కరోనా మహమ్మారి చాప కింద నీరులా శరవేగంగా వ్యాప్తి చెందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత పరిస్థితుల్లో జ్వరం వచ్చి మూడు రోజుల కంటే ఎక్కువ రోజులు ఉంటే తప్పనిసరిగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. జ్వరం ఐదు రోజుల కంటే ఎక్కువ రోజులు ఉంటే ప్రాణాలకే అపాయం ఏర్పడే అవకాశం ఉంది. కరోనా నిర్ధారణ అయిన మూడు రోజుల్లో చికిత్స చేయించుకుంటే స్టెరాయిడ్స్ ను వినియోగించకుండా కోలుకునే అవకాశం ఉంటుంది.
సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే మాత్రం ఆరోగ్యపరంగా తీవ్ర సమస్యలతో పాటు ప్రాణాలకే ముప్పు ఏర్పడే అవకాశాలు సైతం ఉంటాయి. ఆస్పత్రులలో చేరేవాళ్లలో ఎక్కువమంది 90 శాతం కంటే తక్కువ ఆక్సిజన్ శాచురేషన్ లెవెల్స్తో వస్తుండగా వీరిలో చాలామందికి ఆరోగ్యం వేగంగా క్షీణించడంతో పాటు వెంటిలేటర్ ను అమర్చాల్సిన పరిస్థితి ఏర్పడుతుండటం గమనార్హం.
సెకండ్ వేవ్లో మ్యుటేట్ అయిన వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. డయాబెటిక్, బీపీ, ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలున్న వారిపై వైరస్ తీవ్ర ప్రభావం చూపుతుండటం గమనార్హం. కరోనా సోకిన తర్వాత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారికే వైరస్ వల్ల ప్రమాదం ఏర్పడుతున్నట్టు తెలుస్తోంది. కుటుంబంలో ఒకరికి సోకితే మిగతా కుటుంబ సభ్యులందరికీ పాజిటివ్ నిర్ధారణ అవుతుండటం గమనార్హం.
దగ్గు, ఆయాసం వచ్చినా లేదా జ్వరం తగ్గకపోయినా వెంటనే డాక్టర్ ను సంప్రదించడం ఉత్తమం. బోర్లా పడుకోవడం లేదా పక్కకు తిరిగి పడుకోవడం వల్ల ఆక్సిజన్ లెవెల్స్ స్థిరంగా ఉంటాయి. ఐదోరోజు తర్వాత ఆర్టీపీసీఆర్ నెగెటివ్ వచ్చిన వారిలో జ్వరం కొనసాగుతూ ఉంటే సీటీ స్కాన్ తప్పనిసరిగా చేయించుకుంటే మంచిది.