RTC Buses: ఆర్టీసీ బస్సుల నంబర్‌ ప్లేట్స్‌పై ‘Z’ ఇంకా దానిని తొలగించరా.. ఆ అక్షరం కథ ఏంటో తెలుసా..?

ప్రతీ వాహనానికి నంబర్‌ ప్లేట్‌ ఉంది. ఇది ఆ వాహనం వివరాలను తెలియజేస్తుంది. వాహనం ఏ ప్రాంతానికి చెందినది.. యజమాని ఎవరు.. ఏ సంవత్సరంలో కొన్నారు.. తదితర వివరాలన్నీ నంబర్‌ ద్వారా తెలుస్తాయి. అందుకే రవాణా అధికారులు ఒక్కో వాహనానికి ఒక్కో నంబర్‌ కేటాయిస్తారు. ఇక ఈ నంబర్లు ఒక్కో రాష్ట్రానికి ఒక్కో సిరీస్‌తో ఉంటాయి.

Written By: Raj Shekar, Updated On : August 3, 2024 3:07 pm

RTC Buses

Follow us on

RTC Buses: నంబర్‌ ప్లేట్‌ అనేది ప్రతీ వాహనానికి ఉంటుంది. ఇది వాహనం రకంతోపాటు, రాష్ట్రం, యజమాని, వాహన రకాన్ని తెలియజేస్తుంది. ఈ నంబర్‌ను రవాణా అధికారులు జారీ చేస్తారు. ఒక్కో రాష్ట్రానికి ఒక్కోతీరుగా ఉంటుంది. నంబర్లతో పాటుగా.. ఇంగ్లిష్‌ అక్షరాలను చేర్చి నంబర్‌ను కేటాయిస్తుంటారు రవాణా శాఖ అధికారులు. అయితే ఈ నంబర్లలో మన తెలంగాణ రాష్ట్రంలో ఓ ప్రత్యేకత ఉంటుంది. అదేంటంటే.. పోలీసుల వాహనాలను గుర్తించేందుకు ఓ గుర్తు ఉంటే.. అదే సమయంలో ఆర్టీసీ బస్సులకు కూడా ఓ సింబల్‌ ఉంటుంది. పోలీస్‌ వాహనాలన్నీ 9P కోడ్‌తోనే ఉంటాయి. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ఆర్టీసీ బస్సుల నంబర్‌ ప్లేట్లపై ‘జెడ్‌’(Z) అనే అక్షరం ఉంటుంది. ఇలా ‘జెడ్‌’ అనే అక్షరం ఒక్క బస్సులపైనే ఎందుకు ఉంటుందన్న విషయం చాలా మందికి తెలియదు. ఆ అక్షరం ఎందుకు వచ్చింది.. ఎవరు చేర్చారు. ఎందుకు చేర్చారు అనే దానికి పెద్ద కథే ఉంది. అదేంటో తెలుసుకుందాం.

నిజాం తల్లి జ్ఞాపకార్థం..
హైదరాబాద్‌ ప్రాంతాన్ని గతంలో నిజాంలు పరిపాలించారు. అప్పటి నిజాం ప్రభుత్వం రోడ్డు, రైలు మార్గాల అభివృద్ధి కోసం ‘నిజాం స్టేట్‌ రైల్‌ అండ్‌ రోడ్డు ట్రాన్స్‌పోర్టు’ సంస్థను ఏర్పాటు చేసింది. అయితే ఈ సంస్ధ 1932 జూన్‌లో తొలిసారిగా సిటీ బస్సు సర్వీసులను ప్రవేశపెట్టింది. ఈ బస్సులను అప్పటి నిజాం ఉస్మాన్‌ అలీఖాన్‌.. తన తల్లి జహ్రాబేగం పేరుతో నమోదు చేయించారు. దీంతో అప్పటి నుంచి నేటి వరకు ఆర్టీసీకి చెందిన ప్రతీ బస్సు న ంబర్‌లో ఏడో నిజాం ఉస్మాన్‌ అలీఖాన్‌ తల్లి జహ్రాబేగం పేరులోని మొదటి అక్షరం ‘‘జెడ్‌’’తోనే రిజిస్ట్రేషన్‌ అవుతున్నాయి.

నిజాం కండీషన్‌..
భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత హైదరాబాద్‌ సంస్థానాన్ని.. నిజాం భారత్‌లో విలీనం చేసిన సంగతి తెలిసిందే. సర్దార్‌ వల్లాభాయ్‌ పటేల్‌ చేపట్టిన ఆపరేషన్‌ సమయంలో నిజాం ఓ కండీషన్‌ పెట్టాడు. హైదరాబాద్‌ సంస్థానం పరిధిలో ప్రజా రవాణా కోసం ఆర్టీసీ ద్వారా ఉపయోగించే ఏ బస్సుకైనా ‘‘జెడ్‌’’ అనే అక్షరాన్ని ఉపయోగించాలని ప్రభుత్వానికి విన్నవించుకున్నాడు. దీంతో అప్పటి నుంచి ఆ సంప్రదాయం కంటిన్యూ అవుతోంది. అందుకే ఇప్పటికీ.. తెలంగాణ, ఏపీల్లోని ఆర్టీసీ బస్సులు, ఆర్టీసీ సంస్థకు చెందిన ఇతర వాహనాల నంబర్‌ ప్లేట్‌ లో ‘‘జెడ్‌’’ అనే అక్షరం కచ్చితంగా ఉంటుంది.

నిరంకుశ పాలకుడిగా..
నిజాం నిరంకుశ పాలకుడిగా ముద్రపడ్డాడు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినా.. భారత్‌లో హైదరాబాద్‌ సంస్థానాన్ని విలీనం చేయలేదు. ఇక ఖాసీం రజ్వీ.. తెలంగాణ ప్రజలను చిత్రహింసలు పెట్టాడు. మహిళలతో నగ్నంగా బతుకమ్మ ఆడించాడు. నిజాం భారత దేశానికి శత్రువుగా ఉన్నాడు. తొలి హోం మంత్రి సర్దార్‌ పటేల్‌ చేపట్టిన సైనిక చర్య తర్వాత లొంగిపోయాడు. అయినా తెలంగాణ పాలకులు నిజాం కండీషన్‌ను ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఏడో నిజాం ఉస్మాన్‌ అలీఖాన్‌ తల్లి జహ్రాబేగం పేరులోని మొదటి అక్షరం ‘‘జెడ్‌’ను కొనసాగిస్తున్నారు.

ఓటు బ్యాంకు కోసమే..
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక నిర్మాణాల పేర్లు మార్చారు. జిల్లాలకు తెలంగాణ వీరుల పేర్లు పెట్టారు. తాజాగా తెలుగు విశ్వవిద్యాలయం పేరు కూడా మార్చాలని నిర్ణయించారు. ఇక గతంలో టీఎస్‌ కోడ్‌ను ప్రస్తుతం టీజీగా మార్చారు. కానీ, ఉమ్మడి రాష్ట్రంలో ఏపీఎస్‌ఆర్టీసీగా, తర్వాత టీఎస్‌ ఆర్టీసీగా, ప్రస్తుతం టీజీ ఆర్టీసీగా ప్రజా రవాణా సంస్థ మారింది. కానీ, బస్సులపై ‘జెడ్‌’ అక్షరం మాత్రం మార్చడం లేదు. ఒక వర్గం ఓట్ల కోసమే పాలకులు ఇలా నిజాం కండీషన్‌ను కొనసాగిస్తున్నారని తెలుస్తోంది.