CM Revanth Reddy: తెలంగాణలో కెసిఆర్ టీం అవుట్..

కెసిఆర్ ప్రభుత్వం ఏడుగురు సలహాదారులను నియమించుకుంది. వివిధ విభాగాల్లో ప్రత్యేక అధికారులను నియమించింది. వారందరినీ ఉద్వాసన పలుకుతూ రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకోవడం విశేషం.

Written By: Dharma, Updated On : December 9, 2023 6:39 pm

CM Revanth Reddy

Follow us on

CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు దిశగా అడుగులు వేస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి శ్రీకారం చుట్టారు. అటు తరువాత కెసిఆర్ నియమించిన ఏడుగురు సలహాదారులను సాగనంపుతూ ఉత్తర్వులు జారీ చేశారు. వీరితో పాటు స్పెషల్ ఆఫీసర్లను కూడా తొలగిస్తూ సిఎస్ శాంతి కుమారి ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు.

కెసిఆర్ ప్రభుత్వం ఏడుగురు సలహాదారులను నియమించుకుంది. వివిధ విభాగాల్లో ప్రత్యేక అధికారులను నియమించింది. వారందరినీ ఉద్వాసన పలుకుతూ రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకోవడం విశేషం. కెసిఆర్ హయాంలో సీఎం ముఖ్య సలహాదారుగా ఉన్న సోమేశ్ కుమార్, ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ఉన్న రాజీవ్ శర్మ, సాంస్కృతిక, దేవాదాయ సలహాదారుగా ఉన్న కె.వి.రమణాచారి, ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ఉన్న చిన్నమనేని రమేష్, హోం శాఖ సలహాదారుగా ఉన్న అనురాగ్ శర్మ, ముస్లిం మైనారిటీ సంక్షేమ సలహాదారుగా ఉన్న ఏకీ ఖాన్, అటవీ సంరక్షణ శాఖ ముఖ్య సలహాదారుగా ఉన్న శోభకు రేవంత్ సర్కార్ ఉద్వాసన పలికింది.

ఇక ప్రత్యేక అధికారుల హోదాలో ఉన్న పలువురి తొలగింపునకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇందులో ఇరిగేషన్ అడ్వైజర్ ఎస్కే జోషి,ఫైనాన్స్ డిపార్ట్మెంట్ స్పెషలాఫీసర్లు జి ఆర్ రెడ్డి, శివశంకర్, ఆర్ అండ్ బి స్పెషల్ ఆఫీసర్ సుధాకర్ తేజ, ఇంధన సెక్టార్ స్పెషల్ ఆఫీసర్లు రాజేంద్రప్రసాద్ సింగ్, ఉద్యాన శాఖ అడ్వైజర్ శ్రీనివాసరావులను ఆ హోదాలనుంచి తప్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు ఇచ్చారు. వీరి నియామకాలు రద్దు చేస్తూ సిఎస్ ఉత్తర్వులు జారీ చేయడంతో వీరంతా ఇప్పుడు ఇంటి దారి పట్టనున్నారు. వీరి స్థానంలో ప్రొఫెసర్ కోదండరాం, మరి కొంతమంది అధికారులను ప్రభుత్వ ప్రధాన సలహాదారులుగా నియమించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఉత్తర్వులు ఒకటి రెండు రోజుల్లో వెల్లడయ్యే అవకాశం ఉంది.