Red Sandalwood: ఎర్రచందనానికి కేరాఫ్ శేషాచలం అడవులు.. ఎంతో విలువైన ఈ ఎర్రచందనం దుంగలు కొట్టి స్మగ్లింగ్ చేయాలంటే.. ఎక్కడో డీప్ ఫారెస్టులోకి స్మగ్లర్ల ముఠాలు వెళ్లేవి. కానీ స్మగ్లర్లు ఇప్పుడు బాగా అభివృద్ధి చెందారు. నేరుగా తిరుమల ఘాట్రోడ్ లోనే ఆ పని పూర్తి చేస్తున్నారు. పొరపాటున ఎవరికైనా తెలియక.. పోలీసులు పట్టుకుంటే చూసీ చూడనట్లుగా వదిలేయాల్సి ఉంటుంది. పొరపాటున తెలియని వారు పట్టుకున్నప్పుడు.. అదేమీ పెద్ద విషయం కాదన్నట్లుగా వదిలేస్తున్నారు.
ఘాట్రోడ్డు మీదుగా రవాణా..
గురువారం తిరుమల ఘాట్ రోడ్ నుంచి వస్తున్న వాహనంలో ఎర్ర చందనం దుంగలు ఉన్నాయి. పోలీసులు పట్టుకున్నారు. అలా ఎన్నో సార్లు తీసుకెళ్లాం.. అది మా రాచబాట ఎవరు ఆపుతారనుకున్నారో కానీ… ఆ స్మగ్లర్కు ఇబ్బంది ఎదురైంది. ఈ ప్రోటోకాల్ తెలియని పోలీస్ ఎవరో ఆపారు. దుంగలు బయటపడ్డాయి.
మీడియాకు తెలియడంతో..
అయితే ఘాట్రోడ్డు మీదుగా ఎర్రచందనం తరలిపోతున్నట్లు మీడియాకు సమాచారం అందింది. దీంతో మీడియా అంతా అక్కడ వాలిపోయింది. అప్రమత్తమైన పోలీసులు విధిలేక పట్టుకున్న వాహనం స్టేషన్కు తరలించారు. అయితే, 24 గంటల పాటుకేసుపెట్టలేదు. దుంగల వాహనాన్ని కూడా మాయం చేశారు. గగ్గోలు రేగే సరికి.. కేసు పెట్టారు.
ఎంతపెద్ద ముఠానో?
నేరుగా తిరుమల ఘాట్ రోడ్ లో ఎర్ర చందనం దుంగల స్మగ్లింగ్ అంటే.. ఎంత పెద్ద ముఠా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఆ ముఠా వెనుక కూడా అంతే పెద్ద నెట్వర్క్, నేతలు ఉంటారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయినా అదేదో చిన్న విషయం అన్నట్లుగా వదిలేశారు. పోలీసులు కూడా అంతే ఉన్నారు. దొంగల జోలికి వెళ్తే తమకు సమస్యలు ఎదురవుతాయని భయపడుతున్నారు.
టీడీపీ పాలనలో గగ్గోలు..
టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎర్రచందనం స్మగ్లింగ్పై వైసీపీ నేతలు గగ్గోలు పెట్టారు. ప్రభుత్వమే స్మగ్లింగ్ను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. కానీ, ఇప్పుడు వైసీపీనే అధికారంలో ఉంది. నేరుగా తిరుమల ఘాట్రోడ్డు మీదుగానే రెడ్ శాండల్ రవాణా అవుతోంది. అయినా.. పాలకులు స్పందించడం లేదు. కనీసం పట్టించుకోవడం లేదు. తమకు ఏమీ తెలియదు అన్నట్లు వ్యవహరించడం అనేక సందేహాలకు తావిస్తోంది.