లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్రానికి రావాల్సిన ఆదాయ మార్గాలన్ని ముసుకొనిపోవడంతో తెలంగాణలో గత రెండు నెలల నుంచి జీతాల కోతను అమలు చేస్తున్నారు. మే నెలలో కూడా ఉద్యోగుల జీతాలలో కోత తప్పదని కేసీఆర్ సర్కార్ ప్రకటించింది. కేసీఆర్ అధ్యక్షతన లాక్ డౌన్ తీరుతెన్నులపై సమీక్ష నిర్వహించారు. ఈ అంశంపై ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. రాష్ర్టానికి ప్రతీ నెలా 12 వేల కోట్ల వరకు ఆదాయం రావాలి. కానీ లాక్ డౌన్ తో ఇది మొత్తం పడిపోయింది. మే నెలలో కేంద్రానికి వెళ్లే పన్నుల్లో రాష్ట్ర వాటాగా రావాల్సిన రూ.982 కోట్లతో కలిపి రూ.3,100 కోట్లే వచ్చాయి. లాక్ డౌన్ నిబంధనల్లో కొన్ని సడలింపులిచ్చినా ఆదాయం పెద్దగా పెరగలేదు. రిజిస్ర్టేషన్లు, రవాణా తదితర రంగాల్లో ఆదాయం పెద్దగా రాలేదు. వచ్చిన కొద్ది మొత్తంలోనే అవసరాలన్నీ తీరాలి. రాష్ట్రం ఏడాదికి రూ.37,400 కోట్ల మేర అప్పులకు కిస్తీలుగా చెల్లించాలని ఆ ప్రకటనలో తెలిపారు. ఇవి ప్రతీ నెలా కచ్చితంగా చెల్లించాల్సిందే. అప్పులను రీషెడ్యూల్ చేయాలని రాష్ట్రం కోరినా కేంద్రం ఆ పని చేయలేదని తెలిపారు. ఎఫ్ఆర్బీఎం పరిమితి పెంచినా.. కేంద్రం విధించిన షరతులతో అదనపు రుణాలను సమకూర్చుకునే పరిస్థితి లేదు. ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు పూర్తిగా చెల్లిస్తేనే రూ.3వేల కోట్లకు పైగా వ్యయమవుతుంది. ఖజానా ఖాళీ అవుతుంది. కాబట్టి తగిన వ్యూహం సిద్దం చేసుకోవల్సి ఉందని తెలిపారు.ఈ నేపథ్యంలో అప్పుల వాయిదాలను విదిగా చెల్లించాలని, ఆసరా పెన్షన్లు యదావిదిగా ఇవ్వాలని నిర్ణయించారు.’
లాక్ డౌన్ నేపథ్యంలో పేదలకు ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యాన్ని మే నెలలోనూ అందించాలి. లాక్ డౌన్ సడలింపులతో కార్మికులకు మళ్లీ పని దొరుకుతుంది. కాబట్టి ప్రతీ కుటుంబానికి నెలకు 1500 నగదు ఇచ్చే పని మే నుంచి ఇవ్వరు. ప్రజాప్రతినిధుల వేతనాల్లో 75%, ఆలిండియా సర్వీసుల వేతనాల్లో 60%, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో 50%, పెన్షన్లలో 25% కోతలను మే నెలలోనూ కొనసాగించాలి. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాల్లో 10 శాతం కోత కొనసాగుతుందని ప్రభుత్వం ప్రకటించింది.