Toli Ekadashi 2026: హిందూ సాంప్రదాయం ప్రకారం ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంటుంది. ప్రతి నెలలో రెండు సార్లు వచ్చే ఏకాదశి ఏడాదిలో 24 సార్లు వస్తుంది. అయితే వీటిలో ఆషాడ మాసంలో శుక్లపక్షం లో వచ్చే ఏకాదశి తొలి ఏకాదశిగా భావిస్తారు. ఈ ఏకాదశిని అతి పవిత్రమైనదిగా భావిస్తారు. ఎందుకంటే ఈరోజు శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో యోగ నిద్రలోకి వెళ్తారని చెబుతారు. అందువల్ల ఈరోజున శ్రీమహావిష్ణువును భక్తిశ్రద్ధలతో కొలవడం వల్ల ఆ స్వామి అనుగ్రహం తప్పకుండా ఉంటుందని పండితులు చెబుతున్నారు. అయితే ఉపవాసం ద్వారా శ్రీమహావిష్ణువుకు పూజలు చేస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు. అసలు ఈరోజు ఉపవాసం ఎలా ఉండాలి? ఎలాంటి నియమాలు పాటించాలి?
తొలి ఏకాదశి ఉపవాసాన్ని ఉదయం నుంచి ఆచరించాలి. సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం ఆచరించి శుభ్రమైన దుస్తులను ధరించాలి. అనంతరం పూజగదిని శుభ్రం చేసుకుని శ్రీమహావిష్ణువు లేదా శ్రీ నారాయణుడి చిత్రపటం ఏర్పాటు చేసుకొని దీపం వెలిగించి పూజ చేయాలి. భక్తిశ్రద్ధలతో విష్ణు సహస్రనామం పఠించడం వల్ల ఆ స్వామివారి అనుగ్రహం పొందవచ్చని అంటున్నారు.
అయితే ఈరోజు ఉపవాసం ద్వారా స్వామివారిని కొలవడం వల్ల విశేష ఫలితాలు ఉంటాయని అంటున్నారు. కొందరు ఈరోజు నిర్జల ఉపవాసం ఉంటారు. అంటే మీరు కూడా తీసుకోకుండా స్వామివారిని కొలుస్తూ ఉంటారు. మరికొందరు మాత్రం పండ్లు, పాలు, కొబ్బరి నీరు వంటి సాత్విక ఆహారంతో ఉపవాసం చేస్తారు. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం తమకు అనుగుణంగా సాత్విక ఆహారం తీసుకుంటూ ఉపవాసం ఉండవచ్చు.
చాలామందికి ఉపవాసంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి? అన్న సందేహం ఉంటుంది. ఉపవాసంలో అన్నం, గోధుమలు, సాధారణ ధాన్యాలకు దూరంగా ఉండటమే మంచిది. వీటికి బదులుగా పండ్లు, పాలు, కొబ్బరినీరు, ఉడికించిన బంగాళదుంపలు వంటి వాటిని పరిమితంగా తీసుకోవాలి. అలాగే సగ్గుబియ్యం, సామలు వంటి వాటిని తీసుకోవచ్చు. అయితే ఉపవాసం ఉండేవారు సాధారణ ఒప్పుకు బదులు రాక్ సాల్టును ఉపయోగించాలని కొందరు చెబుతుంటారు. అలాగే ఎక్కువగా వేయించిన పదార్థాలు, ప్యాకేజ్ చేసిన ఫుడ్స్ వంటి వాటికి దూరంగా ఉండటమే మంచిది చెబుతున్నారు.
ఉపవాసం ఉన్నవారు సాధ్యమైనంత వరకు శ్రీమహావిష్ణువు నామస్మరణ చేస్తూనే ఉండాలి. అలాగే విష్ణు సహస్రనామం, భగవద్గీత, విష్ణు స్తోత్రం వంటి వాటిని జపిస్తూ ఉండాలి. ఎలాంటి చెడు పనులకు పోకుండా ఆధ్యాత్మిక వాతావరణం లోనే గడపాలి.
ఉపవాసం ఉన్నవారు కొన్ని పనులకు దూరంగా ఉండడమే మంచిది. అనవసరపు వివాదాలకు దూరంగా ఉండాలి. చెడు ఆలోచనలు రానివ్వకుండా జాగ్రత్త పడాలి. మిత ఆహారం తీసుకోవడం వల్ల ఆలోచనలను కంట్రోల్ చేసుకోవచ్చు. మాంసాహారం, మద్యానికి దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. అనవసరంగా కోపం తెచ్చుకోకుండా… తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త పడాలి.
తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారు మరుసటి రోజు వచ్చే ద్వాదశి తిథి లో విరమిస్తారు. దీనిని పారణ అంటారు. అయితే ఉపవాసం విరమించే ముందు స్వామివారికి నైవేద్యం సమర్పించి అనంతరం తేలికపాటి ఆహారంతో ముగిస్తే అన్ని శుభ ఫలితాలు ఉండే అవకాశం ఉందని అంటుంటారు.


