Manchu Manoj on Child Murder : సైదాబాద్ లోని సింగరేణి కాలనీలో జరిగిన దారుణ ఘటనను యావత్ దేశం ఖండిస్తోంది. అభంశుభం తెలియని చిన్నారిని మానవ మృగం బలిగొన్న తీరు ప్రతి ఒక్కరినీ కలచివేస్తోంది. ఈ దారుణానికి పాల్పడిన దుండగుడిని కఠినంగా శిక్షించాలని అందరూ డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే.. ప్రముఖ సినీ నటుడు మంచు మనోజ్ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారిని ఓదార్చేందుకు ప్రయత్నించారు.
ముక్కుపచ్చలారని చిన్నారిపై ఇంతటి దారుణానికి పాల్పడడం అత్యంత క్రూరమైన చర్య అని అన్నారు. ఇలాంటి సమాజంలో బతుకుతున్నందుకు బాధగా ఉందని మనోజ్ భావోద్వేగానికి లోనయ్యారు. ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా.. సమాజంలోని ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఆడ పిల్లలను గౌరవించడాన్ని చిన్నతనం నుంచే మగ పిల్లలకు నేర్పాలని సూచించారు. మార్పు ఇంటి నుంచే మొదలు కావాలని మనోజ్ ఆకాంక్షించారు.
తల్లిదండ్రులతోపాటు పాఠశాలల్లో గురువులు కూడా ఈ విషయంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. అమ్మాయిలను గౌరవించడాన్ని చిన్న తనం నుంచే అమ్మానాన్నాలు, గురువులు నేర్పాలని కోరారు. నిందితుడి జాడ దొరకలేదని పోలీసులు చెప్పడం దారుణమని మనోజ్ అన్నారు. ఈ ఘాతుకానికి పాల్పడిన వ్యక్తిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
అదేవిధంగా.. న్యాయస్థానంలో వేగంగా శిక్ష వేయించాలని కోరారు. ఛత్తీస్ గఢ్ లో శిక్ష పడిన ఓ కేసును ఉదహరించారు. అక్కడ మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య చేసిన దోషికి ఏడాదిలోనే కోర్టు ఉరిశిక్ష విధించిందని గుర్తు చేశారు మనోజ్. ఇలాంటి దుర్మార్గులకు 24 గంటల్లోనే ఉరిశిక్ష వేయాలని అన్నారు. చిన్నారి లేని లోటు పూడ్చలేమన్న మనోజ్.. కనీసం కుటుంబానికైనా అండగా ఉండాలని అందరినీ కోరారు.
సైదాబాద్ లోని సింగరేణి కాలనీలో చాక్లెట్ ఆశ చూపించి, ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి, హత్య చేసిన నిందితుడు రాజు పురారీలో ఉన్నసంగతి తెలిసిందే. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కానీ.. ఇప్పటి వరకూ అతని జాడ దొరకలేదని అధికారులు తెలిపారు. అతని దగ్గర ఫోన్ కూడా లేకపోవడంతో.. కనుగొనడం కష్టతరంగా మారిందని చెబుతున్నారు.