Site icon OkTelugu

Andhra Pradesh Weather: ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల హెచ్చరిక!

Andhra Pradesh Weather

Andhra Pradesh Weather

Andhra Pradesh Weather: రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. ఆశించిన స్థాయిలో వర్షాలు పడటం లేదు. మరోవైపు ఎండ తీవ్రత, ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. జూలై మొదటి వారం గడుస్తున్న ఆశించిన స్థాయిలో వర్షాలు పడకపోవడంతో సర్వత్రా ఆందోళన ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో.. శుక్రవారం బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడనుంది. దీంతో వాతావరణం ఒక్కసారిగా మారనుంది. జూలై 4 నుంచి ఉత్తర కోస్తాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఐదో తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో వర్షాలు విస్తరించే ఛాన్స్ కనిపిస్తోంది. వర్షం జాడ లేకపోవడంతో ఈ ఏడాది ఖరీఫ్ ఫై ఆశలు వదులుకున్నారు రైతులు. వర్ష సూచన ఉందని తెలియడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

* ఆలస్యంగా రుతుపవనాలు..
ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా దేశంలో ప్రవేశించాయి. వాటి విస్తరణ కూడా మంద గమనంలో ఉన్నాయి. ఎల్ నినో ప్రభావం కూడా అధికంగా ఉంది. దీంతో వర్షాలు ఆశించిన స్థాయిలో పడడం లేదు. అయితే ఒడిస్సా, పశ్చిమ బెంగాల్ తీరాలకు ఆనుకొని ఈ అల్పపీడనం ఏర్పడనుంది. రాజస్థాన్ వైపు పయనించవచ్చని వాతావరణ నిపుణులు భావిస్తున్నారు. దీనివల్ల దేశంలోని మిగిలిన ప్రాంతాలకు కూడా రుతుపవనాలు వేగంగా విస్తరించే అవకాశం ఉంది. తూర్పు, మధ్య, ఉత్తర భారత దేశంలో వర్షాల జోరు బాగా పెరుగుతుందని కూడా అంచనా వేస్తున్నారు.

* ఉత్తరాంధ్రకు హెచ్చరిక..
ముఖ్యంగా ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన ఉంది. గురువారం రోజంతా ఆకాశం మేఘావృతం అయి ఉంటుందని వాతావరణ శాఖ చెబుతోంది. అదే సమయంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ గట్టి హెచ్చరికలు పంపింది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది . ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోంది. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కూడా అక్కడక్కడ జల్లులు కురిసే ఛాన్స్ కనిపిస్తోంది. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయి అని కూడా తెలుస్తోంది. మరోవైపు ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా వాతావరణం మారుతుంది. దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణం చల్లబడింది. గురువారం రాత్రి ఢిల్లీ ఎం సి ఆర్ పరిధిలో భారీ వర్షం కురవడంతో నగరవాసులు ఉపశమనం పొందారు . ఢిల్లీలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. ఇక్కడ వర్షాలు ఈదురు గాలులు వీచే అవకాశం ఉండడంతో భారత వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది.

Exit mobile version