Revanth Reddy
Revanth Reddy: తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ సర్కార్, గత పాలకుల మరకలు తనకు అటుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. పాలనపై పట్టు సాధించడమే లక్ష్యంగా ప్రమాణస్వీకారం చేసిన రోజు నుంచే ప్రక్షాళన మొదలు పెట్టింది. డిసెంబర్ 7న ముఖ్యమంద్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్రెడ్డి అదే రోజు సాయంత్రం ఇంటలిజెన్్స చీఫ్గా శివధర్రెడ్డిని నియమించారు. సీఎం ప్రిన్సిపల్ సెక్రెటరీగా శేషాధిని నియమించి అధికారుల ప్రక్షాళన తప్పదని సంకేతం ఇచ్చారు. ఈ క్రమంలో తాజాగా రిటైర్ అయిన తర్వాత కూడా సలహాదారు హోదాలో వివిధ శాఖల్లో తిష్టవేసిన వారిని రేవంత్ ఊస్ట్ చేశారు. ఒక్క కలంపోటుతో ప్రభుత్వ సలహాదారుల నియామకాలను ప్రభుత్వం రద్దు చేశారు. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. పదవులు కోల్పోయిన వారిలో.. మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు, మాజీ సీఎస్లు సోమేశ్కుమార్, రాజీవ్శర్మ, మాజీ డీజీపీ అనురాగ్శర్మ, మాజీ సీపీ ఏకే.ఖాన్, రిటైర్డ్ పీసీసీఎఫ్ శోభ, జీఆర్.రెడ్డి ఉన్నారు.
చెన్నమనేని రమేశ్బాబు
వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబును రెండు నెలల క్రితమే అప్పటి సీఎం కేసీఆర్ వేములవాడ టికెట్ ఇవ్వకుండా, ఆయనను వ్యవసాయ శాఖకు చీఫ్ ఎడ్వైజర్గా నియమించారు. వేములవాడ ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయనకు.. మొన్నటి ఎన్నికల్లో కేసీఆర్ టికెట్ ఇవ్వలేదు. ఆయన ప్లేస్లో మరొకరిని ఎన్నికల బరిలో నిలిపి.. చెన్నమనేని రమేష్కు వ్యవసాయ శాఖ ముఖ్య సలహాదారుగా నియమించారు. ఐదేళ్ల పదవీకాలం ఉంటుందని తెలిపారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో ఆయన పదవికి శుభం కార్డు పడింది.
ఇద్దరు మాజీ సీఎస్లు..
– ఇక కేసీఆర్ ప్రభుత్వంలో చీఫ్ సెక్రెటరీలుగా పనిచేసిన రాజీవ్శర్మ, సోమేశ్కుమార్ కూడా వారు రిటైర్ కాగానే సలహాదారులుగా నియమితులయ్యారు. ఇద్దరూ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్కు సలహాదారులుగా పనిచేశారు. రాజీవ్ శర్మ అయితే దాదాపు ఐదేళ్లుగా అదే పోస్టులో ఉంటున్నారు, ఇక సోమశ్కుమార్ మూడు నెలల క్రితమే నియమితులయ్యారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక వీరి పోస్టులు ఊస్ట్ చేశారు.
మాజీ డీజీపీ..
ఇక తెలంగాణ తొలి డీజీపీగా గుర్తింపు పొందిన అనురాగ్ శర్మ కేసీఆర్కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోలీసు సైన్యం బలోపేతంలో కీలకంగా వ్యవహరించారు. కేసీఆర్పై ఈగ వాలకుండా, ప్రతిపక్షాలు ఉద్యమించకుండా ఉక్కుపాదంతో అణచివేశారు. ఇందుకు కృతజ్ఞతగా ఆయన రిటైర్ కాగానే, కేసీఆర్ అనురాగ్ శర్మను హోశాఖ సలహాదారు పోస్టు క్రియేట్ చేసి నియమించారు. ఆయన పోస్టు కూడా ఇప్పుడు ఊడిపోయింది.
ఐసీఎస్ ఏకే.ఖాన్..
ఇక మాజీ ఐపీఎస్ అధికారి ఏకే.ఖాన్. ఈయన హైదరాబాద్ కమిషనర్గా, ఆర్డీసీ ఎండీగా పనికేశారు. ఈయన మైనారిటీ సామాజికవర్గం అధకారి కావడంతో ఎంఐఎం ఒత్తిడితో కేసీఆర్ ఈయన కోసం కూడా పోస్టు క్రియేట్ చేశారు. ఖాన్ రిటైర్ కాగానే సలహాదారుగా నియమించారు.
ఐఎఫ్ఎస్ అధికారి..
1988లో అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్గా శోభ విధుల్లో చేరారు. 2019 జూలై 31న పీసీసీఎఫ్గా బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రంలో ఫారెస్ట్ ఫోర్స్కు నాయకత్వం వహించిన మొదటి ఐఎఫ్ఎస్ అధికారిగా శోభ గుర్తింపు పొందారు. సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో రాష్ట్రంలో అడవుల రక్షణ, అటవీ పునరుజ్జీవం, హరితహారం తదితర కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించారు. దీంతో ఈమె రిటైర్ కాగానే అటవీశాఖ సలహాదారు పోస్టు సృష్టించి నియమించారు.
జీఆర్.రెడ్డి..
జీఆర్ రెడ్డి ఆర్థిక శాఖలో 14వ ఆర్థిక సంఘం నిధుల కోసం కిరణ్ మార్ రెడ్డి సలహాదారుగా నియమించారు. ఆర్థికాంశాల్లో నిపుణుడైన జిఆర్ రెడ్డి ఆర్థిక శాఖలోనే పలు బాధ్యతలు నిర్వహించారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా సీఎం కేసీఆర్ ఆయనను కొనసాగించారు. రిటైర్ అయ్యాక ఆయన సేవలు వినియోగించుకునేందుకు ఆర్థిక శాఖ సలహాదారు పోస్టు సృష్టించి కొనసాగిచారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈయన సేవలకు కూడా స్వస్తి పలికింది.