
నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చిందా అంటే రాలేదనే చెప్పక తప్పడం లేదు. ఈ వ్యవహారం అనేక మలుపులు తిరుగుతుంది. ఎస్ఇసి కేసులో నమోదైన పిటీషన్ ల విచారణ అనంతరం హై కోర్టు నిమ్మగడ్డను తిరిగి ఎన్నికల కమిషనర్ గా నియమించాలని తీర్పు ఇచ్చిన విషయం విధితమే. నిమ్మగడ్డను ఎన్నికల కమిషనర్ గా నియమించకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం శత విధాలా ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో హై కోర్టు తీర్పుపై సుప్రీం కోర్టులో పిటీషన్ వేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ తో పిటీషన్ వేయించింది.
Also Read: మంగళగిరి ఎమ్మెల్యే సైలెంట్ అయ్యాడెందుకు?
హై కోర్టు తీర్పు అమలు చేయడం లేదని నిమ్మగడ్డ హై కోర్టులో పిటీషన్ దాఖలు చేస్తే ఈ అంశంపైనా స్పెషల్ లీవ్ పిటీషన్ వేసింది. ఈ పిటీషన్ పై విచారణలో ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఆదేశాలు రావడంతో ఇప్పడు ఆలోచనలో పడింది. నిమ్మగడ్డను అడ్డకునేందుకు ఉన్న మార్గాలను అన్వేషిస్తుంది. ఈ క్రమంలో జస్టిస్ కనగరాజ్ తో సుప్రీం కోర్టులో మరో పిటీషన్ ను ప్రభుత్వం వేయించనుందని సమాచారం. వచ్చే శుక్రవారంలోగా నిమ్మగడ్డ నియామకం వ్యవహారాన్ని తేల్చాలని సుప్రీం కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో శుక్రవారంలోగానే కనగరాజ్ పిటీషన్ వేసే అవకాశం లేకపోలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సమస్య నుంచి తాత్కాలికంగా బయట పడేందుకు నిమ్మగడ్డకు వ్యతిరేకంగా కనగరాజ్ తో పిటీషన్ వేయించడం తప్ప ప్రభుత్వానికి మరో మార్గం కనిపించడం లేదు. కనగరాజ్ పిటీషన్ ను సాకుగా చూపి మరికొన్నాళ్లు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియమించకుండా ఉండాలని ప్రభుత్వం భావిస్తోన్నట్లు సమాచారం.
ఎస్ఇసి పదవీ కాలాన్ని మూడేళ్లకు కుదిస్తూ ఆర్డినెన్స్ తెచ్చిన ప్రభుత్వం నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ కాలం ఆర్డినెన్స్ ప్రకారం పూర్తయ్యిందని, ఆయన స్థానంలో జస్టిస్ కనగరాజ్ ను నియమిస్తున్నట్లు ఉత్తర్వులు ఇచ్చింది. కనగరాజ్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. హై కోర్టు ప్రభుత్వం తెచ్చిన ఆర్ధినెన్స్, కనగరాజ్ నియామకం కోసం ఇచ్చిన జిఓలను రద్దు చేసింది. దీంతో కనగరాజ్ ఎస్ఇసి బాధ్యతల నుంచి తప్పుకున్నారు.
Also Read: మీడియాకు ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది?
కనగరాజ్ పిటీషన్ వ్యవహారం ఇప్పడు చర్చనీయాంశంగా మారింది. నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఇదే విషయాన్ని మీడియాకు వెల్లడించారు. కనగరాజ్ తో ప్రభుత్వం పిటీషన్ వేయించనుందనే సమాచారం తనకు అందిందని తెలిపారు. ఈ అంశాన్ని కొట్టిపారేసే అవకాశం లేదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయనను తిరిగి ఎస్ఇసిగా నియమించకూడదనే విషయంలో ఖచ్ఛితమైన నిర్ణయంతో ఉన్నారని సమాచారం. కోర్టు ఆదేశాలపై పిటీషన్లతో కాలక్షేపం చేస్తే వచ్చే మరో ఏడాదిలో నిమ్మగడ్డ పదవీ కాలం పూర్తవుతుంది. కాబట్టి అప్పడు ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు, కరోనా కారణంగా ఈలోగా స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదు. కాబట్టి ఎటువంటి సమస్య ఉండదని భావిస్తున్నారు.
































