Kavitha Telangana Politics: తెలంగాణ రాష్ట్రంలో అనేక పార్టీలు గతంలో ఏర్పడ్డాయి. అందులో తెలంగాణ రాష్ట్ర సమితి అలియాస్ భారత రాష్ట్ర సమితి మాత్రమే నిలబడింది. ఒక రకంగా తెలుగుదేశం పార్టీ తర్వాత గట్టిగా నిలబడిన ప్రాంతీయ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో భారత రాష్ట్ర సమితి మాత్రమే ఉంది. భారత రాష్ట్ర సమితి అధినేత కెసిఆర్ కుమార్తెగా కవిత తెలంగాణ ప్రజలందరికీ పరిచయం. తెలంగాణ ఉద్యమంలో ఆమె జాగృతి ఆధ్వర్యంలో పాల్గొన్నారు. జాగృతి తరఫున అనేక కార్యక్రమాలు చేపట్టారు. నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలుగా గులాబీ పార్టీ తరఫున ఆమె ఎన్నికయ్యారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కవిత రాజకీయంగా ఇబ్బంది ఎదుర్కొన్నారు. ఆ తర్వాత ఆమె ఎమ్మెల్సీ అయ్యారు..
ఎమ్మెల్సీ అయినప్పటికీ కూడా కవితకు భారత రాష్ట్ర సమితిలో ఆశించిన స్థాయిలో గౌరవం లభించలేదు. పైగా పార్టీ కార్యకలాపాలకు ఆమెను దూరంగా పెట్టడంతో ఒక రకంగా ఒత్తిడి ఎదుర్కొన్నారు. ఆ తర్వాత ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆమె పేరు వినిపించింది. కొద్దిరోజుల పాటు జైలు శిక్ష కూడా అనుభవించాల్సి వచ్చింది. చివరికి ఆమెకు బెయిల్ లభించింది. ప్రస్తుతం కవిత బెయిల్ మీద బయట ఉన్నారు. ఇటీవల ఆమె కేసును విచారించిన ఢిల్లీ కోర్టు కేంద్ర దర్యాప్తు సంస్థకు చివాట్లు పెట్టింది. ఇది ఒక రకంగా కవితకు ఊరట కలిగించే అంశం.
ఢిల్లీ మద్యం కుంభకోణం నుంచి ఊరట లభించినప్పటికీ కవితకు రాజకీయంగా మాత్రం ఒత్తిడి ఎదురవుతూనే ఉంది. సొంత పార్టీ నుంచి ఆమెకు ఆశించిన స్థాయిలో గౌరవం లభించకపోవడంతో కొంతకాలంగా తన స్వరాన్ని వినిపించడం మొదలుపెట్టారు. అది కూడా సొంత పార్టీకి వ్యతిరేకంగా ఉండడంతో గులాబీ బాస్ ఆమెను సస్పెండ్ చేశారు. దీంతో ఆమె తన సొంత రాజకీయ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఇటీవల టిఆర్ఎస్ పేరుతో పార్టీని ప్రకటించారు. మహిళలు రాజకీయాలకు రావాలని.. అన్ని కలిసి వస్తే తాను తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతారని ప్రకటించారు.. కవిత ముఖ్యమంత్రి కావాలి అనుకోవడంలో తప్పులేదు. కానీ కవిత కోరుకున్నట్టుగా తెలంగాణ రాజకీయాల్లో స్పేస్ ఉందా.. త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ లో సెంటిమెంట్ ఎప్పటికీ బలంగానే ఉంటుంది. ప్రాంతీయ ఆకాంక్ష స్థిరంగా ఉంటుంది. అయితే గొంతులేని సమూహాలకు.. అసంతృప్తితో ఉన్నవారికి కవిత పార్టీ ఒక వేదికగా ఉంటుంది. పదేపదే కవిత మహిళా సాధికారతను.. తెలంగాణ సంస్కృతిని ప్రధానంగా ప్రస్తావిస్తున్న నేపథ్యంలో.. ఆమె కొద్ది పరిధిలో ఓటు బ్యాంకును ఆకర్షించే అవకాశం ఉంది.
ముఖ్యంగా కవిత తీసుకుంటున్న నిర్ణయాలు భారత రాష్ట్ర సమితిని తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది. కెసిఆర్ తీరును నచ్చని వారంతా కవిత పార్టీ వైపు చూస్తారని తెలుస్తోంది. కవిత పార్టీ పేరులో తెలంగాణ ఉంది కాబట్టి.. చాలామంది నేతలు తనకు అడ్వాంటేజ్ గా ఉంటుందని అందులో చేరవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో జనాభా పరంగా భారీ ఎత్తున ఉన్న బీసీ నేతలను కవిత ఆకర్షించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇటీవల కాలంలో కాంగ్రెస్, బిజెపి నేతలు బీసీమంత్రాన్ని చదువుతున్నారు. అలాంటప్పుడు ఆ పార్టీలో సరైన స్థానాలు లభించని వారంతా కవిత గూటికి చేరే అవకాశం ఉంది.
కవిత తెలంగాణ సెంటిమెంట్ ను బలంగా వినిపించి.. 20 మంది ఎమ్మెల్యేలను కనుక గెలుచుకుంటే.. ఆమె తెలంగాణ రాష్ట్రంలో కింగ్ మేకర్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రానప్పుడు.. కొద్దిస్థానాలు సాధించిన పార్టీకి అధిక అవకాశాలుంటాయి.. ఇప్పుడిక పార్టీ ఆవిర్భావ సభలో తన ఉద్దేశాలను స్పష్టం చేసిన కవిత.. త్వరలో బలమైన రాజకీయ శక్తిగా ఎదుగుతామని స్పష్టం చేసింది. అప్పుడు తెలంగాణ రాజకీయాలు త్రిముక స్థాయి నుంచి చతుర్ముఖ స్థాయి వరకు వెళ్తాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.