Jogi Ramesh: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై వ్యక్తిగత కేసులు చుట్టుముడుతున్నాయి. మొన్నటికి మొన్న మాజీ మంత్రి అప్పలరాజు తన కుమారుడు ప్రమాదం మూలంగా చిక్కుల్లో పడ్డారు. బైక్ ప్రమాదానికి కారణమైన తన కుమారుడి బదులు మరొకరిని బలిపశువు చేసే క్రమంలో అడ్డంగా బుక్కయ్యారు. ఇంకో మాజీ మంత్రి, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తన కుమారుడికి ఓ భూమి రిజిస్ట్రేషన్ చేసే క్రమంలో అడ్డగోలు వ్యవహారానికి పాల్పడ్డారు. ఆ ఘటనలు మరువకముందే మాజీ మంత్రి జోగి రమేష్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులపై గృహహింస కేసు నమోదయింది. కోడలు ఫిర్యాదు మేరకు హత్యాయత్నం, గృహహింస, వరకట్న వేధింపుల కేసులు నమోదు కావడం విశేషం. ఆయన కోడలు ఇచ్చిన ఫిర్యాదుతో జోగి రమేష్ దంపతులతో పాటు కుటుంబ సభ్యులు పదకొండు మందిపై కేసు నమోదు అయింది. దీంతో మాజీ మంత్రి జోగి రమేష్ కు షాక్ తప్పలేదు.
* అత్తింటి వారి పై ఫిర్యాదు..
వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో మంత్రిగా వ్యవహరించారు జోగి రమేష్. ఇటీవల వివాదాస్పద అంశాల్లో చిక్కుకుంటూ వచ్చారు. ముఖ్యంగా అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఆయన కుమారుడు రాజీవ్ అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు అదే రాజీవ్ భార్య అత్తింటి వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదయింది. రాజీవ్ భార్య మేఘన ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులను ఆశ్రయించారు. తనను శారీరకంగా, మానసికంగా తీవ్రంగా వేధిస్తున్నారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. అదనపు కట్నం తీసుకురావాలంటూ తనను అత్తింటి వారు చిత్రహింసలకు గురిచేసారని మేఘనాథ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను చంపేందుకు హత్యాయత్నానికి కూడా పాల్పడ్డారని.. ఇంట్లో గృహహింసను ఎదుర్కొంటున్నట్లు పోలీసులకు చెప్పుకొచ్చారు.
* 11 మందిపై కేసు నమోదు..
జోగి రమేష్ కోడలు మేఘన ఫిర్యాదుతో ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. జోగి రమేష్ తో పాటుగా ఆయన భార్య శకుంతల, కొడుకు రాజీవ్, కుమార్తె ప్రియాంక సహా కుటుంబంలోని మొత్తం 11 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మోసం, హత్యాయత్నం, వరకట్నం వేధింపులు, గృహహింస తదితర కట్టిన సెక్షన్ల కింద కేసులు బుక్ చేశారు. స్వయంగా జోగి రమేష్ కోడలు అత్తింటి పై ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. జోగి రమేష్ పెద్ద కుమారుడు రాజీవ్ కు తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన మేఘనతో 2025 మే 25న వివాహమైంది. ఇంతలోనే ఆమె గృహహింసకు గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. భర్త రాజీవ్ తో పాటు అత్తమామలు జోగి రమేష్, శకుంతల, మరిది రోహిత్, ఆడపడుచు ప్రియాంక, జోగి రమేష్ సోదరుడు రాము, ఆయన కుమారులు రాకేష్, పండు తో పాటు రమేష్ బావమరిది స్వామి, ఆయన భార్య రమ, స్వామి కుమారుడు సంతోష్ పేర్లను ఫిర్యాదులో ప్రస్తావించారు. దీంతో వారిపై కూడా పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.



