Corona In telangana: దేశమంతా కరోనా కల్లోలంతో హాహాకారాలు చేస్తుంటే తెలంగాణలో మాత్రం ఆ చప్పుడు లేదు. కేసులు కూడా రెండు వేల లోపే నమోదవుతున్నాయి. మరణాల ముచ్చట లేనే లేదు. కేంద్రం, కొన్ని రాష్ట్రాలు ఆగమాగం అవుతుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మాత్రం ఆ అలజడి లేదు. తెలంగాణలో ఎంతో మందికి కరోనా సోకుతున్నా.. ఇన్ఫెక్షన్ తో మరణిస్తున్నా కూడా ఏదీ బయటకు రావడం లేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

ప్రభుత్వ రికార్డుల ప్రకారం.. ఇది దాదాపు 4000 మంది కరోనాతో తెలంగాణలో చనిపోయారు. అయితే ఇప్పటివరకూ 26000 మంది కోలుకున్నట్టు చూపించారు. కరోనాతో చనిపోయిన కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం తలా రూ.50వేల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించింది. ఆ సంఖ్య తాజాగా పెరుగుతోంది.
ఇప్పటికే జిల్లా కలెక్టర్లు సుమారు 1200 దరఖాస్తులను ఆమోదించారు. ప్రస్తుతం 2వేల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. హైదరాబాద్ లో మాత్రమే 2500 దరఖాస్తులు క్లియర్ చేశారు. అయితే ఇవి అధికారిక లెక్కలే.. అనధికారికంగా ఇంకా చాలా మంది చనిపోయారని.. రికార్డులకు ఎక్కని మరణాలు చాలా ఉన్నాయంటున్నారు.
తెలంగాణలో మొత్తం 7 లక్షల మందికి పైగా కరోనా సోకగా.. దాదాపు 4000 మంది మరణించారని ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటించింది. అయితే అనధికారికంగా మరణాల సంఖ్య చాలా ఎక్కువ.. 7 లక్షల మందికి సోకితే దాంట్లో శాతాన్ని చూస్తే కనీసం 12వేల మంది వరకూ మరణించి ఉంటారు. అలా అయితే ప్రభుత్వం ఇప్పటివరకూ 12000 కంటే ఎక్కువ దరఖాస్తులను క్లియర్ చేయగలగాలి..? కానీ చేయడం లేదు. మరి ఈ మరణాలను కావాలనే జాప్యం చేస్తున్నారా? నష్టపరిహారం కోసం ఆలస్యం చేస్తున్నారా? ఈ గందరగోళం బాధితుల నుంచి వ్యక్తం అవుతోంది. దీనిపై ప్రభుత్వ యంత్రాంగం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.





