
ఏపీలో సొంతింటి కల నెరవేర్చడానికి సీఎం జగన్ కృషి చేస్తున్నారు. రాష్ర్ట వ్యాప్తంగా 17 వేల వైఎస్సార్ జగనన్నకాలనీలు రాబోతున్నాయని పేర్కొన్నారు. త్వరలో ఇళ్ల నిర్మాణాలు ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. తాడేపల్లి సీఎం క్యాంపు ఆఫీసు నుంచి వర్చువల్ విధానంలో ఆయన మొదటి దశను ప్రారంభించారు. నవరత్నాలు పథకంలో భాగంగా పేదలందరికి ఇళ్లు కార్యక్రమంలో భాగంగా 2023 జూన్ నాటికి ప్రభుత్వం రెండు దశల్లో 28,30,227పక్కా గృహాలు రూ.50,994 కోట్లతో నిర్మించాలని భావించారు. రెండు దశల్లో కలిపి 30 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది.
తొలిదశలో రూ.28,084 కోట్లు. రెండో దశలో రూ.22,860 కోట్ల వ్యయంతో పక్కా గృహాలను నిర్మించనున్నారు. తొలిదశను జూన్ 2022 నాటికి పూర్తి చేస్తామన్నారు. రెండో దశను అప్పుడే ప్రారంభిస్తామని చెప్పారు. 8,900 లే అవుట్లలో 11 లక్షల 26 వేల ఇళ్ల నిర్మాణాలను ఇవాళ శ్రీకారం చుట్టారు. ఇళ్ల స్థలాలు ఉన్న 4.33 లక్షల మందికి ఇళ్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు.
జగనన్న కాలనీలో రూ.4,128 కోట్ల వ్యయంతో తాగునీరు అందజేస్తారు. రూ.22,587 కోట్లతో కాలనీల్లో అండర్ గ్రౌండ్ మురుగు కాలువలు,సీసీ రోడ్లు నిర్మిస్తారు. కాలనీల్లో అధునాతన సదుపాయాలు కల్పించనున్నారు. ఇళ్లనిర్మాణం ద్వారా రాష్ర్టంలో ఆర్థికపరిస్థితి మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇళ్ల నిర్మాణం వల్లకూలీలకు పెద్ద సంఖ్యలో పని దినాలు ఉపాధి కల్పించే అవకాశం లభిస్తుంది. 30 రకాల పనులకు సంబంధించిన వారికి పని దొరుకుతుంది. నిర్మాణాలకు సమీపంలోని ఇసుకరీచ్ ల నుంచి ఉచితంగా ఇసుక అందేలా ఏర్పాట్లు చేశారు. ఒక్కో ఇంటికి ప్రభుత్వం రూ.1.80 లక్షలు ఖర్చు చేస్తుంది. అర్హులు ఎవరైనా లబ్ధిదారుల జాబితాలో లేకపోతే ఆందోళన చెందవద్దు.
మూడు విభాగాలుగా గృహ నిర్మాణ పథకం అమలుచేస్తున్న ప్రభుత్వం ఐచ్చికాల ఎంపికకు లబ్ధిదారులకే వదిలేసింది. సొంతంగా ఇళ్లు కట్టుకునే స్తోమత లేని వారికి ప్రభుత్వమే నిర్మించి ఇస్తుంది. ప్రతి ఇంటిని 340 చదరపు అడుగుల పరిధిలో నిర్మించనుంది. ప్రతి ఇంటికి రెండు ఫ్యాన్లు,రెండు ట్యూబ్ లైట్లు, నాలుగు బల్బులు, ఒక సింటెక్స్ ట్యాంకు ఉంటాయి.