India Vs New Zealand Semi Final
India Vs New Zealand Semi Final: అసలే మన దేశంలో క్రికెట్ అంటే బడికెళ్లే పిల్లల నుంచి సీనియర్ సిటిజన్ల వరకు యమా పిచ్చి. మైదానంలో ముఖ్యంగా భారత ఆటగాళ్లు సిక్స్లు, ఫోర్లు కొడుతుంటే అభిమానులు కేరింతలు కొడతారు. టీవీలో లైవ్ వస్తుంటే కళ్లు అప్పగించుకుని చూస్తుంటారు. అభిమాన క్రికెటర్లను దైవాంశసంభూతులుగా కొలుస్తుంటారు. అలాంటిది మనదేశంలో వరల్డ్ కప్ జరుగుతుంటే ఊరుకోరు కదా! భారత్ జట్టు మాత్రమే ఇతర జట్లు ఆడే మ్యాచ్లను సైతం మిస్ కాకుండా చూశారు. ఇక భారత్ వరుసగా 9 విజయాలు సాధించి సెమిస్లోకి దూసుకెళ్లింది. గురువారం ముంబయిలోని వాంఖడే మైదానంలో న్యూజిలాండ్తో సెమీస్ పోరులో తలపడుతోంది. భారత బ్యాటర్లు విజృంభించడంతో భారీ స్కోరుదిశగా పయనిస్తోంది.
వ్యూస్ ల్లో రికార్డు
సెమీ ఫైనల్ మ్యాచ్ కావడం, అందునా సొంత దేశంలో సొంత టీం ఆడుతుండటంతో వాంఖడే మైదానం ప్రేక్షకులతో కిక్కిరిసిపోయింది. డేవిడ్ బెక్ హమ్, సచిన్ లాంటి ఆటగాళ్లు మ్యాచ్ చూసేందుకువచ్చారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. మరోమాటకు తావులాంకుండా దూకుడైన ఆటను ప్రదర్శించింది. విరాట్ తన 50వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సచిన్ రికార్డును అధిగమించాడు. శ్రేయాస్ అయ్యర్ కూడా తక్కువ బంతుల్లోనే సెంచరీ చేశాడు. అయితే ఈ మ్యాచ్ వ్యూస్ పరంగా సరికొత్త రికార్డులను సృష్టించింది. వరల్డ్ కప్ సీరిస్ మొత్తాన్ని ఎటువంటి సబ్ స్ర్కిప్షన్ వసూలు చేయకూడదని డిస్ని ప్లస్ హాట్ స్టార్ నిర్ణయం తీసుకుంది. ఆ ఫలితమే సరికొత్త రికార్డులను నమోదు చేసేందుకు కారణమైంది.
5.1 కోట్లు
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఫ్రీగా చూసే అవకాశం ఇవ్వడం, మన దేశం సెమీస్కు వెళ్లడం, చేతిలో అపరిమితమైన డాటా ఉండటంతో అభిమానులు సెల్ ఫోన్లకు అతుక్కుపోయారు. ఫలితంగా లైవ్ వ్యూయర్స్ సంఖ్య అమాంతం పెరిగిపోయింది. ఏకంగా 5.1 కోట్లకు చేరుకుంది. గతంలో భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ను 3 కోట్ల మంది చూడగా, ఇప్పుడు భారత్- న్యూజిలాండ్ సెమీస్ మ్యాచ్ ఆ రికార్డును బద్దలు కొట్టింది. వ్యూస్ ఫరంగా జియో సినిమాలో లైవ్ స్ట్రీమింగ్ అయిన ఫుట్ బాల్ ఫైనల్ మ్యాచ్ను సైతం ఈ మ్యాచ్ అధిగమించింది. రికార్డు స్థాయిలో వ్యూయర్ షిప్ నమోదుకావడంతో డిస్ని ప్లస్ హాట్ స్టార్ పండగ చేసుకుంటోంది. యాడ్స్ ఎండార్స్ మెంట్స్తో కోట్లు వెనకేసుకుంటోంది.