Andhra Pradesh weather : ఏపీలో విచిత్ర వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఒకవైపు వర్షాలు, మరోవైపు ఎండలు దంచి కొడుతున్నాయి. నైరుతి రుతుపవనాలు ప్రవేశించడంతో వాతావరణంలో మార్పులు కూడా సంతరించుకుంటున్నాయి. మధ్యాహ్నం వరకు ఎండ ఉండగా.. ఒక్కసారిగా ఆకాశం మేఘావృతం అయి వర్షాలు పడుతున్నాయి. ఈరోజు అల్లూరి సీతారామరాజు, పోలవరం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్య సాయి, కడప జిల్లాలకు వర్ష సూచన ఉంది. అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మిగిలిన జిల్లాల్లో కూడా తేలికపాటి వర్షాలు పడే సూచన ఉంది.
* ఈ జిల్లాలకు హెచ్చరిక..
మరోవైపు తీవ్ర వడ గాలులు సైతం కొనసాగుతున్నాయి. ఈరోజు 56 మండలాల్లో తీవ్ర, 67 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉంది. ప్రధానంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాలో 42 డిగ్రీల నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, చిత్తూరు, కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో 40 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్య ఛాన్స్ కనిపిస్తోంది. అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకు వెళ్ళొద్దని విపత్తుల నిర్వహణ సంస్థ సూచిస్తోంది.
* నైరుతి ఆగమనం..
ఏపీలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. రాయలసీమ లోని కొన్ని ప్రాంతాలకు తాకాయి. మరో రెండు రోజుల్లో రాష్ట్రమంతా విస్తరిస్తాయి. అయితే ఈసారి ఎల్ నినో ప్రభావంతో ఆశించిన స్థాయిలో వర్షాలు పడే అవకాశం లేదు. దీంతో రైతుల్లో ఒక రకమైన ఆందోళన ఉంది. ప్రధానంగా ఈసారి పోలవరం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ, మార్కాపురం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడప, శ్రీ సత్య సాయి, అన్నమయ్య జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షం పడొచ్చు అన్న అంచనాలు ఉన్నాయి. ఎన్టీఆర్, ఏలూరు, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు కావచ్చు. శ్రీకాకుళం,అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కృష్ణా జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది.
