మున్సి‘పోల్‌’కు ముందే పరిషత్‌ పోరు..: జగన్‌ ఆలోచన అదేనా..?

ఏపీలో నాలుగు విడతల్లో ఇప్పటికే పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. ఇక ముందు పరిషత్‌, మున్సిపల్‌ ఎన్నికలు ఉన్నాయి. అయితే.. ఇప్పుడు స్థానిక ఎన్నికల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే రీ షెడ్యూల్‌ చేసిన మున్సిపల్ ఎన్నికలు సకాలంలో జరగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ.. ఇప్పుడు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను తెరపైకి తీసుకురావాలని వైసీపీ సర్కారు భావిస్తోంది. నిన్న సీఎం జగన్‌ కేబినెట్‌ మీటింగ్‌ నిర్వహించారు. ఈ మీటింగ్‌లోనూ ఆయన ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ముందుగా […]

Written By: Srinivas, Updated On : February 24, 2021 2:34 pm
Follow us on


ఏపీలో నాలుగు విడతల్లో ఇప్పటికే పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. ఇక ముందు పరిషత్‌, మున్సిపల్‌ ఎన్నికలు ఉన్నాయి. అయితే.. ఇప్పుడు స్థానిక ఎన్నికల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే రీ షెడ్యూల్‌ చేసిన మున్సిపల్ ఎన్నికలు సకాలంలో జరగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ.. ఇప్పుడు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను తెరపైకి తీసుకురావాలని వైసీపీ సర్కారు భావిస్తోంది. నిన్న సీఎం జగన్‌ కేబినెట్‌ మీటింగ్‌ నిర్వహించారు. ఈ మీటింగ్‌లోనూ ఆయన ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ముందుగా పరిషత్‌ పోరు నిర్వహించాలని ఎస్ఈసీని కోరుదామని మంత్రులతో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నాయి.

Also Read: టీఆర్‌‌ఎస్‌పై బీజేపీ సీబీఐ అస్త్రం

ఏపీలో కరోనా కారణంగా గతేడాది మున్సిపల్‌ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఆ ఎన్నికలను తిరిగి మార్చి 2 నుంచి నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే షెడ్యూల్‌ ప్రకటించించి. అయితే.. మున్సిపల్ ఎన్నికలు ఆగిన చోట నుంచే మొదలు పెట్టాలని ఎస్ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో ఇప్పటికే పలువురు అభ్యర్థులు పిటిషన్లు వేశారు. దీనిపై ఇవాళ తీర్పు వెలువడాల్సి ఉంది. మరోవైపు మున్సిపల్ ఎన్నికల కోసం పరిగణనలోకి తీసుకున్న ఓటర్ల జాబితాపైనా పలు అభ్యంతరాలు ఉన్నాయి. ప్రభుత్వం వైపు నుంచి కూడా కొన్ని అభ్యంతరాలు నెలకొన్నాయి.

దీంతో మార్చి 2 నుంచి మున్సిపల్‌ ఎన్నికలు తిరిగి ప్రారంభం కావడం అసాధ్యం అనిపిస్తోంది. మున్సిపల్‌ ఎన్నికల విషయంలో నెలకొన్న అభ్యంతరాలు, రాష్ట్రంలో ఎన్నికల కారణంగా వ్యాక్సినేషన్‌ నానాటికీ ఆలస్యమవుతున్న పరిస్థితుల్లో ముందుగా పరిషత్‌ పోరును ముగించేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన ప్రభుత్వంలో కనిపిస్తోంది. ఇదే విషయాన్ని సీఎం జగన్ నిన్న కేబినెట్‌ భేటీ సందర్భంగా మంత్రులకు చెప్పారు. మున్సిపల్‌ ఎన్నికల కంటే ముందుగా పరిషత్‌ పోరుకే వెళ్దామని సంకేతాలు ఇచ్చారు.

Also Read: ఉన్నట్టుండి జగన్‌కు అమరావతిపై ప్రేమెందుకు పుట్టుకొచ్చినట్లు..?

మొత్తంగా ఇప్పుడు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను బట్టి చూస్తుంటే మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. దీనికంటే ముందే పరిషత్‌ ఎన్నికలు నిర్వహిస్తే, కోర్టు కేసులు, ఇతరత్రా సమస్యలను బట్టి మున్సిపల్‌ ఎన్నికలు ఆ తర్వాత నిర్వహించవచ్చని ఎస్ఈసీ నిమ్మగడ్డకు ప్రతిపాదించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో మున్సిపల్‌ ఎన్నికల కంటే ముందే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పెట్టేయాలని ఎస్ఈసీని కోరదామని సీఎం జగన్‌ మంత్రులకు సూచించారు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్