Roja: రాజకీయాల్లోకి వచ్చాక నాయకులు మడత పేచి వేస్తారని అంతా అంటారు. ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి రోజా అలానే మడత పేచీ వేశారు. తమిళనాడు ఎన్నికల్లో విజయ్ గెలుపు అనేది ఆవిడకు ఆనందాన్ని ఇచ్చిందట. అది గొప్ప విజయం అట. జగన్మోహన్ రెడ్డి తో స్నేహం వల్లే అది సాధ్యమైందట. తమిళనాడు ఎన్నికల ఫలితాలపై ఆమె స్పందన కోరగా చెప్పిన మాటలు ఇవి. గత నెల 21 వరకు ఆమె తమిళనాడు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. డీఎంకే కు మద్దతుగా ప్రచారం చేశారు. జగన్మోహన్ రెడ్డి మాదిరిగానే స్టాలిన్ పాలిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇప్పుడు అదే రోజా జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ తో విజయ్ గెలిచారు అని చెప్పడం.. కాస్త ఎబ్బెట్టుగా ఉంది. అయితే ఇప్పటికే రోజా తీరుపై డిఎంకె శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశాయి. ఆమె వల్లే డీఎంకే ఓడిపోయింది అంటూ పోస్టర్లు తగలబెడుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
* రోజా ఫై ట్రోల్స్..
తమిళనాడు ఎన్నికల ఫలితాలు వచ్చిన నాటి నుంచి రోజా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నారు. ఆమె డీఎంకేకు మద్దతుగా చేసిన ప్రచార వీడియోలు జతచేస్తూ.. నెటిజెన్లు వీర విహారం చేస్తున్నారు. సోషల్ మీడియాలో మీమ్స్ దద్దరిల్లాయి కూడా. ఐరన్ లెగ్ ముద్ర తో రోజాపై ఎక్కువ మంది విరుచుకుపడిన వారు ఉన్నారు. ఆమె ప్రచారం తోనే డీఎంకేకు ఇన్ని ఇబ్బందులు వచ్చాయి అంటూ ఆవేదన వ్యక్తం చేసిన వారు ఉన్నారు. నిన్న రోజంతా ఒకటే రోజాపై ప్రచారం. అయితే వైసిపి మాత్రం విజయ్ తో జగన్మోహన్ రెడ్డి ఉన్న ఫోటోను జతచేస్తూ ఎలివేషన్ ఇచ్చింది కానీ.. రోజా విషయంలో మాత్రం ఏం మాట్లాడకుండా వినకుండా ఉండిపోయింది.
* ఓ ఛానల్ కు అందుబాటులోకి..
రోజా ఎక్కడ అంటూ నిన్న సోషల్ మీడియాలో ఎక్కువమంది ప్రశ్నించారు. ఈ తరుణంలో ఓ మీడియా ఛానల్ నుంచి ఆమెకు ఫోన్ వెళ్ళింది. విజయ్ విజయం గురించి అడగగా.. మాస్ తో పాటు క్లాస్ ప్రజలు కూడా విజయ్ ను ఆదరించాలని విశ్లేషించారు రోజా. డీఎంకేకు ఎగ్జిట్ పోల్స్ అన్ని అనుకూల ఫలితాలు ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. తమిళ రాజకీయాల్లో తనకు ప్రత్యేక ఆహ్వానాలు గతం నుంచి అందాయని చెప్పుకొచ్చారు. జయలలిత కూడా తనను పిలిచిన విషయాన్ని చెప్పుకొచ్చారు. కానీ డీఎంకే వాడిపోతుందని తాను ఊహించలేదని కూడా వాపోయారు. ఇంత బాధలో కూడా విజయ్ విజయాన్ని జగన్ ఖాతాలో వేసే ప్రయత్నం చేశారు రోజా. అయితే తన వల్లే డీఎంకే ఓడిపోయిందన్న ప్రచారంపై మాత్రం స్పందించలేదు. ప్రస్తుతం రోజా కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.