Homeజాతీయ వార్తలుHimachal Floods 2024: ఊరు ఊరంతా కొట్టుకుపోయింది.. ఆ ఒక్క ఇల్లే మిగిలింది... పరిస్థితి తీవ్రతకు...

Himachal Floods 2024: ఊరు ఊరంతా కొట్టుకుపోయింది.. ఆ ఒక్క ఇల్లే మిగిలింది… పరిస్థితి తీవ్రతకు నిదర్శనం ఇది

Himachal Floods 2024: ఈసారి దేశంలోకి రుతుపవనాలు ఆశించిన సమయం కన్నా ముందే ప్రవేశించాయి. అయితే.. మొదట్లో అవి పెద్దగా చురుకుగా లేకపోవడంతో దాదాపు నెల రోజులపాటు దేశంలో పెద్దగా వర్షాలు కురవలేదు. కానీ, జూలై రెండో వారం నుంచి అల్పపీడనాలు, వాయుగుండాలు, తుపానుల ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈశాన్య రాష్ట్రం అసోం అయితే జూన్‌లోనే వరదలతో విలవిలలాడింది. ఢిల్లీ కూడా భారీ వర్షాలు, వరదలకు చిగురుటాకులా వణుకుతోంది. తాజాగా కేరళలోను వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. జూలై 29 నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రంలో నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. వర్షాలకు వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడడంతో వందల మంది మృతిచెందారు. వందల మంది గల్లంతయ్యారు. శిథిలాల కింద ఇంకా మృతదేహాల కోసం గాలింపు జరుగుతోంది. ఆర్మీతోపాటు స్థానిక పోలీసులు సహాయ చర్యలు చేపడుతున్నారు. డాగ్‌స్క్వాడ్‌తో గాలిస్తున్నారు. సహాయ చర్యలకు వర్షాలు ఆటంకం కలిగిస్తున్నాయి. ఇప్పటి వరకు 330 మంది శవాలను వెలికి తీశారు. వందల మంది ఆచూకీలేకుండా పోయింది. దీంతో శిథిలాల్లో ఇంకా మృతదేహాలు ఉండి ఉంటాయని అనుమానిస్తున్నారు. వాయినాడ్‌ విలయం ఇలా ఉంటే.. తాజాగా హిమాచల్‌ ప్రదేశ్‌లో క్లౌడ్‌ బరస్ట్‌ అయింది. తీవ్ర విపత్తును సృష్టించింది. ఒక్కసారిగా వచ్చిపడిన వరదలో సామేజ్‌ అనే గ్రామంలో మొత్తం కొట్టుకుపోయింది. ఒక ఇల్లు మాత్రం వరదలను తట్టుకుని నిలబడింది. తాము ఎదుర్కొన్న భయానక అనుభవాన్ని ఆ కుటుంబీకులు పంచుకున్నారు. ‘వరద తర్వాత బయట చూస్తే మా ఇల్లు తప్ప ఇంకేమీ మిగల్లేదు. వెంటనే సమీపంలోని కాళీమాత ఆలయానికి పరిగెత్తి తలదాచుకున్నాం’ అని పేర్కొన్నారు. ఇక ఈ విలయంలో 53 మంది గల్లంతయ్యారని అధికారులు తెలిపారు.

ఏం జరిగిందంటే..
కేరళలోని వయనాడ్‌ ప్రాంతంలో అకస్మాత్తుగా వచ్చిన వరదల కారణంగా..పెను విషాదం చోటుచేసుకుంది. ఈ ఘోర విపత్తులో దాదాపు 350 మంది ఇప్పటి వరకు మృతిచెందినట్లు గుర్తించారు. ఇలా దక్షిణాదిలో కేరళలో వరద బీభత్సం జరగ్గా.. అదే తరహాలో నార్త్‌ లోని ఉత్తరాఖండ్, హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల్లో కూడా కనిపించింది. తాజాగా హిమాచల్‌ ప్రదేశ్‌లోని ఓ గ్రామంపై అకస్మాత్తుగా వరదులు రావడంతో మొత్తం కొట్టుకుపోయింది. ఒక్క ఇల్లు తప్ప. రాష్ట్రంలోని కులులోని నిర్మంద్‌ బ్లాక్, మాలానా, మండి జిల్లాల్లో క్లౌడ్‌ బరస్ట్‌ కారణంగా కుండపోత వాన కురిసింది. దాంతో ఇళ్లు, పాఠశాలలతోపాటు ఆసుపత్రులు సైతం దెబ్బతిన్నాయి. మూడు ప్రాంతాల్లో దాదాపు పదుల సంఖ్యలో జనాల గల్లంతయ్యారు. ఇదే సమయంలో క్లౌడ్‌ బరస్ట్‌ కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విద్యాసంస్థలను మూసివేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

విరుచుకుపడిన వరద..
ఈ క్రమంలో హిమాచల్‌ ప్రదేశ్‌లో శుక్రవారం(ఆగస్టు 2న) దారుణం చోటుచేసుకుంది. ఒక్కసారిగా వచ్చిపడిన వరద కారణంగా సామేజ్‌ అనే గ్రామంలో ఒక ఇల్లు తప్ప మొత్తం కొట్టుకుపోయింది. అయితే ఆ ఇల్లు వరదలకు వచ్చే ప్రదేశానికి కాస్తా దూరంగా కొండవైపు ఉండటంతో కొట్టుకుపోలేదని స్థానికులు చెబుతున్నారు. ఇదే సమయంలో తాము ఎదుర్కొన్న భయానక అనుభవాన్ని ఆ కుటుంబీకులు మీడియాతో పంచుకున్నారు. వరద తరువాత బయట చూస్తే తమ ఇల్లు తప్ప ఇంకేమీ మిగల్లేదని తెలిపారు. మరోసారి వరదలు వస్తాయనే భయంతో వెంటనే సమీపంలోని కాళీమాత ఆలయానికి పరిగెత్తి తలదాచుకున్నామని వారు పేర్కొన్నారు.

53 మంది గల్లంతు..
ఇదిలా ఉంటే.. వరదలకు రాష్ట్రంలో 53 మంది గల్లంతయ్యారని అధికారులు తెలిపారు. హిమాచల్‌ ప్రదేశ్‌లో భారీ వర్షాలు, ఆకస్మిక వరదల వల్ల అక్కడి నదులు ఉప్పొంగాయి. ప్రత్యేకించి– బియాస్‌ నది ఉగ్రరూపాన్ని దాల్చింది. తీర ప్రాంతాలను ముంచెత్తుతోంది. పార్వతి నది ఎప్పుడూ లేని విధంగా వరదపోటుకు గురైంది. ఈ క్రమంలోనే జాతీయ, హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్ర స్థాయి వైపరీత్యాల నిర్వహణ బలగాలు సహాయక చర్యలు చేపట్టాయి. కొన్ని చోట్ల హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. మనాలి జాతీయ రహదారి పలుచోట్ల కొట్టుకుపోయింది. మొత్తంగా హిమాచల్‌ ప్రదేశ్‌ మరో కేరళ తరహాలో కనిపిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version