ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు చేసిన పనుల గురించి మాట్లాడారు. కెసిఆర్ తీరును తీవ్రస్థాయిలో విమర్శించారు. ఆ సమయంలో రేవంత్ రెడ్డి పక్కన గులాబీ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి ఉన్నారు. సీఎం ఆ స్థాయిలో విమర్శలు చేస్తున్నప్పటికీ ఆయన కనీసం నిరసన వ్యక్తం చేయలేదు. కనీసం కౌంటర్ కూడా ఇవ్వలేదు. ఇది భారత రాష్ట్ర సమితి నాయకులకు ఇబ్బందికరంగా మారింది.
ఈ నేపథ్యంలో మల్లారెడ్డి తీరును నిరసిస్తూ గులాబీ పార్టీ నాయకులు సోషల్ మీడియాలో విమర్శలు చేయడం మొదలుపెట్టారు. భారత రాష్ట్ర సమితి సోషల్ మీడియా విభాగం ఇన్చార్జి మన్నె క్రిశాంక్ ఏకంగా ట్విట్టర్లో మల్లారెడ్డిని ప్రశ్నిస్తే ట్వీట్ చేశారు. అయినప్పటికీ ఆయన నుంచి కనీసం ఎటువంటి స్పందన లేదు. పార్టీ అధిష్టానం కూడా మల్లారెడ్డిని పక్కనపెట్టినట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై ఇంతవరకు అధికారికంగా క్లారిటీ రాలేదు. మరోవైపు మల్లారెడ్డి పార్టీ మారుతున్నట్టు కూడా ప్రచారం మొదలైంది. దీనిని మల్లారెడ్డి ఖండించడం లేదు. మొత్తంగా సొంత పార్టీలోనే ఆయన మీద వ్యతిరేకత వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.
ఇది ఇలా ఉండగానే మల్లారెడ్డి కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షాక్ ఇచ్చారు.. మల్లారెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్న ఇంజనీరింగ్.. మెడికల్ కాలేజీలపై తెలంగాణ ప్రభుత్వ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేశారు. సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ ఆదేశాలు ఇవ్వడంతో లీగల్.. ఆడిట్.. ఫైనాన్స్.. రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. మొత్తంగా మల్లారెడ్డి కాలేజీలు.. వాటి అనుబంధ సంస్థలలో తనిఖీలు చేపట్టారు. మల్లారెడ్డి సంస్థల్లో భాగంగా ఉన్నాయని అధికారులు భావిస్తున్న సీఎంఆర్.. ఎంఎల్ఆర్ఐటి.. వంటివి విద్యాసంస్థల్లో తనిఖీలు ముంబారంగా చేశారు. గతంలో జేఎన్టీయూ సాధారణ ఎఫ్ ఎఫ్ సి తనిఖీలు నిర్వహించింది. అయితే ఈసారి వాటికి భిన్నంగా సుమారు 70 అంశాలతో కూడిన ఫార్మాట్లో అధికారులు కాలేజీ వివరాలు సేకరించారు. ప్రతిరోజు ఉదయం 10 నుంచి రాత్రి పది గంటల వరకు.. కొన్ని ప్రాంతాలలో అర్ధరాత్రి వరకు తనిఖీలు జరుపుతూనే ఉన్నారు. ప్రశ్న విద్యా సంవత్సరంలో బీటెక్ రెండు, మూడు, నాలుగు సంవత్సరాల విద్యార్థులకు తరగతుల చెప్పాల్సి ఉంది. అయితే ఆ విషయాన్ని పక్కన పెట్టి ప్రభుత్వం కేవలం తనిఖీలకే జేఎన్టీయూలో ఉన్న 30 మంది అధ్యాపకులను ఉపయోగించుకోవడం విశేషం.
గత ఏడాది మల్లారెడ్డి విద్యా సంస్థల ఆక్రమణలపై రేవంత్ ప్రభుత్వం ఉక్కు పాదం మోపింది. అనేక అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసింది. అక్కడితోనే ఆగిపోలేదు రకరకాల తనిఖీలు చేపట్టింది. ఇప్పుడు ఏకంగా మల్లారెడ్డి కాలేజీలలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలు చేపడుతోంది. అయితే ఇందులో ఎటువంటి వివరాలు బయటకు వచ్చాయనేది అధికారులు వెల్లడించడం లేదు. అయితే ఈ వ్యవహారంపై మల్లారెడ్డి విద్యాసంస్థల నిర్వాహకులు నిశ్శబ్దంగా ఉన్నారు. ఈ పరిణామాన్ని రాజకీయ విశ్లేషకులు జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. మల్లారెడ్డిని మళ్లీ రేవంత్ రెడ్డి టార్గెట్ చేశారని.. ఈసారి ఏం చేస్తారో చూడాల్సి ఉందని వారు చెబుతున్నారు.







