Jasprit Bumrah : భారత పేసు గుర్రం జస్ ప్రీత్ బుమ్రాకు ఐసీసీ దాసోహం.. ఏకంగా ఆ స్థానం పాదాక్రాంతం.. కపిల్ దేవ్ తర్వాత ఆ స్థాయి ఘనత సొంతం..

టెస్ట్ క్రికెట్ లో జస్ ప్రీత్ బుమ్రా ఎదురన్నదే లేకుండా దూసుకుపోతున్నాడు. తనదైన రోజే కాదు.. తనది కాని రోజు కూడా రెచ్చిపోతున్నాడు. నిర్జీవమైన మైదానంపై వికెట్ల మీద వికెట్లు పడగొడుతున్నాడు. తద్వారా టీమిండియా సాధిస్తున్న విజయాలలో తన వంతు పాత్ర పోషిస్తున్నాడు. ఇటీవల బంగ్లాదేశ్ సిరీస్ లోనూ 11 వికెట్లు దక్కించుకున్నాడు.

Written By: Anabothula Bhaskar, Updated On : October 2, 2024 8:38 pm

Jasprit Bumrah

Follow us on

Jasprit Bumrah : బంగ్లాదేశ్ సిరీస్ లో ఆకట్టుకోవడంతో బుమ్రా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో ఒక్కసారిగా మెరిశాడు. ప్రపంచ నెంబర్ వన్ బౌలర్ గా అవతరించాడు. టీమ్ ఇండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ను పక్కన నెట్టి అగ్రస్థానాన్ని ఆక్రమించాడు. బుధవారం ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ ను ప్రకటించింది. యువ ఆటగాడు యశస్వి జైస్వాల్, సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తమ ర్యాంకులను మరింత మెరుగుపరచుకున్నాడు.. బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో బుమ్రా అద్భుతమైన ప్రదర్శన చేశాడు. 11 వికెట్లు పడగొట్టాడు. ఇప్పటిదాకా రెండవ స్థానంలో కొనసాగిన బుమ్రా.. 870 పాయింట్లతో రెండవ స్థానం నుంచి అగ్రస్థానాన్ని ఆక్రమించాడు. 869 పాయింట్లతో రవిచంద్రన్ అశ్విన్ రెండవ స్థానానికి పడిపోయాడు. బుమ్రా నెంబర్ వన్ టెస్ట్ బౌలర్ గా అవతరించడం ఇది రెండవసారి. ఏడాది ఫిబ్రవరిలో ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన సిరీస్ తర్వాత బుమ్రా అగ్రస్థానాన్ని ఆక్రమించాడు. ఆ తర్వాత అతడి ర్యాంక్ పడిపోయింది. ఇంతకుముందు టీమిండియా నుంచి కపిల్ దేవ్ ఫాస్ట్ బౌలర్ విభాగంలో ఈ ఘనతను అందుకున్నాడు. కాన్పూర్ మైదానంలో బుమ్రా ఏకంగా ఏడు వికెట్లు సాధించాడు. ఇక బంగ్లాదేశ్ జట్టుకు చెందిన మెహదీ హసన్ మిరాజ్ నాలుగు స్థానాలను పెంచుకొని 18వ స్థానాన్ని ఆక్రమించాడు. సీనియర్ స్పిన్ బౌలర్ షకిబ్ అల్ హసన్ 28 వ స్థానాన్ని ఆక్రమించాడు.

బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో టీమిండియా యువ ఆటగాడు జైస్వాల్ రెండు స్థానాలను మెరుగుపరుచుకున్నాడు. ఏకంగా మూడో స్థానానికి చేరుకున్నాడు. ప్రస్తుతం అతడి ఖాతాలో 792 పాయింట్లు ఉన్నాయి. నాలుగు ఇన్నింగ్స్ లలో 47.25 సగటుతో 189 రన్స్ చేశాడు. 22 సంవత్సరాల ఈ ఆటగాడు ఇప్పటికే మూడు హాఫ్ సెంచరీలను సాధించాడు. బ్యాట్స్ మెన్ విభాగంలో ఇంగ్లాండ్ ఆటగాడు రూట్ అగ్రస్థానంలో ఉన్నాడు. టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఆరవ స్థానంలో ఉన్నాడు. చెన్నై టెస్టులో 6, 17 పరుగులు చేసిన కోహ్లీ.. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో టాప్ టెన్ లో అవకాశం లభించలేదు. కాన్పూర్ టెస్టులో 47, 29* పరుగులు చేసి టీమిండియా విజయంలో కోహ్లీ ముఖ్య పాత్ర పోషించాడు. దీంతో అతడు ఆరవ స్థానానికి చేరుకున్నాడు. రిషబ్ పంత్ తొమ్మిదవ స్థానాన్ని ఆక్రమించాడు. టీమ్ ఇండియా కెప్టెన్ టాప్ -10 లో స్థానం కోల్పోయాడు. అతడు 15వ స్థానానికి దిగజారాడు.

టెస్ట్ ర్యాకింగ్స్ లో టీమ్ ఇండియా మొదటి స్థానంలో కొనసాగుతోంది. బంగ్లాదేశ్ పై టెస్ట్ సిరీస్ గెలిచిన అనంతరం టీమిండియా మరో 8 టెస్ట్ మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. స్వదేశంలో న్యూజిలాండ్ జట్టుతో మూడు, ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాపై ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈ ఎనిమిది టెస్టులలో మూడు గెలిస్తే నేరుగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ వెళ్తుంది.