ఢిల్లీ ఆస్పత్రుల్లో పరిస్థితి అత్యంత దారుణంగా ఉన్నట్లు సుప్రీంకోర్టు పేర్కొన్నది. ప్రభుత్వ హాస్పిటళ్లు సరైన రీతిలో స్పందించడం లేదని సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. రోగులు వ్యాధులతో ఇబ్బందిపడుతున్నారని, వారికి చికిత్స చేసే వారు కరువైనట్లు కోర్టు చెప్పింది. ఒకవేళ ఇదే రకమైన చికిత్స కొనసాగితే, హాస్పిటళ్లలో బెడ్స్ ఖాళీగా ఉండిపోతాయని కోర్టు పేర్కొన్నది. మృతదేహాల పట్ల ఎటువంటి మర్యాద ఇవ్వడం లేదని కోర్టు చెప్పింది. ఢిల్లీలో ఎందుకు వైరస్ టెస్టింగ్ ను తగ్గించారని కోర్టు ప్రశ్నించింది. ముంబైతో పాటు ఇతర నగరాల్లో టెస్టింగ్ పెరిగిందని, కానీ ఢిల్లీలో ఎందుకు టెస్టింగ్ తగ్గిందని కోర్టు నిలదీసింది.
మృతదేహాల పట్ల ఢిల్లీ హాస్పిటళ్లు వ్యవహరిస్తున్న తీరును సుప్రీంకోర్టు తీవ్రంగా ఖండించింది. మరణించిన వారి బంధువులకు కూడా ఎటువంటి సమాచారం ఇవ్వడంలేదని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కొన్ని సందర్భాల్లో కొన్ని కుటుంబాలు కనీసం తమ బంధువుల చివరి చూపును కూడా నోచుకోవడం లేదంటూ కోర్టు పేర్కొన్నది. కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఆదేశాలను హాస్పిటళ్లు బేఖాతరు చేస్తున్నాయని కోర్టు ఆవేదన వ్యక్తం చేసింది.