Monsoon Health Tips: వర్షాకాలం ప్రారంభమైన తర్వాత చాలా మందిలో ఒక సందేహం ఉంటుంది. ఈ సమయంలో బలమైన ఆహారం తినాలనే ఉద్దేశంతో కొందరు మాంసాహారం తింటూ ఉంటారు.మరికొందరు మాత్రం వ్యాధుల విజృంభణకు అవకాశం ఉండడంతో చికెన్, మటన్ వంటి నాన్వెజ్ ఆహారంతో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెబుతారు. వైద్యుల అభిప్రాయం ప్రకారం.. ఎటువంటి ఆహారం తీసుకున్నా పరిశుభ్రంగా ఉంటే ఎలాంటి సమస్యలు ఉండవు. అలా కాకపోతే కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఆ సమస్యలు ఏంటో చూద్దాం..
వర్షాకాలంలో వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండటంతో బ్యాక్టీరియా, వైరస్లు, ఫంగస్ వేగంగా పెరుగుతాయి. ఈ కాలంలో జీర్ణవ్యవస్థ పనితీరు కూడా కొంత మందగిస్తుంది. అందువల్ల కలుషితమైన లేదా సరిగా ఉడకని మాంసం తింటే ఫుడ్ పాయిజనింగ్, విరేచనాలు, వాంతులు, కడుపు నొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
చికెన్లో అధిక నాణ్యత గల ప్రోటీన్ ఉంటుంది. ఇది శరీర కండరాల నిర్మాణానికి, దెబ్బతిన్న కణజాలం పునరుద్ధరణకు సహాయపడుతుంది. ఇందులో విటమిన్ B6, B12, నియాసిన్, ఫాస్పరస్, సెలీనియం వంటి పోషకాలు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో, శక్తిని అందించడంలో, మెదడు పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి.
మటన్లో ఐరన్, జింక్, విటమిన్ B12, ప్రోటీన్ సమృద్ధిగా ఉంటాయి. రక్తహీనత సమస్య ఉన్నవారికి ఐరన్ ఉపయోగపడుతుంది. జింక్ శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అయితే మటన్లో కొవ్వు ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో పరిమిత మోతాదులో మాత్రమే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఈ కాలంలో మాంసాన్ని సరిగా నిల్వ చేయకపోతే బ్యాక్టీరియా వేగంగా పెరుగుతుంది. ముఖ్యంగా సాల్మొనెల్లా, క్యాంపిలోబాక్టర్, ఈ.కోలై వంటి బ్యాక్టీరియా ద్వారా ఫుడ్ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. సరిగా ఉడకని మాంసం తింటే కడుపు ఇన్ఫెక్షన్లు, విరేచనాలు, జ్వరం, వాంతులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు, మధుమేహం ఉన్నవారు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు వర్షాకాలంలో నాన్వెజ్ తీసుకునేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. వీరు ఎప్పుడూ తాజాగా వండిన మాంసాన్ని మాత్రమే తీసుకోవడం మంచిది.
వర్షాకాలంలో నాన్వెజ్ తినేటప్పుడు ఎప్పుడూ తాజా చికెన్ లేదా మటన్ మాత్రమే కొనుగోలు చేయాలి. ఫ్రిజ్లో ఎక్కువ రోజులు నిల్వ చేసిన మాంసాన్ని వీలైనంత వరకు ఉపయోగించకూడదు. మాంసాన్ని కనీసం 75°C కంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద పూర్తిగా ఉడికేలా వండాలి. పచ్చి మాంసానికి ఉపయోగించిన కత్తి, కట్టింగ్ బోర్డు, పాత్రలను వెంటనే శుభ్రం చేయాలి. వీధి ఆహారం లేదా పరిశుభ్రత లేని హోటళ్లలో నాన్వెజ్ తినకుండా ఉండటం మంచిది. మసాలాలు ఎక్కువగా, నూనెలో డీప్ ఫ్రై చేసిన వంటకాల కంటే ఉడికించిన లేదా తక్కువ నూనెతో చేసిన వంటకాలను ఎంచుకోవాలి.
ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారం ఆరోగ్యవంతులైన పెద్దలు వారానికి 2 నుంచి 3 సార్లు పరిమిత మోతాదులో చికెన్ లేదా మటన్ తీసుకోవచ్చు. అయితే గుండె జబ్బులు, అధిక కొలెస్ట్రాల్, కిడ్నీ సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా మేరకు మాత్రమే తీసుకోవాలి.
















వైసీపీ నేతలు ఎంగిలి మెతుకులు కూడా వదిలిపెట్టరు.. జడ శ్రావణ్ ఇలా ప్లేట్ తిప్పాడేంటి..
Jada Sravan: కొద్దిరోజులుగా ఏపీ రాజకీయాలలో జడ శ్రావణ్ సృష్టిస్తున్న సంచలనం అంతా అంతా కాదు. అప్పట్లో క్రైస్తవులు సమావేశం పెట్టుకుంటే.. దానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యాడు శ్రావణ్.. పవన్ కళ్యాణ్ మీద తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశాడు. పది చదివిన నువ్వే ఉప ముఖ్యమంత్రి అవ్వంగా లేనిది.. జడ్జి చదివిన నేను ఉపముఖ్యమంత్రి అయితే తప్పేంటయ్యా అంటూ శ్రవణ్ తీవ్ర స్వరంతో వ్యాఖ్యలు చేశారు. ఇక అప్పట్నుంచి శ్రవణ్ ఏదో ఒక సందర్భంలో.. ఏదో ఒక రీతిగా పవన్ కళ్యాణ్ మీద.. జనసేన మీద.. కూటమి ప్రభుత్వం మీద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు.
జడ శ్రవణ్ ఇటీవల యూట్యూబర్ జోసెఫ్ అలియాస్ రావణ్ అరెస్టు పట్ల స్పందించారు. ఆయనను అరెస్టు చేసిన ప్రతి పోలీస్ స్టేషన్ కు వెళ్లి బెయిల్ మీద విడిపించుకుని వచ్చారు. అయితే ఈసారి ఏపీ పోలీసులు సరికొత్త ఆధారాలను సంపాదించారు.. జోసెఫ్ అలియాస్ రావణ్ మీద రాజ ద్రోహం కేసు పెట్టారు. ఉపా చట్టం కింద అతడి మీద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం రావణ్ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. ఆ మధ్య రావణ్ కు.. వైసిపికి అనుకూలంగా మాట్లాడారు శ్రవణ్.. పైగా వచ్చేది వైసిపి ప్రభుత్వం అని.. ఉపముఖ్యమంత్రిగా శ్రావణ్ ఉంటారని.. జగన్ ముఖ్యమంత్రి అవుతారని సోషల్ మీడియాలో కొంతమంది యూట్యూబర్లు వీడియోలు కూడా చేశారు.
వైసిపికి అనుకూలంగా మాట్లాడిన శ్రవణ్ ఇప్పుడు ఒక్కసారిగా స్వరం మార్చారు. తనకు వైసిపి నేతలు ఫండింగ్ చేస్తున్నారని వస్తున్న ఆరోపణ నేపథ్యంలో.. ఆయన క్లారిటీ ఇచ్చారు. వైసీపీ నేతలు ఎంగిలి మెతుకులను కూడా వదిలిపెట్టరని.. వాటిని కూడా ఏరుకొని తింటారని.. అలాంటప్పుడు వాళ్లు తనకు ఫండింగ్ ఎలా చేస్తారని శ్రావణ్ ప్రశ్నించారు.. తన వెనుక ఎవరూ లేరని .. ఫండింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదని శ్రవణ్ స్పష్టం చేశారు. అయితే అప్పట్లో ఒక ఇంటర్వ్యూలో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా 500 కేసులు వేసినందుకు.. దాదాపు 25 కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టానని శ్రవణ్ పేర్కొన్నారు. వాస్తవానికి ఆ కేసులకు అంతస్థాయిలో డబ్బు ఎక్కడిది.. అంత డబ్బును శ్రావణ్ ఎలా సంపాదించగలిగారు అనే చర్చ కూడా నడిచింది.. మొత్తానికి వైసీపీ నేతలకు షాక్ ఇచ్చే విధంగా శ్రవణ్ వ్యాఖ్యలు చేయడంతో ఏపీ రాజకీయాలలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని విశ్లేషకులు అంటున్నారు.