AP Rainfall Deficit: ఏపీలో తీవ్ర వర్షాభావం నెలకొంది. కనీస స్థాయిలో కూడా వర్షాలు పడడం లేదు. ఆకాశం మేఘావృతం అవుతుందే తప్ప వరుణుడు మాత్రం దోబూచులాడుతున్నాడు. దీంతో ఏపీలో లోటు వర్షపాతం 35 శాతానికి పెరిగింది. మొత్తం 28 జిల్లాలకు గాను.. దాదాపు 20 జిల్లాల్లో అత్యల్ప వర్షపాతం నమోదైనట్లు భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. జూన్ 1 నుంచి జూలై 17 మధ్య సాధారణ వర్షపాతం 162.6 మిల్లీమీటర్లు కాగా.. రాష్ట్రంలో 106.3m వర్షపాతం మాత్రమే నమోదు అయినట్లు భారత వాతావరణ శాఖ చెబుతోంది.
* కోస్తాంధ్ర ప్రాంతానికి సంబంధించి గుంటూరు, పల్నాడు, విజయనగరం జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయింది.
* రాయలసీమకు సంబంధించి అనంతపురం, శ్రీ సత్య సాయి జిల్లాలో కూడా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయింది. అయితే ఈ జిల్లాలను మినహాయించి మిగతా జిల్లాల్లో అయితే భారీ లోటు వర్షపాతం నమోదు అయింది.
* పశ్చిమగోదావరి, అన్నమయ్య, యానం జిల్లాల్లో 60 శాతం లోటు వర్షపాతం నమోదు అయింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 50% కంటే ఎక్కువ లోటు నమోదయింది. తిరుపతి, కడప, బాపట్ల, తూర్పుగోదావరి, పార్వతీపురం మన్యం, ప్రకాశం జిల్లాల్లో 40% కంటే ఎక్కువ వర్షపాతం లోటు నమోదయింది. ఒక్క అనంతపురం జిల్లాలో మాత్రమే సాధారణ స్థాయికి సమానమైన 95.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.
* జూన్ 1 నుంచి జూలై 17 వరకు సాధారణ వర్షపాతం ఏపీలో 192.7 m కాగా.. 35 శాతం లోటుతో 126 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.
* రాయలసీమకు సంబంధించి సాధారణంగా కురవాల్సిన 119.9 మిల్లీమీటర్ల వర్షపాతానికి బదులు.. 83.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.
* జూలైలో ఋతుపవనాల వేగం మందగించింది. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల వరకు నమోదు అవుతున్నాయి. సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో వడగాలులు వీస్తున్నాయి. దీంతో ఈ ప్రభావం వర్షాలపై కూడా పడుతోంది. వాతావరణ శాఖ ముందుగా హెచ్చరించినట్లే.. ఎల్ నినో ప్రభావం స్పష్టంగా ఉంది.
