Israel: ఇజ్రాయెల్.. దీని రక్షణ ఛత్రం ఎంత బలమైనదంటే..

తన అంతర్గత భద్రతకు ఏమాత్రం ముప్పు వాటిల్లినా ఇజ్రాయెల్ ఉపేక్షించదు. ప్రపంచంలో ఏ మూలన తన శత్రువు దాక్కుని ఉన్నా వెంటాడి, వేటాడి చంపేస్తుంది. తన అంతర్గత భద్రతకు ఇజ్రాయెల్ పెద్దపీట వేస్తుంది.

Written By: Bhaskar, Updated On : July 7, 2023 2:34 pm

Israel

Follow us on

Israel: శత్రువు ఏ రూపంలో ఉన్న ప్రమాదమే. ఎక్కడ తల దాచుకున్నా ఇబ్బందే. ఈ సువిశాల ప్రపంచంలో ఎక్కడ శత్రువు మూలాలు ఉన్న భవిష్యత్తు కాలంలో కష్టమే. ఇలాంటప్పుడు శత్రువును మట్టు పెట్టడం పెద్ద టాస్క్. అక్కడిదాకా ఎందుకు అమెరికా వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద ఆత్మహుతి దళాలతో దాడులు జరిపించిన లాడెన్ ను పట్టుకునేందుకు ఆగరాజ్యానికి దాదాపు పుష్కర కాలం పట్టింది. అతడిని అంతమొందించేందుకు ఏకంగా నలుగురు అధ్యక్షులు మారారు. ప్రపంచంలోనే అత్యంత పటిష్టమైన రక్షణ వ్యవస్థ కలిగి ఉన్న అమెరికాకు సమయం పట్టడం నిజంగా ఆశ్చర్యకరమే. కానీ ఆ స్థానంలో ఇజ్రాయెల్ గనుక ఉండి ఉంటే లాడెన్ ఎప్పుడో కాలం చేసి ఉండేవాడు.. అమెరికాతో పోల్చితే వైశాల్యంలో చాలా చిన్న దేశమైనప్పటికీ.. రక్షణ రంగం విషయంలో మాత్రం ఇజ్రాయెల్ చాలా పటిష్టమైన దేశం.

తన అంతర్గత భద్రతకు ఏమాత్రం ముప్పు వాటిల్లినా ఇజ్రాయెల్ ఉపేక్షించదు. ప్రపంచంలో ఏ మూలన తన శత్రువు దాక్కుని ఉన్నా వెంటాడి, వేటాడి చంపేస్తుంది. తన అంతర్గత భద్రతకు ఇజ్రాయెల్ పెద్దపీట వేస్తుంది. తన పౌరులకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడంలో రాజీ పడదు..ఇదే సమయంలో అత్యాధునిక ఆయుధాలను తయారు చేయడంలోనూ వెనుకడుగు వేయదు. అందుకే ప్రపంచ పటంలో ఆర్థికంగా, జనాభాపరంగా ఎన్నో దేశాలు ముందు వరుసలో ఉన్నప్పటికీ.. రక్షణ రంగం విషయానికి వచ్చేసరికి అవన్నీ కూడా ఇజ్రాయెల్ తర్వాతే. చివరికి అంతటి శక్తివంతమైన అమెరికా కూడా వెనుక వరుసలోనే. సైనిక పరివారాన్ని ఎప్పటికప్పుడు ఆధునికరించడంలో ఇజ్రాయెల్ ముందుంటుంది. అందుకే ఆధునికమైన ఆయుధాలను ప్రపంచవ్యాప్తంగా అది ఎగుమతి చేస్తుంది.

రక్షణ పరంగా ఎంతో శక్తివంతమైన ఇజ్రాయెల్ కు పాలస్తీనా దేశంతో సరిహద్దుల్లో గొడవలు ఉన్నాయి. ఇవి గత రెండు దశాబ్దాల కాలం నుంచి కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల తమ దేశానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారనే సాకుతో జెనిన్ నగరం పై ఇజ్రాయెల్ డ్రోన్ దాడి జరిపింది. ఈ దాడిలో పాలస్తీనాకు చెందిన మిలిటెంట్లు ఎనిమిది మంది చనిపోయారు.. ఇజ్రాయెల్ కు చెందిన ఒక పౌరుడు కూడా మృతి చెందాడు. రద్దీగా ఉన్న శరణార్థి శిబిరంలో ఉన్న తీవ్రవాదులకు, ఇజ్రాయెల్ దళాలకు మధ్య ఘర్షణలు జరిగాయి. ఇద్దరి మధ్య తీవ్రంగా కాల్పులు జరిగాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులను మట్టు పెట్టేందుకు 14,000 మంది దాకా ఉన్న శరణార్థి శిబిరాలపై ఇజ్రాయెల్ ఆరు డ్రోన్లతో దాడులు జరిపింది.

ఇజ్రాయెల్ సైన్యం జెనిన్ శిబిరంపై దాడి చేసేందుకు పక్కా ప్రణాళిక రూపొందించింది. సాయుధ వాహనాలు శరణార్థ శిబిరాలను చుట్టుముట్టాయి. ఒక్కసారిగా బాంబులు విసిరాయి. దీంతో ఆ ప్రాంతంలోని రోడ్లు మొత్తం ధ్వంసమయ్యాయి. ఈ దాడులను బట్టి ఇజ్రాయెల్ సైన్యం తన దేశం జోలికి వస్తే ఇలాంటి పరిణామాలు చవిచూడాల్సి వస్తుందని పాలస్తీ నాకు హెచ్చరికలు పంపింది. కాగా ఈ దాడులను లెబనాన్ వంటి దేశాలు వ్యతిరేకిస్తున్నప్పటికీ.. ఇజ్రాయెల్ దూకుడుగానే ముందుకు వెళ్తోంది.