Toli Ekadashi 2026: హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఏడాదిలో వచ్చే ఏకాదశి తిథులకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి నెలలో శుక్ల, కృష్ణ పక్షాల్లో ఒక్కో ఏకాదశి చొప్పున ఏడాదిలో మొత్తం 24 ఏకాదశులు వస్తాయి. వీటిలో ఆషాడ మాసంలో శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి లేదా శయన ఏకాదశి అని అంటారు. ఈ ఏడాదిలో జూలై 25న తొలి ఏకాదశి రానుంది. ఈ సందర్భంగా తొలి ఏకాదశిని పండుగల నిర్వహించుకుంటారు. అయితే ఈ తొలి ఏకాదశి రోజున ఏం చేయొద్దు.. ఏం చేయాలంటే.
తెలుగు పంచాంగం ప్రకారం ఆషాడమాసంలో శుక్లపక్ష ఏకాదశికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. దీనిని తొలి ఏకాదశిగా భావించి పండుగల నిర్వహించుకుంటారు. ఈ ఏడాది జూలై 24న శుక్రవారం ఉదయం 10 గంటల తర్వాత తొలి ఏకాదశి తిథి ప్రారంభం అయినా.. సూర్యోదయానికి ఉండే తిథి నే ప్రధానంగా పరిగణలోకి తీసుకుంటారని పండితులు చెబుతున్నారు. అందువల్ల జూలై 25న ఏకాదశిని జరుపుకోవాలని కోరుకుంటున్నారు.
తొలి ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువుకు ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు. పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు ఈరోజున క్షీర సాగరంలో యోగ నిద్రలోకి వెళ్తారని చెబుతారు. ఆ తర్వాత వచ్చే ప్రబోధిని లేదా ఉత్తాన ఏకాదశి రోజున మేల్కొంటారని భక్తులు చెబుతారు. ఈ కాలాన్ని చాతుర్మాస్య కాలంగా పరిగణిస్తారు. అందువల్ల తొలి ఏకాదశికి ప్రత్యేక ప్రాధాన్యత లభించింది.
తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత విష్ణువు లేదా శ్రీకృష్ణుడి చిత్రపటాన్ని పూజ మందిరంలో ఉంచి ప్రత్యేక పూజలు చేయాలి. తులసి తలాలతో ఈరోజు విష్ణుమూర్తి ని పూజించడం వల్ల లేదా విష్ణు సహస్రనామం జపించడం వల్ల అన్ని శుభాలే జరుగుతాయని భావిస్తారు. కొందరు ఈరోజున ఉపవాసం కూడా ఉంటారు. అయితే ఉపవాసం చేయలేని వారు సాత్విక ఆహారాన్ని తీసుకుంటూ విష్ణువును కొలుస్తూ ఉంటారు.
తొలి ఏకాదశి రోజున ప్రత్యేక సాంప్రదాయం ఉంది. ఈ రోజున పెద్దలకు కొత్త వస్త్రాలను సమర్పించడం లేదా దానం చేయడం శుభప్రదం అని కొన్ని ప్రాంతాల్లో చెప్పుకుంటూ ఉంటారు. అయితే పెద్దలకు ఈ దుస్తులను ఇచ్చేముందు వీటిని దేవుడి వద్ద ఉంచి పూజ చేయాలి. ఆ తర్వాత అవసరమైన వారికి లేదా పెద్దలకు దానం చేయవచ్చని చెబుతున్నారు. అయితే ఏకాదశి రోజున పెద్దలు లేకపోయినా మరుసటి రోజు కూడా వీటిని అందించడం ఆచారంగా వస్తోంది. ఇలా వస్త్ర దానం చేయడం వల్ల భక్తులు విశేషమైన ఫలితాలు పొందుతారని చెబుతున్నారు.
తొలి ఏకాదశి రోజున మాంసాహారం, మద్యం తీసుకోకూడదని కొందరు చెబుతున్నారు. అలాగే కోపం, గొడవలకు దూరంగా ఉండాలని చెబుతున్నారు. ఇతరులను అవమానించడం లేదా బాధ పెట్టడం చేయకుండా ఉండాలి. ఉపవాసం ఉన్న వ్యక్తి ఇతరుల పట్ల చెడు ఆలోచనలు చేయకుండా ఉండాలి. ముఖ్యంగా ఈరోజు పెద్దలను అవమానించకుండా ఉండాలి. బ్రహ్మచర్యం పాటిస్తూ విష్ణువును కొలవడం వల్ల అంతా మంచే జరుగుతుందని పండితులు చెబుతున్నారు.

