AP Rain Alert: ఏపీ వ్యాప్తంగా చల్లటి వాతావరణం కొనసాగుతోంది. అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి. కానీ పూర్తిస్థాయిలో మాత్రం కురవడం లేదు. ఇంకా వర్షపాతం లోటు కనిపిస్తోంది. ఇటువంటి సమయంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెదర్ అప్డేట్ ఇచ్చింది. నాలుగు జిల్లాల్లో మోస్తరు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వానలు పడతాయని తెలిపింది. అయితే భారీ వర్షాలు నమోదు కావడం లేదు. ఎల్ నినో ప్రభావం స్పష్టంగా ఉంది. ఖరీఫ్ అదును దాటుతుండడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇదే పరిస్థితి మరికొన్ని రోజులపాటు కొనసాగితే ఇబ్బందికర పరిస్థితులు తప్పేలా లేవు. అయితే నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండడంతో కొంత ఆశలు రేగుతున్నాయి.
* రుతుపవనాల ప్రభావం..
ఐదు రోజులపాటు నైరుతీ రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈరోజు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లో చెదురు మధురుగా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేస్తోంది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ కనిపిస్తోంది. పిడుగులు పడే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచిస్తున్నారు. రైతులతోపాటు పశువుల కాపర్లు జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేస్తున్నారు.
* ఎల్ నినో ప్రభావం..
ఏపీ పై ఎల్ నినో ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. కేవలం తేలికపాటి వర్షాలు తప్ప.. భారీ వర్షాలు నమోదు కావడం లేదు. నైరుతి రుతుపవనాలు సైతం ఆలస్యం అయ్యాయి. పెద్దగా ప్రభావం సైతం కనిపించడం లేదు. ఖరీఫ్ పంటలపై ప్రభావం కనిపిస్తోంది. ఈ ఏడాది ఇలానే కొనసాగితే కష్టం అని రైతుల్లో ఒక రకమైన ఆందోళన నెలకొంది. మరోవైపు ఎల్ నినో హెచ్చరికల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. ప్రత్యామ్నాయ పంటలను సూచించింది. రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ శాఖ అధికారులు ఈ పంటలపై సూచనలు అందిస్తున్నారు. ప్రధానంగా రాయలసీమ జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలో వర్షపాతం లోటు ఉంటుందని ముందుగానే అంచనా వేశారు. కానీ రైతులు ఆశలు పెట్టుకున్నారు. ఆకాశం మేఘావృతమై కనిపించినా.. వర్షాలు ఆశించిన స్థాయిలో కురవడం లేదు. ఇది కచ్చితంగా రైతులకు లోటు.
