American policy impact on Pakistan passport: ఇరాన్ తో శాంతి చర్చల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అబ్రహం అకార్డ్స్ను మరింత విస్తరించాలని నిర్ణయించింది. ఈ మేరకు పలు దేశాలపై ఒత్తిడి తెస్తుంది. ముఖ్యంగా పాకిస్తాన్ పై తీవ్ర ఒత్తిడి ఉంది. ఈ నేపథ్యంలో, పాకిస్థాన్ పాస్పోర్ట్పై ముద్రించిన “ఇజ్రాయెల్ మినహా” నిబంధన మళ్లీ వైరల్ అవుతోంది. ఇది ఒక దేశ దీర్ఘకాలిక విదేశాంగ నీతి, భావోద్వేగాలు, సూత్రాల స్పష్టమైన ప్రతిబింబం.
ట్రంప్ ఒత్తిడి…
అబ్రహం అకార్డ్స్ ద్వారా యుఏఈ, బహ్రెయిన్ వంటి అరబ్ దేశాలు ఇజ్రాయెల్తో సంబంధాలు సాధారణీకరించాయి. ఇప్పుడు ట్రంప్ ఇరాన్ సంబంధిత ఒప్పందాల్లో భాగంగా పాకిస్తాన్ సహా మరిన్ని ముస్లిం దేశాలు ఈ ఫ్రేమ్వర్క్లో కచ్చితంగా చేరాలని చెబుతున్నారు. ఇది డిప్లొమాటిక్ గుర్తింపు మాత్రమే కాకుండా, వాణిజ్యం, సాంకేతిక సహకారం, భద్రతా సహకారం వంటి అనేక అవకాశాలను తెరుస్తుంది. కానీ పాకిస్తాన్ దీనిని తిరస్కరించింది. రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ “మా మూల సిద్ధాంతాలకు వ్యతిరేకం” అని చెప్పారు. పాలస్తీనా స్వతంత్ర రాజ్యం ఏర్పడే వరకు ఇజ్రాయెల్ను గుర్తించేది లేదని పునరుద్ఘాటించారు. విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ కూడా ఇదే స్టాండ్ను ప్రకటించారు
పాస్పోర్ట్ నిబంధన ఇలా..
పాకిస్తాన్ పాస్పోర్ట్లో స్పష్టంగా “This passport is valid for all countries of the world except Israel” అని ముద్రించి ఉంటుంది. ఇది పాలస్తీనా విషయంలో పాక్ అచంచలమైన సమర్థనకు చిహ్నం. ఇజ్రాయెల్తో సంబంధాలు సాధారణీకరిస్తే ఈ నిబంధన చట్టపరంగా, ఆచరణాత్మకంగా అసాధ్యం అవుతుంది. మార్పు జరిగితే కొత్త పాస్పోర్ట్ డిజైన్, ముద్రణ
లక్షలాది పాత పాస్పోర్టుల మార్పు లేదా అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఇది జాతీయ గుర్తింపు విధానపరమైన మార్పు.
మారడం కష్టం?
పాకిస్తాన్ స్టాండ్ చాలా లోతైనది. 1947 నుంచి పాలస్తీనా సమస్యను తన స్వంత సమస్యగా చూస్తోంది. క్వైద్-ఎ-ఆజం దృక్పథం నుంచి మొదలైన ఈ సమర్థన, ఇస్లామిక్ సాలిడారిటీ, ప్రజా భావోద్వేగాలు, ఇస్లామిస్ట్ రాజకీయ శక్తుల ఒత్తిడి — ఇవన్నీ కలిసి మార్పును కష్టతరం చేస్తున్నాయి. పర్వేజ్ ముషర్రఫ్ కాలంలో కొంత డైలాగ్ జరిగినా, ప్రజా వ్యతిరేకత, గాజా సంక్షోభం వంటి కారణాలతో అది ముందుకు సాగలేదు. ప్రస్తుతం కూడా ఖ్వాజా ఆసిఫ్ వంటి నాయకులు ఇజ్రాయెల్ను తీవ్రంగా విమర్శిస్తున్నారు. అయినప్పటికీ, ఆర్థిక ఒత్తిడులు, అమెరికా సహాయం, భద్రతా అవసరాలు భవిష్యత్తులో ఒత్తిడి పెంచవచ్చు. సౌదీ అరేబియా వంటి దేశాలు కూడా పాలస్తీనా పురోగతిని షరతుగా చెబుతున్నాయి.
పాకిస్తాన్ స్టాండ్ సూత్రబద్ధమైనది. భావోద్వేగపరంగా బలమైనది. కానీ రాజకీయాలు ఎప్పుడూ స్థిరంగా ఉండవు. భూ-రాజకీయాలు మారినప్పుడు, ఆర్థిక లాభాలు, భద్రతా అవసరాలు ఒక దేశాన్ని తన స్టాండ్ను పునరాలోచించేలా చేయవచ్చు. ప్రస్తుతం పాకిస్తాన్ “లేదు” అనే సందేశం ఇచ్చింది. పాస్పోర్ట్లోని ఆ నిబంధన ఇప్పటికీ బలంగా ఉంది. భవిష్యత్తులో మధ్యప్రాచ్యం ఎలా మారుతుందో, పాలస్తీనా సమస్య ఎలా పరిష్కారం అవుతుందో చూడాలి. కానీ ఈ క్షణం పాకిస్పాతాన్ తన సూత్రాలపైనే నిలబడుతోంది.
















నాదేండ్ల మనోహర్ వద్దని పవన్ పై అంత ఒత్తిడి చేశారా?!
Nadendla Manohar: జనసేనలో అధినేత పవన్ కళ్యాణ్ తర్వాత ప్రముఖంగా వినిపించే పేరు నాదేండ్ల మనోహర్. మెగా బ్రదర్ నాగబాబు ఉన్నా.. నాదేండ్ల మనోహర్ మాత్రం ఆ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు. అయితే ఆయన జనసేనలో చేరిక నుంచి రకరకాలుగా ప్రచారం నడుస్తూ వచ్చింది ఆయనది కమ్మ సామాజిక వర్గం కావడంతో పక్కన పెట్టుకోవద్దని.. గత చరిత్ర చూసుకోవాలని.. చంద్రబాబుకు ఆయన కొవర్టు అని ఇలా ఏదేదో ప్రచారం చేశారు. పవన్ కళ్యాణ్ కాపు నాయకుడి వెంట.. కమ్మ నాయకుడు అయిన నాదెండ్ల మనోహర్ కు ఎందుకంత ప్రాధాన్యత అని చాలామంది అప్పట్లో ప్రశ్నించారు. ఇదే విషయాన్ని తాజాగా చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. నాదెండ్ల మనోహర్ విషయంలో అనేక రకాల కామెంట్లు వచ్చాయని.. తనపై ఒత్తిడి పెరిగిందని.. కచ్చితంగా తాను నాదెండ్ల మనోహర్ ను పక్కన పెట్టుకొని పార్టీ నడుపుతానని తెల్చి చెప్పారు పవన్ కళ్యాణ్. అయితే అప్పట్లో పవన్ కళ్యాణ్ పై నాదేండ్ల మనోహర్ విషయంలో ఒత్తిడి తెచ్చింది ఎవరు అనేది మాత్రం బయట పెట్టలేదు. కానీ అప్పట్లో కాపు నాయకుల నుంచి నాదెండ్ల మనోహర్ విషయంలో ఒత్తిడి వచ్చిన విషయాన్ని మాత్రం ప్రస్తావించారు పవన్.
* సరిగ్గా ఎన్నికల ముంగిట..
2019 ఎన్నికల్లో జనసేన దారుణ పరాజయం చవిచూసింది. అయితే 2018 అక్టోబర్లో జనసేనలో చేరారు నాదెండ్ల మనోహర్. తెలుగుదేశం పార్టీలో ఒక వెలుగు వెలిగారు మనోహర్. తండ్రి నాదెండ్ల భాస్కరరావు వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన.. మనోహర్ 2004, 2009 ఎన్నికల్లో తెనాలి అసెంబ్లీ స్థానం నుంచి గెలిచారు. రాజశేఖర్ రెడ్డి మనోహర్ కు శాసనసభ స్పీకర్ గా అవకాశం ఇచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ వచ్చారు మనోహర్. అయితే పవన్ కళ్యాణ్ తో కలిసి నడిచేందుకు నిర్ణయించి ఆయనకు సమాచారమిచ్చారు. అందుకు పవన్ అంగీకరించడంతో 2018 అక్టోబర్ 12న జనసేనలో చేరారు నాదెండ్ల మనోహర్.
* పొలిటికల్ అడ్వైజరీ కమిటీ చైర్మన్గా..
అయితే జనసేనపై కాపు ముద్ర ఉంది. 2018లో నాదెండ్ల మనోహర్ చేరిన తర్వాత చాలామంది కాపు నేతలు విభేదించారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం నాదెండ్ల మనోహర్ విషయంలో వెనక్కి తగ్గలేదు. ఆయనకు కీలకమైన పొలిటికల్ అడ్వైజరీ కమిటీ లో స్థానం కల్పించారు. ఆ కమిటీకి చైర్మన్ చేసి తన తరువాత పార్టీలో నెంబర్ 2 పాత్రను కట్టబెట్టారు. అయితే ఇది కాపు నేతలకు ఎంత మాత్రం సహించలేదు. నాదెండ్ల మనోహర్ సామాజిక వర్గం తో పాటు ఆయన తండ్రి నాదెండ్ల భాస్కరరావు ఎపిసోడ్ ను గుర్తుచేస్తూ.. పవన్ కళ్యాణ్ నుంచి నాదెండ్ల మనోహర్ దూరం చేసే ప్రయత్నం చేశారు. కానీ వాటికి అవకాశం ఇవ్వలేదు పవన్. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పదవి కూడా కట్టబెట్టారు. అయితే చాలావరకు పవన్ కళ్యాణ్ తో నాదేండ్ల మనోహర్ జర్నీ ఎక్కువ రోజులు ఉండదని ఎక్కువ మంది విశ్లేషించారు. కానీ పవన్ నాయకత్వంలో మనోహర్ పనిచేస్తూనే ఉన్నారు. పవన్ సైతం నాదెండ్ల మనోహర్ ను పక్కన పెట్టుకునే రాజకీయం చేస్తానని ప్రకటించడం విశేషం.