Karnataka New CM: అధికారంలోకి రాకముందు కుర్చీల కోసం కొట్లాట.. అధికారం వచ్చిన తర్వాత పదవుల కోసం కొట్లాట.. కాంగ్రెస్ పార్టీలో రాజకీయాల గురించి ఢిల్లీకి సర్కిల్స్ ప్రాంతంలో బాగా పేరుపొందిన సామెత ఇది. ఈ సామెత సంవత్సరాల కాలం నాటిదైనప్పటికీ.. ఇప్పటికీ కొనసాగుతూనే ఉందంటే కాంగ్రెస్ పార్టీలో రాజకీయాలు ఏ స్థాయిలో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. దేశమంతా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాలలో మాత్రం అనుకూలమైన వాతావరణం కొనసాగుతోంది. దక్షిణాది రాష్ట్రాలలో కేరళ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. తమిళనాడులో అధికార పార్టీలో భాగస్వామ్య పక్షంగా ఉంది.
ఉన్న అధికారాన్ని సుస్థిరం చేసుకొని.. దేశవ్యాప్తంగా అధికారాన్ని దక్కించుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ చేయాల్సి ఉండగా.. దక్షిణాది రాష్ట్రాలలో అందుకు భిన్నంగా సాగుతోంది. ముఖ్యంగా పదవుల కోసం నాయకుల మధ్య జరుగుతున్న పోరాటాలు ప్రజల్లో చులకన భావాన్ని కలిగిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ప్రధానమైన కన్నడ సీమలో ప్రస్తుతం సీఎం మారతారు అనే చర్చ నడుస్తోంది. ముఖ్యమంత్రిగా ఉన్న సిద్ధరామయ్య గురువారం రాజీనామా చేస్తారని వార్తలు వస్తున్నాయి.. కొత్త ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ఈనెల 30న ప్రమాణస్వీకారం చేస్తారని కూడా తెలుస్తోంది.
ముఖ్యమంత్రి స్థానం కోసం శివకుమార్ మధ్య.. సిద్ధరామయ్య మధ్య పోటీ ఎప్పటినుంచో సాగుతూనే ఉంది. ఇద్దరు కూడా బలమైన నాయకులు కావడంతో ఎవరి మనసు నొప్పించకుండా ఉండేందుకు అధిష్టానం నాయకత్వ మార్పు ప్రక్రియను చేపడుతున్నట్లు తెలుస్తోంది.. గతంలో సీఎం స్థానం కోసం శివకుమార్ అనేక రకాలుగా ప్రయత్నాలు చేశారు. ఈ పంచాయతీ ఢిల్లీ దాకా కూడా వెళ్ళింది. అధిష్టానం మధ్యలో జోక్యం చేసుకోవడంతో శివకుమార్ కాస్త వెనక్కి తగ్గారు. అప్పట్లోనే అధిష్టానం శివకుమార్ కు కొంత వ్యవధి ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఆ వ్యవధి ముగిసిపోవడం శివకుమార్ అధిష్టానం ముందు ప్రస్తావించినట్టు తెలుస్తోంది. నీతో నాయకత్వ మార్పుకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
అధిష్టానం చెప్పినట్టు సిద్ధరామయ్య నడుచుకుంటారని కర్ణాటక మీడియాలో వార్తలు వస్తున్నాయి. గురువారం సిద్ధరామయ్య తన మంత్రివర్గంలో ఉన్న వ్యక్తులకు అల్పాహార విందు ఇస్తారని.. ఆ తర్వాత లోక్ భవన్ కు వెళ్లి గవర్నర్ కు రాజీనామా పత్రం సమర్పిస్తారని తెలుస్తోంది.. గురువారం ఉదయాన్నే ఢిల్లీ నుంచి సిద్ధరామయ్య ఇంటికి వస్తారని.. ఆ తర్వాత వారిద్దరూ మీడియాతో మాట్లాడే అవకాశం ఉందని తెలుస్తోంది.
ముఖ్యమంత్రి రేసులో ఉన్న వ్యక్తులలో డీకే శివకుమార్ తో పాటు పరమేశ్వర పేరు కూడా వినిపిస్తోంది. మరోవైపు తాను రాజీనామా చేసిన తర్వాత.. కర్ణాటక రాష్ట్రంలో బలంగా ఉన్న అహీంద వర్గాలకే ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టాలని సిద్ధరామయ్య చెప్పినట్టు తెలుస్తుంది. ఒకవేళ దీనికి గనక అధిష్టానం ఓకే చెబితే అప్పుడు పరమేశ్వర ముఖ్యమంత్రి అవుతారు. పరమేశ్వర ప్రస్తుతం హోం మంత్రిగా ఉన్నారు. ఈయన దళిత సామాజిక వర్గానికి చెందినవారు. 2023లో పార్టీ అధిష్టానం రెండున్నర సంవత్సరాలు మాత్రమే సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉంటారని డీకే శివకుమార్ తో చెప్పింది. అందువల్ల ఇప్పుడు ముఖ్యమంత్రి మార్పు జరుగుతోందని తెలుస్తోంది.
