TDP Mahanadu History: తెలుగుదేశం పార్టీకి పండుగ లాంటిది మహానాడు. అయితే ఈ వేడుకను ప్రారంభించింది మాత్రం నందమూరి తారక రామారావు. హైదరాబాదులో 1982లో పార్టీని ప్రకటించారు ఎన్టీఆర్. అలా ప్రకటించిన తొమ్మిది నెలల కాలంలోనే అధికారంలోకి రాగలిగారు. పార్టీ ప్రకటన హైదరాబాదులో చేసిన సమయంలోనే.. ప్రతి రెండేళ్లకు ఒకసారి మహానాడు ను జరుపుకుంటామని ప్రకటించారు. అయితే ఈ మహానాడు అనేది ఒక కార్యక్రమమా? పండుగ? అనేది తెలియలేదు పార్టీ శ్రేణులకు. అలాగని నందమూరి తారక రామారావును ప్రశ్నించే ధైర్యము ఎవరికీ లేదు. అయితే తొలిసారిగా గుంటూరులో శ్రీకృష్ణదేవరాయలు మున్సిపల్ మైదానంలో నిర్వహించిన మహానాడు నభూతో న భవిష్యత్ అన్నట్టు సాగింది. తెలుగుదేశం పార్టీ గమనాన్ని మార్చింది. ఆ పార్టీ పునాదులను మరింత పటిష్టం చేసింది. ఆ మహానాడులో అన్ని ప్రత్యేకమే. రాష్ట్రానికి అవసరమైన భవిష్యత్ కార్యాచరణ.. పార్టీ అభివృద్ధి.. పార్టీ శ్రేణులకు అతిధి మర్యాదలు.. ఇలా మహానాడులో అన్ని ప్రత్యేకమే.
* అందరి దృష్టి ఎన్టీఆర్ వైపే..
కాంగ్రెస్ పార్టీ కోటను బద్దలు కొట్టింది తెలుగుదేశం. పార్టీని ఏర్పాటు చేసిన అనతి కాలంలోనే విజయాన్ని అందుకున్నారు నందమూరి తారకరామారావు. జాతీయస్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించగలిగారు. ముఖ్యంగా కాంగ్రెస్ వ్యతిరేక శక్తులను కూడదియగలిగారు. ప్రాంతీయ పార్టీలకు ఒక దిక్సూచిగా తెలుగుదేశం పార్టీని తీర్చిదిద్దారు. అయితే ఏ వ్యక్తికైనా.. వ్యవస్థ కైనా క్రమశిక్షణ అవసరం. వ్యూహం అత్యంత కీలకం. భవిష్యత్ కార్యాచరణ అనేది అత్యంత ఆవశ్యం. దానిని తెలుగుదేశం పార్టీకి మహానాడు ద్వారా పరిచయం చేశారు. తన జన్మదినాన్ని పురస్కరించుకొని రెండు రోజులపాటు మహానాడు వేడుకను నిర్వహించడం ఆనవాయితీగా మార్చారు. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మహానాడు నిర్వహించాలని శాశ్వత తీర్మానం చేశారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు నుంచి గ్రామస్థాయి కార్యకర్త వరకు ఒకే వేదికపై తెచ్చేందుకు ఈ మహానాడు అనేది గొప్ప ఆయుధంగా మారింది తెలుగుదేశం పార్టీకి.
* అతిరథ మహారధులు హాజరు..
గెలుపు బాటతో జాతీయస్థాయిలో తెలుగుదేశం పార్టీ ఒక వెలుగు వెలిగింది ఆ సమయంలో. 1984లో గుంటూరులో తొలి మహానాడు జరిగింది. శ్రీకృష్ణదేవరాయలు మున్సిపల్ గ్రౌండ్లో మహానాడు నిర్వహణ అనేది ఒక ప్రత్యేకంగా నిలిచింది. చివరి రోజు టిడిపి శ్రేణులతో సాగిన భారీ ఊరేగింపు అనేది తెలుగుదేశం పార్టీ అభిమానుల గుండెల్లో నిలిచిపోయింది. నాడు దేశవ్యాప్తంగా అతిరథ మహారధులు మహానాడుకు హాజరయ్యారు. తెలుగుదేశం పార్టీకి అది పండుగ అయినా జాతీయస్థాయిలో కాంగ్రెస్ వ్యతిరేకులంతా క్యూ కట్టారు. అప్పట్లో జాతీయస్థాయిలో అగ్ర నేతలుగా ఉన్న ఎంజి రామచంద్రన్, బాబు జగ్జీవన్ రావ్, ఫరూక్ అబ్దుల్లా, హెచ్డి బహుగుణ, చండ్ర రాజేశ్వరరావు, ఎల్కే అద్వానీ, అటల్ బిహారీ వాజ్పేయి, రామకృష్ణ హెగ్డే, అజిత్ సింగ్, శరద్ పవర్, ఉన్ని కృష్ణన్, మేనకా గాంధీ తదితరులు హాజరయ్యారు. అంటే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకులంతా తొలి మహానాడుకు హాజరయ్యారు అన్నమాట.
* పసందైన వంటకాలతో..
ఎన్టీఆర్ భోజనప్రియలు. అందుకే తన పుట్టినరోజు నాడు నిర్వహిస్తున్న మహానాడుకు విచ్చేసి టిడిపి శ్రేణులకు పసందైన ఆహారాన్ని అందించడం ఆనవాయితీగా చేశారు. అదే ఆనవాయితీని కొనసాగించారు చంద్రబాబు. మహానాడు అంటే ముందుగా గుర్తొచ్చేది ఆహార మెనూ. పసందైన ఆంధ్ర వంటకాలతో.. మూడు ప్రాంతాల్లో ప్రముఖమైన ఆహారంతో.. మహానాడుకు హాజరయ్యే వారికి సంతృప్తిగా భోజనాలు పెట్టడం అనేది ఒక సంప్రదాయం. ప్రారంభ మహానాడులో టిడిపి నేతలు బస చేసేందుకు కుటీరాలను ఏర్పాటు చేశారు. కాలక్రమంలో మహానాడు ఏ నగరంలో నిర్వహిస్తే సమీపంలో హోటల్లు, ఫామ్ హౌస్ లతో టిడిపి శ్రేణులు నిండిపోయేవారు. అయితే ఈ ఏడాది ఖర్చు తగ్గించుకునేందుకు వీలుగా.. ప్రధాని సూచనల మేరకు హైబ్రిడ్ విధానంలో మహానాడుకు సిద్ధపడింది టిడిపి నాయకత్వం.
















జనసేన పై కులం ముద్ర.. తేల్చేసిన పవన్!
Janasena Party: పవన్ కళ్యాణ్ నిర్మోహమాటంగా చెప్పేశారు. పార్టీని సిద్ధాంత పరంగా నడుపుతానని.. ఇష్టం ఉన్నవారు ఉండండి.. లేకపోయినా వారు వెళ్ళిపొండి అంటూ స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. సోమవారం పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో మనసు విప్పి మాట్లాడారు. జనసేన ను ఒక ప్రాంతానికి, ఒక కులానికి ఆపాదించవద్దు అని తేల్చి చెప్పారు. అయితే ఈ వ్యాఖ్యల వెనుక పవన్ కళ్యాణ్ దృష్టికి చాలా అంశాలు వెళ్లినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా తెలిస్తే చాలు జనసేన అనేది కాపుల పార్టీగా ముద్ర వేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. జనసేన నేతలు కూడా అదే వైఖరితో ఉన్నారు. ఆ వైఖరి మూలంగా జనసేనతో పాటు పవన్ కళ్యాణ్ పై నమ్మకం ఉన్న ఇతర సామాజిక వర్గాలు సైతం సైడ్ అవుతున్నాయి. దానిని గుర్తించారు పవన్ కళ్యాణ్. అందుకే కులం అనే మాట వినిపించకుండా.. ఒక కులానికి మాత్రమే జనసేనను ఆపాదించకుండా చూడాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే నిన్న స్పష్టమైన ప్రకటన చేశారు.
* జనసేన చుట్టూ కథలు..
రాష్ట్రంలో కాపుల అంశంపై ఏది జరిగిన దానిని జనసేన చుట్టూ కథలు అల్లడం పరిపాటిగా మారింది. కేవలం పవన్ కళ్యాణ్ విషయంలో కాపుల వైఖరి మారినందునే ఇలా వారిని దూరం చేసేందుకు చాలా రకాల ప్రయత్నాలు జరిగాయి ఏపీలో. అయితే ఇదే జనసేన 2019 ఎన్నికల్లో ఉంది. అప్పుడు కూడా ఈ రాష్ట్రంలో కాపులు జనసేన వైపు కాకుండా వైసిపి వైపు చూశారు. ఆ పార్టీ వైఖరి నచ్చకపోవడం వల్లే కూటమి వైపు 2024 ఎన్నికల్లో టర్న్ అయ్యారు. అయితే ఇక్కడ కాపుల ముద్ర అనేది జనసేన వైపు వేయడం ప్రారంభించారు. కేవలం జనసేన ఎదగకుండా చేసేందుకు జరిగే ప్రయత్నం అది. అందులో భాగంగా ఇతర సామాజిక వర్గాలు జనసేన వైపు వెళ్లకుండా ఉండేందుకు వేసిన ఎత్తుగడ అది. దీనిని పవన్ కళ్యాణ్ గుర్తించారు కూడా. కులం మాటున జనసేన ను ఒక చట్రంలో పెట్టి ఎదగకుండా చేయాలి అనుకుంటే తాట తీస్తా అంటూ హెచ్చరించారు. అయితే ఈ హెచ్చరిక కేవలం రాజకీయ ప్రత్యర్థులకు మాత్రమే కాదు. జనసేనలో ఉండే నాయకులకు సైతం ఈ హెచ్చరిక అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నోరు తెరిస్తే చాలు కాపుల పేరుతో జనసేన పై రాజకీయం చేస్తున్నారు. గత పదేళ్ల కాలం పాటు దీనిని భరించారు పవన్ కళ్యాణ్. అందుకే ఆయనలో సహనం నశించి ఇప్పుడు గట్టిగానే బదులిస్తున్నారు.
* ఏది జరిగినా వివాదమే..
రాష్ట్రంలో కాపులకు ఏదైనా ఇబ్బంది కలిగితే జనసేనకు బాధ్యత లేదా అని ప్రశ్నిస్తున్న వారు ఉన్నారు. వివిధ రాజకీయ పార్టీల్లో ఉన్న కాపు నేతలు తప్పు చేస్తే దానిని సైతం తప్పుపడుతున్నారు. కేవలం జనసేన అంటే కాపుల పార్టీగా ముద్ర వేసే ప్రయత్నాలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. వాటన్నింటినీ గమనించిన పవన్ కళ్యాణ్ గట్టిగానే నిన్న సంకేతాలు పంపారు. తమిళనాడులో విజయ్ పార్టీ పెడితే అన్ని కులాలు మద్దతు తెలిపాయని.. ఇక్కడ మాత్రం అటువంటి పరిస్థితి లేదని ఆవేదనతో అన్నారు. జనసేన శ్రేణులు సైతం ఈ విషయంలో తప్పు చేయవద్దు అని.. లేనిపోని కుల ప్రస్తావనలు తీసుకురావద్దని సంకేతాలు పంపారు పవన్.