యడ్యూరప్ప బలంతోనే బీజేపీ కర్ణాటకలో అధికారంలోకి రాగలిగింది. కొత్తగా వచ్చే నేతలో కూడా ఈ లక్షణాలు ఉండాలని కోరుకుంటారు. కానీ అంతటి బలమైన నేత దొరకడం కష్టమే. దీంతో సీఎం వ్యవహారం రసకందాయంలో పడింది. యడ్యూరప్ప కన్నా మంచి నేత కావాలని బీజేపీ భావిస్తోంది. ఇందులో భాగంగా యడ్యూరప్ప వారసుడి కోసం వెతుకులాడుతోంది.
2019 ఎన్నికల తరువాతే ఆయనకు దీటైన నేత కోసం గాలించినా దొరకలేదు. దీంతో ఆయననే కొనసాగించారు. ఆయకు వయస్సు మీరడంతోనే పదవి నుంచి తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కర్ణాటకలో ముఖ్యమంత్రి రేసులో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, సీటీ రవి, మురుగేశ్ నిరాణి, సీఎన్ అశ్వథ్థ నారాయణ పేర్లు వినిపిస్తున్నాయి.
వీరిలో మురుగేశ్ నిరాణి యడ్యూరప్ప సామాజిక వర్గానికి చెందిన లింగాయత్. దీంతో సీనియార్టీకి పట్టం కడతారా? లేక సామాజిక వర్గానికి పెద్ద పీట వేస్తారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే నేతలందరూ ఢిల్లీలో మకాం వేసి లాబీయింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో యడ్యూరప్ప వారసులెవరనేదానిపై అందరిలో ఉత్కంఠ నెలకొంది.