Arunachalam Moksha Margam: అప్పుడెప్పుడో ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు అరుణాచలంలో ప్రదక్షిణలు చేయాలని.. మోక్ష మార్గం నుంచి బయటికి రావాలని పిలుపునిచ్చారు. ఆయన చెప్పడమే ఆలస్యం తెలుగు భక్తులు అప్పటినుంచి అరుణాచలానికి క్యూ కడుతున్నారు. చివరికి తమిళ భక్తుల కంటే ఎక్కువగా తెలుగు వాళ్లే అధికంగా అరుణాచలం వెళ్తున్నారు. భక్తుల తాకిడి తట్టుకోలేక కొన్ని సందర్భాలలో గిరిప్రదక్షిణ గంటల తరబడి ఆలస్యం అవుతుంది. దీనిని బట్టి తెలుగు వాళ్ళు అరుణాచలానికి ఏ స్థాయిలో ప్రాధాన్యం ఇస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
అరుణాచలంలో గిరిప్రదక్షిణ అద్భుతంగా ఉంటుంది. గిరి ప్రదక్షిణ తర్వాత భక్తులు అత్యంత ముఖ్యంగా భావించేది మోక్షమార్గం. ఇందులో నుంచి బయటికి వస్తే.. మోక్షం లభిస్తుందని.. పాపాల నుంచి విముక్తి సాధ్యమవుతుందని భక్తులు నమ్ముతుంటారు. అదే మోక్ష మార్గం అత్యంత ఇరుకుగా ఉంటుంది. ఇందులోంచి బయటికి రావడం అంటే అంత సులభం కాదు. జీవితంలో పడిన కష్టాలకు.. నష్టాలకు.. దుఃఖాలకు.. సుఖాలకు ప్రతీకగా మోక్షమార్గం ఉంటుంది. అందులో నుంచి వచ్చిన తీరును బట్టే మన జీవితం ఆధారపడి ఉంటుందని ప్రవచన కారులు చెబుతుంటారు.
పైగా చాగంటి కోటేశ్వరరావు ఇందులో నుంచి రావడం పూర్వజన్మల సుకృతమని చెప్పడంతో.. తెలుగు భక్తులు ఎక్కువగా మోక్షమార్గం నుంచి రావడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. లావు ఎక్కువగా ఉన్న వ్యక్తులు సైతం మోక్షమార్గం నుంచి బయటికి రావాలని భావిస్తుంటారు. అయితే ఇప్పుడు ఈ నమ్మకమే భక్తుల ప్రాణాల మీదికి తీసుకొస్తోంది. ఇటీవల రాజమండ్రి కి సంబంధించిన ఒక భక్తుడు మణికుమార్ ఈనెల 24న మోక్షమార్గంలో ఇరుక్కుపోయి చనిపోయాడు. ఆ సంఘటన మర్చిపోకముందే ఏపీ రాష్ట్రానికి చెందిన మరో భక్తురాలు ఇదే తరహాలో మోక్షమార్గంలో చిక్కుకుపోయింది. బయటికి రావడానికి తీవ్రంగా ఇబ్బంది పడింది. ఆమె కేకలు వేయడంతో చుట్టుపక్కల ఉన్నవారు బయటకు రావడానికి ప్రయత్నాలు చేశారు. అనేక ప్రయత్నాల తర్వాత ఆమెను సురక్షితంగా బయటికి లాగారు.. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో విస్తృతంగా కనిపిస్తున్నాయి.
మోక్షమార్గం అత్యంత ఇరుకుగా ఉంటుంది. సాధ్యమైనంతవరకు లావుగా ఉన్న వ్యక్తులు అందులో నుంచి రావాలని అనుకోకపోవడమే మంచిది. ఎందుకంటే కొన్ని సందర్భాలలో ఊపిరి ఆగిపోయే ప్రమాదం కూడా ఉంది. రాజమండ్రి భక్తుడు మణికుమార్ విషయంలో కూడా ఇదే జరిగింది. అతడు లావుగా ఉండడంతో అందులో నుంచి రాలేకపోయాడు. శ్వాస ఆడక పోవడంతో.. గుండె ఆగి చనిపోయాడు. అందువల్లే మోక్షమార్గంలో నుంచి బయటికి రావాలనే భక్తులు తమ శారీరక స్థితి ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని అక్కడి పూజారులు చెబుతున్నారు.





