AP Womens Day schemes: ఏపీలో( Andhra Pradesh) మహిళలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది కూటమి ప్రభుత్వం. వారికోసం ప్రత్యేక సంక్షేమ పథకాలను అమలు చేయనుంది. ఇప్పటికే ప్రతి పథకం మహిళలకే అన్నట్టు ఉంది. అయితే మహిళా దినోత్సవం సందర్భంగా ఈనెల 8న మూడు కీలక పథకాలను ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ మూడు పథకాలు అమల్లోకి తెచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇందులో రెండు పథకాలకు ఎన్టీఆర్ పేరే పెట్టారు. మరో పథకాన్ని మాత్రం నేరుగా అమలు చేయబోతున్నారు. ఈ పథకాల విషయంలో యంత్రాంగం కసరత్తు చేస్తోంది. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ మూడు పథకాలకు శ్రీకారం చుట్టనుంది ఏపీలోని కూటమి ప్రభుత్వం.
పిల్లల చదువులకు..
ఏపీ ప్రభుత్వం ఎన్టీఆర్ విద్యాలక్ష్మి( NTR vidyalakshmi ), కళ్యాణ లక్ష్మి పథకాలను ప్రారంభించనుంది. డ్వాక్రా సంఘాల్లో సభ్యులకు ఈ పథకాలు వర్తించనున్నాయి. ఇందులో ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం పిల్లల చదువుల కోసం తెస్తున్నది. డ్వాక్రా సంఘాల్లో కనీసం 6 నెలలు సభ్యులుగా ఉన్న మహిళలు దీనికి అర్హులు. ఇంట్లో ఇద్దరు పిల్లల చదువు కోసం 10 వేల నుంచి గరిష్టంగా లక్ష వరకు రుణం లభిస్తుంది. దీనికి వడ్డీ పావలా మాత్రమే. అంటే సంవత్సరానికి 40 శాతం ఉంటుంది. రుణాన్ని 48 నెలల్లో సులభ వాయిదాలలో చెల్లించవచ్చు. అవసరమైన పత్రాలుగా ఆధార్ కార్డ్, ఆదాయా లేదా డొమిసైల్ సర్టిఫికెట్, పాఠశాల లేదా కాలేజీ అడ్మిషన్ లెటర్, ఫీజు చెల్లింపు వివరాలు లేదా రసీదులు అవసరం. బయోమెట్రిక్ వెరిఫికేషన్ తప్పనిసరిగా ఉంటుంది. దరఖాస్తు తరువాత 48 గంటల్లో స్త్రీ నిధి బ్యాంక్ అకౌంట్ లో నగదు జమ అవుతుంది.
Also Read: ఏపీలో మహిళలకు గుడ్ న్యూస్.. 5 వేల ఉద్యోగాలు!
పిల్లల వివాహాలకు..
ఎన్టీఆర్ కల్యాణ లక్ష్మి( NTR Kalyana Lakshmi) పథకానికి సంబంధించి పేద కుటుంబంలో కూతురు పెళ్లికి సంబంధించినది. దీనికి డ్వాక్రా సంఘంలో కనీసం 6 నెలల సభ్యత్వం అవసరం. వివాహ ఖర్చు నిమిత్తం 10 వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు రుణం పొందవచ్చు. కేవలం పావలా వడ్డీ మాత్రమే ఉంటుంది. 48 నెలల్లో సులభ వాయిదా పద్ధతుల్లో చెల్లింపు చేయవచ్చు. ఆధార్ కార్డు లేదా వివాహ ఆహ్వాన పత్రిక, వివాహ ఖర్చుల అంచనా లేదా సంబంధిత డాక్యుమెంట్లు అవసరం. బయోమెట్రిక్ వెరిఫికేషన్ తప్పనిసరి. అన్ని దరఖాస్తుల ప్రక్రియ పూర్తయిన తర్వాత.. అర్హులైతే 48 గంటల వ్యవధిలో అకౌంట్లో నగదు జమ అవుతుంది. అయితే సంబంధిత లబ్ధిదారు అకాల మరణం చెందితే మాత్రం రుణం రద్దు అయ్యే ఛాన్స్ ఉంటుంది.
స్మార్ట్ ఫోన్లు..
మరోవైపు డ్వాక్రా సంఘాల నిర్వహణను చూస్తే కమ్యూనిటీ కోఆర్డినేటర్లకు( community coordinators ), యానిమేటర్లకు 15 వేల రూపాయల విలువచేసే స్మార్ట్ ఫోన్ అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఓ 600 మంది ఏపీఎంలకు లాప్ టాప్ లు అందజేయనుంది. గతంలో ఇచ్చిన ఫోన్లు పనిచేయకపోవడంతో.. కొత్తగా అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మూడు పథకాలను ఈనెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అమలు చేయనున్నారు.