుకుంది. ఆరువార్డులలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఐదు వార్డులలో బిజెపి గెలుపును సాధించింది. ఒక వార్డులో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. తద్వారా రేవంత్ రెడ్డి పాచికలు కేటీఆర్ ముందు పారలేదు. వాస్తవానికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి అనేక రకాలుగా ప్రయత్నం చేసింది. ఎన్నికలకు ముందే ఇక్కడ భారీగా అభివృద్ధి పనులు చేసింది. కాంగ్రెస్ పార్టీలోకి వలసలను కూడా ఆహ్వానించింది. అయినప్పటికీ ఎన్నికల ఫలితాలలో మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది.