Bus Travel Safety Tips: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ప్రయాణికుల భద్రతను అత్యంత ప్రాధాన్యతగా తీసుకుంటూ ‘బస్సులో భరోసా’ అనే వినూత్న భద్రతా వ్యవస్థను ప్రవేశపెట్టింది. ముఖ్యంగా మహిళా ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ వ్యవస్థ, ప్రజా రవాణాలో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో బస్సులో ప్రయాణించేవారు జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు. ఒకవేళ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వెంటనే తెలిసిపోతుందని చెబుతున్నారు. మరి ఈ కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించారంటే?
బస్సులో ప్రయాణించే వారి భద్రత దృష్ట్యా.. ముఖ్యంగా మహిళలను వేధింపుల నుంచి రక్షించేందుకు తెలంగాణ ఆర్టీసీ కొత్త భద్రతా వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో భాగంగా ప్రతి బస్సులో అత్యాధునిక సీసీటీవీ కెమెరాలను అమర్చాలని నిర్ణయించారు. ఇవి బస్సులోని ప్రతి అంగుళాన్ని స్పష్టంగా రికార్డ్ చేస్తాయి. బస్సులోకి ప్రవేశించే ఫుట్ బోర్డు దగ్గర నుంచి చివరి సీటు వరకు, కెమెరాల నిఘాలో ఉంటుంది. దీనివల్ల ప్రయాణికుల కదలికలు నిరంతరం కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షించబడతాయి.
తొలి దశలో భాగంగా, ఆదిలాబాద్ రీజియన్ పరిధిలోని 175 బస్సుల్లో ఈ అధునాతన కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో సక్సెస్ రేటును బట్టి, భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆర్టీసీ బస్సులకు ఈ వ్యవస్థను విస్తరించే అవకాశం ఉంది. ఈ ‘బస్సులో భరోసా’ కార్యక్రమం ద్వారా బస్సుల్లో జరిగే వేధింపులు, దొంగతనాలు మరియు అనుచిత ప్రవర్తనలను సమర్థవంతంగా అరికట్టవచ్చని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. ప్రయాణికులు, ముఖ్యంగా మహిళలు భయం లేకుండా సురక్షితంగా ప్రయాణించే వాతావరణాన్ని కల్పించడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశ్యం.
ఈ భద్రతా చర్యలు ప్రయాణికులకు మరింత భరోసానివ్వడమే కాకుండా, ఆర్టీసీ బస్సులపై ప్రజల్లో నమ్మకాన్ని రెట్టింపు చేస్తాయని రవాణా రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నిఘా వ్యవస్థ పటిష్టంగా ఉండటం వల్ల నేరస్థులు నేరాలకు పాల్పడటానికి వెనకడుగు వేసే అవకాశం ఉందని ఆర్టీసీ యాజమాన్యం పేర్కొంది.
